ప్రస్తుత ఉరుకులు పరుగుల ప్రపంచంలో అన్ని వర్గాల వారికి ద్విచక్ర వాహనం నిత్యావసరంగా మారింది. ప్రతి దానికీ ఇది లేనిదే పనికాని పరిస్థితి నెలకొంది. వాహన రంగంలో కొత్త ప్రమాణాలు అమలులోకి రావడంతో ధరలు పెరిగాయి. బీఎస్6 వాహనాల ధరలు ఒకేసారి 10 నుంచి 30 శాతం వరకు ఎగబాకాయి. ఇది సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు భారంగా మారింది. కొత్త ఫీచర్స్ వస్తున్నాయన్న సంతోషం కంటే అధికంగా వెచ్చించాల్సి రావడంతో చాలా మంది పాత వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. కరోనా అందరి జీవితాల్లో కల్లోలం సృష్టించింది. దీని ప్రభావం ఆదాయ వనరులపై పడింది. ఈ పరిస్థితుల్లో అత్యవసరమైన వాటికే ఖర్చు చేయాల్సి వస్తోంది. అది కూడా ఆచితూచి స్పందిస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పాత మోడళ్లను కొనుగోలు చేస్తున్నారు.
ఎందుకు పెరిగాయి?
కాలుష్యాన్ని వీలైనంతగా తగ్గించేందుకు భారత్లో ‘ఇండియా 2000’తో ప్రమాణాల అమలు మొదలైంది. 2017 ఏప్రిల్ నుంచి బీఎస్4 శ్రేణి వాహనాలనే రిజిస్ట్రేషన్కు అనుమతించారు. ఈ గడువు కూడా ఈ ఏడాది మార్చి 31తో పూర్తి అయింది. బీఎస్5 అమలు విషయంలో ప్రభుత్వం సత్వరం నిర్ణయం తీసుకోలేదు. దీన్ని వదిలి ఒకేసారి ఏప్రిల్ నుంచి బీఎస్6 ప్రమాణాలు అమలులోకి వచ్చాయి. వాహనాలలో సదుపాయాల విషయంలో దానికి అనుగుణంగా చాలా మార్పులు జరిగాయి. వీటి వల్ల విడుదల అయ్యే ఉద్గారాలు కనిష్ఠ స్థాయిలో ఉంటాయి. కొత్త ప్రమాణాలకు అనుగుణంగా మార్పు, చేర్పులు చేయడంతో ధరలు పెరిగాయి.
వాటిపైనే అందరి దృష్టి..
ఆటోమొబైల్ రంగానికి విజయవాడ ప్రసిద్ధి. నగరంలో దాదాపు 100కు పైగా ఆటో కన్సల్టెన్సీ ఏజెన్సీలు ఉన్నాయి. పాత వాటిని కొనుగోలు చేసేవారు ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు. బీఎస్6 వాహనాలు వచ్చిన దగ్గర నుంచి పాత వాటికి ఎక్కడ లేని డిమాండ్ నెలకొంది. సామాన్యులు కొనే 100 నుంచి 125 సీసీ వాహనాల వరకు 10 శాతం వరకు ధరలు పెరిగాయి. ఇంత వెచ్చించలేని వారు సెకండ్ హ్యాండ్ బైక్లు కొనే సంస్కృతి విజయవాడలో పెరిగింది. పాత మోడళ్ల క్రయ, విక్రయాలు సాగే నగరంలోని అరండల్పేట పెద్ద మార్కెట్. ఇక్కడ గతంలో ఒక్కో ఏజెన్సీ గతంలో రోజుకు 5 వరకు అమ్మేది. ఇప్పుడు ఈ సంఖ్య పదికి పెరిగిందని చెబుతున్నారు. ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుండడంతో వీటికి కూడా గిరాకీ పెరిగింది. ఎక్కువ మంది తమ బడ్జెట్ను బట్టి కొనుగోళ్లు చేస్తున్నారు. ముఖ్యంగా రూ. 20 వేల నుంచి రూ.50 వేల మధ్య ఉన్న వాహనాలను అధికులు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అమ్ముడుపోతున్న వాటిల్లో ఎక్కువ మంది స్కూటీలు కొంటున్నారని విజయవాడ ద్విచక్ర వాహనాల ఆటో కన్సల్టెన్సీ సంఘం ప్రతినిధి రాంబాబు వివరించారు. కేవలం మహిళలే కాకుండా, నడి వయస్కులు, వృద్ధులు కూడా వీటిని కొనేందుకే ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. స్పోర్ట్స్, 350 సీసీ బైకులను కొనేందుకు యువత ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని చెప్పారు.