ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 15, 2020, 9:48 AM IST

ETV Bharat / city

పెరిగిన కరోనా వైరస్ శాతం.. ఆగాలి ఆసాంతం!

గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. టెస్టుల సంఖ్య పెరగడంతో కేసులు భారీగా నమోదవుతున్నాయి. ర్యాపిడ్‌ పరీక్షల ఆధారంగా విశ్లేషిస్తే వారంలో 16.5 శాతం మందికి వైరస్‌ వచ్చినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Covid 19 cases increasing in the  hyderabad
Covid 19 cases increasing in the hyderabad

తెలంగాణప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా రాజధాని హైదరాబాద్​లో కరోనా విస్తరిస్తూనే ఉంది. వివిధ ప్రాంతాల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా వేలాదిమంది వీధుల్లోకి రావడంతో కొవిడ్‌ చాపకింద నీరులా పాకుతోంది. నగరంపై దృష్టి సారించి వైరస్‌ విస్తరించకుండా చర్యలు చేపట్టాలని, లక్షకుపైగా ర్యాపిడ్‌ పరీక్షలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌, వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశాలతో అధికారులు కదిలారు. ఈనెల 8 నుంచి 14 వరకు 9,707 ర్యాపిడ్‌ పరీక్షలు చేయగా 1602 మందికి పాజిటివ్‌ అని తేలింది. మంగళవారం 3,597 మందికి పరీక్షలు చేయగా 607 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అంటే 16.5 శాతం మందికి వైరస్‌ ఉన్నట్లు తేలిందని హైదరాబాద్‌ జిల్లా వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఘోరంగా విఫలం

కరోనా వైరస్‌ వెలుగులోకి వచ్చిన తొలినాళ్లలో మహానగరంలో వ్యాధిగ్రస్తుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. వైరస్‌ వ్యాప్తి చెందిన ప్రాంతాలను కంటెన్మెంట్‌ జోన్లగా ప్రకటించి కఠిన ఆంక్షలు విధించడం వల్ల జన సంచారం చాలావరకు తగ్గింది. వైరస్‌ విస్తరణ కూడా అంతగా లేదు. అయితే నెలరోజులుగా జీహెచ్‌ఎంసీ, వైద్య, పోలీసు శాఖలు కొంత నిర్లక్ష్యం ప్రదర్శించాయి. వ్యాధిగ్రస్తులను గురించడంలో ఘోరంగా విఫలమయ్యాయి. పాజిటివ్‌ వచ్చిన వారి విషయంలోనూ తగిన చర్యలు తీసుకోలేదు. పాజిటివ్‌ వచ్చిన వారితో తిరిగిన వారిని గుర్తించి వారిని ఇళ్లలోనే స్వీయ నిర్బంధం చేసి ఉంటే బాగుండేది. తమ సిబ్బందికీ వైరస్‌ సోకడంతో కరోనా బాధితుల ఇళ్లను గుర్తించే ప్రక్రియను బల్దియా దాదాపుగా నిలిపివేసింది. కొన్ని జోన్లలో తూతూమంత్రంగా చేపట్టారు.

ర్యాపిడ్‌ పరీక్షలు నమ్మొచ్చా..

ఈ ర్యాపిడ్‌ పరీక్షల్లో కొంత కచ్చితత్వం లోపించింది. పాజిటివ్‌ ఫలితాల వరకు బాగానే ఉన్నా పూర్తిస్థాయిలో లక్షణాలున్న రోగులను కొన్నిసార్లు పాజిటివ్‌గా చూపించకుండా నెగెటివ్‌గా చూపిస్తున్నాయి. మలక్‌పేటకు చెందిన కుటుంబంలో భర్త వారం రోజులుగా తీవ్ర జర్వం, ఇతర కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. మన్సూరాబాద్‌లో మంగళవారం ర్యాపిడ్‌ పరీక్ష చేయించుకుంటే అతనికి నెగెటివ్‌గా, అతని భార్య ఇద్దరు పిల్లలకు పాజిటివ్‌గా వచ్చింది. భర్త ద్వారా కుటుంబికులకు వ్యాప్తి చెందినా భర్తకు నెగెటివ్‌ రావడం గమనార్హం. నెగెటివ్‌ వచ్చిన వారికి పాజిటివ్‌ రాకూడదని లేదని, పూర్తి కచ్చితత్వం కోసం ఆర్టీ పీసీఆర్‌ పరీక్ష చేయాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అంటే రోగుల శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇప్పటికైనా మేల్కొంటేనే ఫలితం!

రాజధానిలో ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 26 వేల మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో అధిక శాతం కోలుకున్నా వ్యాధి తీవ్రతతో ఆస్పత్రుల్లో ప్రమాదకర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య కూడా వందల్లోనే ఉంది. ఈ నేపథ్యంలో కంటెన్మెంట్‌ జోన్లను ఏర్పాటు చేస్తామని బల్దియా ప్రకటనతో సరిపెట్టకుండా తక్షణ చర్యలకు ఉపక్రమిస్తే వ్యాధి విస్తరణకు అడ్డకట్ట వేయొచ్చు.

ABOUT THE AUTHOR

...view details