కర్నూలు జిల్లాలో కరోనా మరణాలు ఆగట్లేదు. కొవిడ్ రోగులు ఆక్సిజన్ స్థాయి 80 శాతం కంటే తక్కువ ఉన్నప్పుడు ప్రాణభయంతో పరుగులు తీస్తున్న రోగులు... వెంటిలేటర్లు ఖాళీగా లేవని చెప్పగానే మరింత ఆందోళనకు గురవుతున్నారు. కేంద్రం వెంటిలేటర్లు పంపించినా వాటిని వినియోగంలోకి తీసుకురావటంలో అధికారులు నిర్లక్ష్యం చూపటం రోగులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. టెక్నీషియన్ లేరని, నిర్వహణపై అవగాహన లేదనే కారణాలతో వాటిని పెట్టెల్లోనే అలా దాచి ఉంచారు.
నిర్వహణ చేయలేని పరిస్థితి
కర్నూలు జిల్లాలో చికిత్స పొందుతూ మరణించిన 389 మందిలో... ఆక్సిజన్ స్థాయి తగ్గి ప్రాణం విడిచినవాళ్లు ఎక్కువగా ఉందని వైద్యుల పరిశీలనలో తేలింది. ఈ సమస్య కేంద్రం దృష్టికి వెళ్లటంతో... పీఎం కేర్ కింద జిల్లాకు ఇప్పటివరకూ 333 వెంటిలేటర్లు అందించారు. కర్నూలు సర్వజన ఆసుపత్రికి 273, ఆదోని ఏరియా ఆసుపత్రికి 20, నంద్యాల వైద్యశాలకు 60 అందించారు. జీజీహెచ్కి ఇచ్చిన వాటిలో ఎన్ని వినియోగంలో ఉన్నాయో తెలియని పరిస్థితి. ఆదోనిలో స్థలం, గదులు కేటాయించకపోవటం వల్ల వాటిని ఎక్కడ అమర్చాలో ఇంకా నిర్ణయించలేదు. నంద్యాలకు పంపించినవీ ఇంకా వినియోగంలోకి తేలేదు. అనస్థీషియా వైద్యులు, టెక్నీషియన్స్, నర్సుల సంఖ్య తక్కువగా ఉండటంతో.. వెంటిలేటర్లు వినియోగింలోకి తెచ్చినా నిర్వహణ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇవన్నీ అందుబాటులోకి తీసుకురావాలంటే ముందుగా టెక్నీషియన్స్, నర్సులను నియమించుకోవాల్సి ఉందని వైద్యులు తెలిపారు.