ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మార్కెట్లలో కరోనా నిబంధనల పట్ల నిర్లక్ష్యం.. తప్పదు భారీ మూల్యం - no covid rules in markets

మానవాళిని ఏడాదికాలంగా.. కరోనా కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఊహించని విధంగా ప్రపంచం మీద విరుచుకుపడిన మహమ్మారి తొలిదశలోనే జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. పోయినట్లేపోయి.. రెండోదశలో మరింత కల్లోలం సృష్టిస్తోంది. వేలమంది వైరస్‌ బారిన పడుతుండగా ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. జనాల నిర్లక్ష్యం, ఏమవుతుందనే అతివిశ్వాసమే వైరస్‌కు ఆహ్వానం పలుకుతోంది. ముఖ్యంగా రైతుబజార్లు, మాంసం, చేపల మార్కెట్లు, వ్యాపార సముదాయాల్లో జాగ్రత్తలైతే మచ్చుకైనా కనిపించటంలేదు. వెరసి, తమకు తామే కాదు.. పక్కనున్న వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

no covid rules in telangana markets
మార్కెట్లలో కరోనా నిబంధనల ఉల్లంఘన

By

Published : Apr 19, 2021, 8:23 PM IST


ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి వైద్యారోగ్య జారీ చేసిన సూచనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని నిపుణులు చెబుతున్నా.. పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. తెలంగాణలో రైతుబజార్లు, హోల్‌సేల్‌ మార్కెట్లలో కొవిడ్‌ జాగ్రత్తలు గాలికొదిలేస్తున్నారు. వినియోగదారులు కొంతవరకూ మాస్కులు ధరిస్తున్నా.. దుకాణదారులు అస్సలు పట్టించుకోవడం లేదు. గతంలో మాదిరిగా శానిటైజర్ల వినియోగం, థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయడం ఎక్కడా కనిపించడం లేదు. హైదరాబాద్‌లో 11 రైతు బజార్లుండగా వాటిలో కూరగాయలు అమ్మే దుకాణదారులే మాస్కులు సరిగా పెట్టుకోవట్లేదు. ఫలక్‌నుమా, మెహిదీపట్నం, కొత్తపేట, ఎర్రగడ్డ రైతుబజార్లకు నిత్యం పెద్దసంఖ్యలో వినియోగదారులు వస్తారు. అయినా మాస్కులు ధరించటంలో.. జనం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. భౌతికదూరం పాటించకపోగా గుంపులు గుంపులుగా సంచరిస్తున్నారు.

మహబూబ్‌నగర్‌లోని మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి రైతుబజార్‌, మాంసం, చేపల దుకాణాలకు జనం పోటెత్తుతున్నారు. కరోనా కోరలు చాస్తున్నా.. జనం ఎక్కడా కొవిడ్ నిబంధనలు ఎక్కడా అమలు కావడంలేదు. ఎవరి ఇష్టానుసారం వారు వ్యవహరిస్తున్నారు. జనసమ్మర్థం అధికంగా ఉండే ప్రాంతాలకు తప్పనిసరై వెళ్తున్నప్పుడు.. మాస్క్ ధరించడం సహా వీలైనంత వరకూ భౌతిక దూరం పాటించాల్సి ఉన్నా పట్టించుకున్న వారే లేరు. జాగ్రత్తలు పాటించని వినియోగదారులకు సేవలను అందించకుండా ఉండాల్సిన దుకాణయజమానులే మాస్కులు ధరించట్లేదు. కొన్ని దుకాణాల్లో కనీసం శానిటైజర్ అందుబాటులో లేదు. పక్కపక్కనే దుకాణాలు ఉండటంతో వినియోగదారులు భౌతికదూరాన్ని పాటించలేని దుస్థితి.

లాక్‌డౌన్‌ సమయంలో కూరగాయల కోసం జనం ఒక దగ్గరకి రాకూడదన్న ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కూరగాయలు, పండ్ల మార్కెట్లు ఏర్పాటు చేశారు. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా వాటి ముందు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మాస్కు లేనిదే సేవలు లేవనే బోర్డులు తగిలించారు. ఇప్పడు అవేవి అమల్లో లేకపోవడంతో జనం ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు.

కరోనా తొలిదశలో ఒకరి నుంచి మరో ఇద్దరు ముగ్గురికి మాత్రమే వైరస్‌ వ్యాపించగా.. ప్రస్తుతం మాత్రం పదిమంది వరకు ప్రభావం చూపుతోంది. ఎక్కువ మంది గుమిగూడితే మరింత వేగంగా విస్తరించే అవకాశాలున్నాయి. కొందరి నిర్లక్ష్యం మరికొందరి శాపంగా మారుతోందని అధికారులు చెబుతున్నారు. పోలీసులు జరిమానాలు విధించినా.. అధికార యంత్రాంగం అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా మార్పు రావాల్సింది ప్రజల్లోనే. అందుకే ఎవరికి వారు బాధ్యతగా వ్యవహరిస్తేనే కరాళ నృత్యం చేస్తున్న కరోనా రక్కసికి సంకెళ్లు వేయగలుగుతామని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి:

1 నుంచి 9వ తరగతి వరకు సెలవులు.. పది, ఇంటర్‌ పరీక్షలు యథాతథం

ABOUT THE AUTHOR

...view details