ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నిరుపేదలకు సత్వర న్యాయ సాయం అందించండి' - NV Ramana live conference on Chairpersons of Legal Services authority states

నిరుపేదలకు వేగంగా న్యాయ సహాయం అందించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యానిర్వాహక అధ్యక్షుడు, సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ..... రాష్ట్రాల న్యాయ సేవా ప్రాధికార సంస్థలను ఆదేశించారు. న్యాయ సేవా సంస్థలు ప్రాధాన్యం ఇవ్వాల్సి అంశాలు, వ్యవస్థాగతంగా బలోపేతంగా చేయాల్సిన విషయాలపై దిశానిర్దేశం చేశారు.

nv-ramana-with-live-conference-on-states-chairpersons-of-legal-services-authority
జస్టిస్ ఎన్వీ రమణ

By

Published : Dec 17, 2019, 8:13 AM IST

'నిరుపేదలకు సత్వర న్యాయ సాయం అందించండి'

జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ... అన్ని రాష్ట్రాల న్యాయ సేవల ప్రాథికార సంస్థల ఛైర్మన్లు సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. న్యాయసేవా సంస్థలు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అంశాలు, వ్యవస్థాగతంగా బలోపేతం చేయాల్సిన విషయాలు వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న న్యాయసేవా సంస్థల ప్రణాళికలు, ఆలోచనలు తెలుసుకొని వాటి అమలు కోసం మరింత సమన్వయంతో పనిచేయడం ఎలా అనే అంశంపై చర్చించారు. అర్హులైన పేదలకు కోర్టుల్లో న్యాయసహాయం అందించడం కోసం తీసుకోవాల్సిన చర్యలు, ప్యానెల్‌ న్యాయవాదులకు నిర్మాణాత్మక శిక్షణ తరగతులపైనా మాట్లాడారు. జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలు జిల్లా స్థాయి సంస్థలు సమర్థంగా అమలు చేయడం, వాటి పనితీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంపై జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దిశానిర్దేశం చేశారు. అన్ని న్యాయసేవా ప్రాధికార సంస్థల కార్యాలయాలను వన్‌స్టాప్‌ సెంటర్లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఈ రంగాన్ని మరింత నైపుణ్యంగా, సమస్యలపై వెంటనే స్పందించేలా తీర్చిదిద్దే అంశంపైనా చర్చించారు.

న్యాయవాదులకు శిక్షణ

అరెస్టుకు ముందు.. అరెస్టు... రిమాండ్‌ దశల్లో అందించే సహాయం గురించి విస్తృత ప్రచారం కల్పించడంపై దృష్టిపెట్టాలని జస్టిస్‌ ఎన్వీ రమణ సూచించారు. న్యాయ సహాయం అవసరమైన సందర్భాల్లో ఒక వ్యక్తిని పోలీసు స్టేషన్‌కు పిలిపించినప్పటి నుంచీ సమర్థంగా సాయం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రీ-అరెస్ట్‌, అరెస్టు, రిమాండ్‌లకు సంబధించిన న్యాయపరమైన అంశాలపై న్యాయవాదులకు పూర్తిస్థాయి శిక్షణ ఇప్పించాలని, అప్పుడు వారు కక్షిదారుల తరఫున సమర్ధంగా కోర్టుల్లో వాదనలు వినిపించగలుగుతారని అభిప్రాయపడ్డారు. అప్పీళ్లు దాఖలు చేయాలనుకున్న ఖైదీల్లో ఎవరు న్యాయం సహాయం కోసం ఎదురుచూస్తున్నదీ గుర్తించి వారి తరఫున సకాలంలో అప్పీళ్లు దాఖలు చేసేలా చూడాలని నిర్దేశించారు. అలాగే అండర్‌ ట్రయల్స్‌లో బెయిల్‌ దరఖాస్తుల దాఖలు కోసం ఎదురుచూస్తున్న వారిని గుర్తించి వెంటనే తగిన సాయం అందించాలన్నారు.

అలాంటి వారిని గుర్తించాలి

న్యాయవాదులకు తగిన శిక్షణ ఇచ్చి జైళ్లలోని న్యాయసేవా కేంద్రాలను క్రియాశీలం చేయాలని జస్టిస్‌ ఎన్వీ రమణ సూచించారు. అప్పీళ్లు దాఖలు చేయాలేని స్థితిలో ఉన్న ఖైదీలు, జైలుశిక్షకు మించి కారాగారంలో మగ్గుతున్న నేరస్థులను గుర్తించేందుకు విస్తృతంగా ప్రయత్నించాలని చెప్పారు. ఉచిత న్యాయసేవ, సలహా అందుకోవడానికి ఖైదీలందరికీ హక్కుందన్న విషయం గురించి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అప్పీళ్లు దాఖలు చేయడానికి ప్రైవేటు న్యాయవాదులను పెట్టుకోలేని స్థితిలో ఉన్న ఖైదీలకు వేగంగా చేయూత అందించాలని సూచించారు. ఖైదీల తరఫున దాఖలు చేసిన అప్పీళ్లు హైకోర్టుల్లో ఏ స్థాయిలో ఉన్నదీ ఎప్పటికప్పుడు వారికి సమాచారం అందించాలని నిర్దేశించారు. ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీలో నిర్వహిస్తున్న న్యాయసేవా అవగాహన ప్రచారాన్ని అన్ని రాష్ట్రాలకూ విస్తరింపజేయాలని నిర్ణయించారు. 2020లో ఫిబ్రవరి, ఏప్రిల్‌, జులై, సెప్టెంబర్‌, డిసెంబర్‌ నెలల్లో రెండో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌లు నిర్వహించాలని తీర్మానించారు.

ఇదీ చూడండి : పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పాక్​ తీర్మానం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details