ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 1, 2020, 5:35 PM IST

Updated : Aug 1, 2020, 9:02 PM IST

ETV Bharat / city

మాణిక్యాలరావు మృతి పట్ల రాజకీయ ప్రముఖుల దిగ్భ్రాంతి

మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన మృతి పట్ల సీఎం జగన్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్​ ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. మాణిక్యాలరావు మృతి పార్టీకి తీరని లోటని భాజపా నేతలు సోము వీర్రాజు, సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

మాణిక్యాలరావు మృతి పట్ల రాజకీయ ప్రముఖుల దిగ్భ్రాంతి
మాణిక్యాలరావు మృతి పట్ల రాజకీయ ప్రముఖుల దిగ్భ్రాంతి

భాజపా నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాణిక్యాలరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరపాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్​ను ఆదేశించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

చంద్రబాబు దిగ్భ్రాంతి

మాణిక్యాలరావు మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకశ్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. మాణిక్యాలరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ సైతం మాణిక్యాలరావు మృతికి సంతాపం తెలిపారు. మాణిక్యాలరావు మరణం తమను తీవ్రంగా కలచివేసిందని తెదేపా నేత చినరాజప్ప అన్నారు. ఆయన మృతి పట్ల మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు సంతాపం తెలిపారు.

నటుల సంతాపం

మాణిక్యాలరావు మృతి పట్ల ప్రముఖ నటులు చిరంజీవి, నందమూరి బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పార్టీ నేతల సంతాపం

మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మృతి బాధాకరమని.. భాజపా రాష్ట్ర నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. జిల్లా స్థాయి నాయకుడి నుంచి మంత్రి స్థాయి వరకు అంచెలంచెలుగా ఎదిగి.. ప్రస్తుత రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్రమంలో ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మాణిక్యాలరావు మృతి పట్ల సోమువీర్రాజు తీవ్ర దిగ్భ్రాంతి

మాణిక్యాలరావు మరణవార్త తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్‌ అన్నారు. కొవిడ్ బారిన పడి మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. మాణిక్యాలరావు మృతి భాజపాకు తీరని లోటని ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మాణిక్యాలరావు సేవలు ఇప్పటికీ స్వయం సేవక్ భావ జాలానికి కట్టుబడి ఉన్నాయని.. ప్రజల కోసం ఎల్లప్పుడూ కష్టపడే వ్యక్తిత్వం ఆయన సొంతమని ఆర్​ఎస్​ఎస్​ నేత భాగయ్య అన్నారు.

మాణిక్యాలరావు మృతి పార్టీకి తీరని లోటన్న భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ

కామినేని సంతాపం

మాణిక్యాలరావు మరణం రాష్ట్ర భాజపాకు తీరని లోటు. నాలుగు సంవత్సరాల పాటు ఆయనతో కలిసి మంత్రిగా పనిచేశా. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా. ఆయన ప్రజలు, పార్టీ పట్ల నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

- కామినేని శ్రీనివాస్​, మాజీ మంత్రి

తరలివచ్చిన నేతలు

విజయవాడ హెల్ప్‌ ఆస్పత్రిలోని మాణిక్యాలరావు పార్థీవ దేహాన్ని సందర్శించేందుకు భాజపా నేతలు తరలివచ్చారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన భౌతిక కాయాన్ని అంబులెన్స్​లో విజయవాడ నుంచి తాడేపల్లిగూడెం తరలించారు. మాణిక్యాలరావు పార్థివ దేహానికి అంబులెన్స్​ వద్ద భాజపా నేత కన్నా లక్ష్మీ నారాయణ నివాళులర్పించారు.

ఇదీ చూడండి..

కరోనాతో మాజీ మంత్రి పి.మాణిక్యాలరావు కన్నుమూత

Last Updated : Aug 1, 2020, 9:02 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details