నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు ఈరోజు బందైంది. ఆయుష్ బృందం అప్పటికే కృష్ణపట్నంలో పర్యటించగా..తర్వాత ఐసీఎంఆర్తో కలిసి నివేదిక ఇవ్వాల్సి ఉంది. అప్పటి వరకు ఈ మందు పంపిణీకి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ మందు తమపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదని వాడిన వారు ఆయుష్ బృందానికి తెలిపారు. ఈరోజు మందు తయారీ విధానాన్ని ఆనందయ్య ప్రభుత్వానికి చూపించనున్నారు. తదనంతరం దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఈ మందు కోసం వివిధ రాష్ట్రాల నుంచి జనం తండోపతండాలుగా రావటంతో కరోనా సామహిక వ్యాప్తికి అవకాశం ఉందని వైద్యవర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
కరోనా సెకండ్ వేవ్తో దేశం ఇబ్బందిపడుతున్న వేళ నెల్లూరులోని కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే మందు కోసం కొన్ని రోజులుగా జనం బారులు తీరుతున్నారు. దాదాపు 20 రోజులుగా ఆనందయ్య ఈ మందును ఉచితంగా కరోనా రోగులకు అందిస్తున్నారు. శుక్రవారం నుంచి ఈ మందు పంపిణీ చేస్తారంటూ స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ చేసిన ప్రకటనతో నెల్లూరు పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది వాహనాల్లో కృష్ణపట్నం తరలివచ్చారు. శుక్రవారం ఉదయం 6గంటలకే వేలాది మందితో గ్రామం కిక్కిరిసింది. తొమ్మిది గంటల సమయంలో ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించగా ప్రజలు ఎగబడ్డారు. సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. క్యూలైన్లలో స్వల్ప తోపులాట కూడా జరిగింది. కొందరు అంబులెన్సుల్లో కరోనా రోగులను కృష్ణపట్నానికి తీసుకువచ్చారు. గందరగోళ పరిస్థితుల మధ్య మధ్యాహ్నం నుంచి పంపిణీ నిలిపివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. మళ్లీ ఎప్పుడు ఇచ్చే తేదీని తర్వాత ప్రకటిస్తారని చెప్పడంతో ప్రజలు ఆందోళన చేశారు.
కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య డిగ్రీ వరకూ చదువుకున్నారు. ఆయన చదువుకునే సమయంలోనే ఆయుర్వేదంపై పట్టుసాధించారు. ఆయుర్వేదంలో తనకున్న అనుభవంతో పాటు కొంతమంది మేధావుల దగ్గర సలహాలు తీసుకుని వనమూలికలు, ఇతర పదార్థాలతో కరోనా మందు తయారుచేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అల్లం, తాటిబెల్లం, తేనె, నల్ల జీలకర్ర, తోక మిరియాలు, పట్టా, లవంగాలు, వేప ఆకులు, నేరేడు, మామిడి చిగుళ్లు, నేల ఉసిరి, కొండ పల్లేరుకాయలు, బుడ్డ బుడస ఆకులు, పిప్పింటి ఆకుల చెట్టు, తెల్లజిల్లేడు, పూలమొగ్గలు, ముళ్ల వంకాయలతో మందు తయారు చేసినట్లు ఆనందయ్య తెలిపారు. ఔషధం తీసుకున్న వారికి కరోనా తగ్గుతోందనే ప్రచారంతో జనం ఎగబడ్డారు.