వ్యక్తిగత రుణాల పేరిట పలువురిని అప్పుల ఉచ్చులోకి దించి... వేధింపులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు నిఘా పెట్టారు. రుణాలు తీసుకున్న వారు బలవన్మరణాలకు పాల్పడుతుండడాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. నిబంధనలు పాటించకుండా అంతర్జాలంలో ప్రకటనలు గుప్పిస్తూ... అప్పు తీసుకున్న వారిని వేధిస్తున్న ఓ యువకుడు పదుల సంఖ్యలో యాప్లు రూపొందించాడని సైబరాబాద్ పోలీసులు విచారణలో బయటపడింది. బాధితుల ఫిర్యాదు మేరకు అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. యువకుడి బ్యాంక్ ఖాతాల్లో వివరాలను పరిశీలించిన ఆనంతరం అతడికి బినామీ ఖాతాలున్నాయా... స్నేహితులు, సన్నిహితుల ఈ-వ్యాలెట్లలోకి నగదు బదిలీ చేశాడా... వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. ఆన్లైన్ కాల్ మనీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండడంతో... ఓ ఐపీఎస్ అధికారి స్వయంగా విచారణ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.
చరవాణిలోని యాప్ల ద్వారా రుణాలిస్తున్న యువకుడు నాలుగైదు నెలల నుంచి మొబైల్ యాప్లను తయారు చేస్తున్నట్టు పోలీసు విచారణలో అంగీకరించాడు. ఆన్లైన్ ద్వారా రుణాలిస్తున్న మైక్రో ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులను సంప్రదించాక... తాను సైతం సొంతంగా యాప్లను తయారు చేసి గూగుల్ ప్లేస్టోర్లో ఉంచాలన్న ఆలోచన కలిగిందంటూ సదరు యువకుడు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఇప్పటి వరకు ముగ్గురు బాధితులు ఇతడి యాప్ల ద్వారా రుణం తీసుకున్నారని... వీరిలో ఇద్దరు పదిహేను రోజులకు తాము తీసుకున్న అప్పు మొత్తానికి 48శాతం వడ్డీ అదనంగా చెల్లించారని... ఇంకా డబ్బు చెల్లించాలంటూ వేధిస్తుంటే వీటిని భరించలేక ఫిర్యాదులు చేశారు.