ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రేషన్ కార్డుల వడపోత పూర్తి... అనర్హులు ఎందరో తెలుసా..?

By

Published : Feb 8, 2020, 6:26 AM IST

రాష్ట్రంలో రేషన్‌ కార్డులకు భారీగా కోత పడనుంది. మెరుగైన ఆర్థిక, సామాజిక స్థితిగతులు కలిగి ఉన్నందున 18 లక్షల 72 వేల మందికి రేషన్‌ అర్హత లేదని ప్రభుత్వం తేల్చింది. ఈ నెల 15 నుంచి బియ్యం కార్డులు, వచ్చే నెల నుంచి రేషన్‌ పంపిణీ చేయనుంది.

new ration cards to be distribute in Andhra Pradesh
రేషన్ కార్డుల వడపోత పూర్తి... అనర్హులు ఎందరో తెలుసా..?

రాష్ట్రంలో రేషన్ కార్డుల వడపోత పూర్తైంది. కొత్తగా ఇవ్వబోతున్న బియ్యం కార్డులకు అర్హుల ఎంపిక కొలిక్కి వచ్చింది. ఒకటీ, రెండూ కాదు... ప్రస్తుతం తెల్లకార్డులున్న వారిలో ఏకంగా 18 లక్షల 72 వేల కుటుంబాలను అనర్హులుగా ప్రభుత్వం తేల్చింది. ఒక్కో కుటుంబానికి సగటున ముగ్గురు సభ్యుల చొప్పున చూసినా... సుమారు 55 లక్షల మందికి నెలనెలా బియ్యం, ఇతర సరకుల పంపిణీ నిలిచిపోనుంది. ఫలితంగా ప్రభుత్వానికి ఏటా బియ్యం రూపంలోనే 14 వందల 49 కోట్లు ఆదా కానుంది.

రేషన్‌ కార్డుల స్థానంలో కొత్తగా బియ్యం కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పథకాలకూ అర్హులను వేర్వేరుగా గుర్తిస్తోంది. ఇందుకోసమే వైఎస్సార్‌ నవోదయం పథకాన్ని ప్రారంభించి, ఇంటింటి సర్వే చేయించింది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల వివరాలను వాలంటీర్లకు ఇచ్చి, జాబితాలు తయారు చేయించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, నెలకు 2వందల యూనిట్లకు పైగా విద్యుత్తు వినియోగించేవారు, 4 చక్రాల వాహనాలున్నవారు, 750 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లున్న వారిని అనర్హులుగా తేల్చింది.

వాటి ఆధారంగా ఈనెల 2 వరకూ అభ్యంతరాలు స్వీకరించి, తుది జాబితా రూపొందించింది. కార్డుదారులందరి వివరాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15వేల ఒక గ్రామ సచివాలయాలు, క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ చేస్తున్నారు. వీరికి ఈనెల 15 నుంచి కొత్త బియ్యం కార్డులు ఇచ్చి, మార్చి నుంచి రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇంకా అర్హులుంటే దరఖాస్తులు తీసుకొని... ప్రతి నెలా కొత్త కార్డులు జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు.

జిల్లా కార్డుల సంఖ్య
గుంటూరు 2లక్షల 26 వేలు
కృష్ణా 2లక్షల 11వేలు
తూర్పు గోదావరి లక్షా 93 వేలు
అనంతపురం లక్షా 62 వేలు
చిత్తూరు లక్షా 55 వేలు
నెల్లూరు లక్షా 49 వేలు
విశాఖ లక్షా 34 వేలు
కర్నూలు లక్షా 31 వేలు
పశ్చిమ గోదావరి లక్షా 25 వేలు
కడప లక్షా 12 వేలు
శ్రీకాకుళం 74 వేలు
విజయనగరం 64 వేలు

ABOUT THE AUTHOR

...view details