రాష్ట్రంలో ప్రైవేటు సంస్థ ద్వారా ఇసుక విక్రయాలు ఈ నెల 16 నుంచి మొదలుకానున్నట్లు తెలిసింది. ఈ సంస్థకు అన్ని ఓపెన్ రీచ్లు అప్పగించాలని గనులశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. అన్ని జిల్లాలో ఇసుక తవ్వకాలు, విక్రయాల టెండర్ను జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ అనే సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ ఇసుక విక్రయాలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పటికే సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.120 కోట్లు జమ చేసింది.
రెండేళ్లపాటు ఇసుక తవ్వకాలు, విక్రయాలపై ఒకటి, రెండు రోజుల్లో గనుల శాఖతో ఒప్పందం చేసుకోనుంది. 15 రోజుల పాటు విక్రయించే ఇసుకకు సంబంధించి ముందుగానే ప్రభుత్వానికి రూ.31-32 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఆ మొత్తాన్ని కూడా ఒకటి, రెండు రోజుల్లో చెల్లించి ఈ నెల 16 నుంచి ఇసుక బాధ్యతలు చేపడుతుందని గనుల శాఖ వర్గాల సమాచారం. రీచ్ గానీ, దాని సమీపంలో ఏర్పాటు చేసుకున్న నిల్వ కేంద్రం వద్ద టన్ను రూ.475కు మించకుండా ఆ సంస్థ విక్రయించాల్సి ఉంటుందని, ఆన్లైన్ బుకింగ్ లేకుండా ఎవరైనా నేరుగా అక్కడికి వెళ్లి ఇసుక తెచ్చుకోవచ్చని పేర్కొంటున్నారు.
16 లోపు ఆన్లైన్లో ఇసుక బుక్ చేసుకున్నవారికి ఏపీఎండీసీ ద్వారా సరఫరా చేయనున్నారు. కొత్త సంస్థ బాధ్యతలు తీసుకున్నాక.. అప్పటికే ఆన్లైన్లో బుక్ చేసుకున్నవారికి ఇసుక సరఫరా జరగకపోతే, వాటిని రద్దుచేసి ఆయా బుకింగ్దారులకు డబ్బులు వెనక్కి ఇవ్వనున్నారు.
రేవులు అప్పగించండి
*నదుల్లో ఓపెన్ రీచ్లను కొత్త సంస్థకు అప్పగించాలని గనులశాఖ ఉన్నతాధికారులు ఆయా జిల్లాల అధికారులను సోమవారం ఆదేశించారు. కొత్త రీచ్లను గుర్తించడమే కాకుండా, వాటికి అన్ని అనుమతులు లభించేలా చూడాలని తెలిపారు.
*ప్రతి రీచ్, నిల్వ కేంద్రం, డిపోలను గనులశాఖ అధికారి, జిల్లా ఇసుక అధికారి, ప్రైవేటు సంస్థ ప్రతినిధి సంయుక్తంగా పరిశీలించి.. ఇసుక నిల్వ వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. ఆ ఇసుకకు చెందిన మొత్తాన్ని ప్రైవేటు సంస్థ, ఏపీఎండీసీకి ఇవ్వాలని పేర్కొన్నారు.