ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోలవరం ఖర్చంతా కేంద్రమే భరించాలి: మాజీ ఎంపీ ఉండవల్లి

By

Published : Jan 28, 2021, 3:58 AM IST

పోలవరం ప్రాజెక్టు విషయంలో 30 వేల కోట్ల రూపాయలకుపైగా కోత పెట్టాలని కేంద్రం చూస్తోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ హైకోర్టులో వాదించారు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని ప్రకటించినందున.... ఖర్చు మొత్తం కేంద్రమే భరించాల్సి ఉందని గుర్తుచేశారు. పార్లమెంట్‌లో చేసిన చట్టాన్ని పట్టించుకోకుండా నిబంధనల్ని విస్మరిస్తూ..... సంబంధం లేనట్లు కేంద్రం వ్యవహరిస్తోందన్నారు.

Polavaram Project
పోలవరం ప్రాజెక్టు

పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందున వ్యయం మొత్తం కేంద్రమే భరించేలా ఆదేశించాలని కేవీపీ రామచంద్రరావు దాఖలు చేసిన పిల్‌లో..... మాజీ ఎంపీ ఉండవల్లి ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు వినిపించిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌..... పోలవరం ప్రాజెక్టు 2013-14 అంచనా ధరల ప్రకారం రాష్ట్రానికి రావాల్సింది 7 వేల 53 కోట్ల రూపాయలు మాత్రమేనని..... కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ పేర్కొనడం సరికాదన్నారు. సుమారు 30 వేల కోట్ల రూపాయలకు పైగా కోతపెట్టాలని చూస్తున్నారన్నారు.

2004 నుంచి పోలవరం ప్రాజెక్టు విషయంలో పని చేశానన్న ఉండవల్లి..... విభజన చట్టంలోని సెక్షన్‌-90లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినట్లు స్పష్టంగా ఉందన్నారు. దీని ప్రకారం ప్రాజెక్టు అభివృద్ధి, వ్యయం మొత్తాన్ని కేంద్రమే భరించాలన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రజల్ని ఆదుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రాంతంలో భారీగా నీటిని పంపింగ్‌ చేస్తుండటం వల్ల...... పశ్చిమగోదావరి జిల్లాలో రబీ సాగుకు నీటికొరత ఏర్పడిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఉండవల్లి వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.... ఈ వ్యాజ్యంపై విచారణను ఇకపై సాగదీయడం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. హైకోర్టులో పిల్‌ను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయాన్ని తెలపాలని.... సహాయ సొలిసిటర్ జనరల్‌కు స్పష్టం చేసింది. విచారణను మార్చి 17కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

నంద్యాల విజయ డెయిరీ ఛైర్మన్​పై అట్రాసిటీ కేసు

ABOUT THE AUTHOR

...view details