ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 4, 2022, 4:55 PM IST

ETV Bharat / city

టెన్త్ పరీక్షల్లో సర్కారు ఫెయిల్.. ఇంటర్​లోనైనా పాస్​కండి : లోకేష్

పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. లీకేజ్​ ఘటనలకు బాధ్యత వహిస్తూ.. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. కనీసం ఇంట‌ర్ ప‌రీక్షలనైనా పక‌డ్బందీగా నిర్వహించాలని హితవు పలికారు. పరీక్షలు కూడా సమర్థంగా నిర్వహించలేని ప్రభుత్వమెందుకు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నిలదీశారు.

పదో తరగతి పరీక్షల నిర్వహణలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నారాలోకేశ్ విమర్శించారు. రోజుకో చోట ప్రశ్నపత్రం లీకేజ్‌ జరుగుతోందని.. ప్రశ్నప్రత్రాలు వైకాపా నేతల వాట్సాప్‌లలోనే తిరుగుతున్నాయని ఆరోపించారు. లీకేజ్​ ఘటనలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన పదవి నుంచి తప్పుకోలన్నారు. పదో తరగతి పరీక్షల నిర్వహణలో విఫలమైన ప్రభుత్వం.. కనీసం ఇంటర్ పరీక్షలనైనా పకడ్బందీగా నిర్వహించాలని నారాలోకేశ్ హితవు పలికారు. పీఆర్సీపై నిరసన తెలిపిన టీచర్లపై ప్రభుత్వం కక్ష సాధిస్తుందన్న లోకేశ్.. ప్రశ్నపత్రాల లీకేజ్‌ బాధ్యులుగా చూపుతూ వారిని సస్పెండ్‌ చేస్తున్నారని ఆరోపించారు.

పరీక్షలు కూడా సమర్థంగా నిర్వహించలేని ప్రభుత్వమెందుకు?: రాష్ట్ర వ్యాప్తంగా పదవతరగతి ప్రశ్నపత్రాల లీకేజీలో కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పటంలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. పదవతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీలపై సీఎం జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. లీకేజీలకు కారకులుగా ఇప్పటికే పలువురిని అరెస్టు చేసినట్లు చెబుతున్నారన్న రామకృష్ణ.. విద్యాశాఖ మంత్రి మాత్రం ఎక్కడా లీకేజీ లేనట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీనే లేకపోతే.. అరెస్టులు ఎందుకు చేస్తారని ఆయన ప్రశ్నించారు. పరీక్షలు కూడా సమర్థంగా నిర్వహించలేని ప్రభుత్వమెందుకు అని నిలదీశారు.

ఇదీ జరిగింది:ఏప్రిల్‌ 27న ప్రారంభమైన పదో తరగతి పరీక్షల్లో తెలుగు పేపర్‌ నుంచి గణితం వరకు ప్రశ్నపత్రాలు ముందుగానే సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ముందుగానే బయటకొచ్చిన ప్రశ్నపత్రాల ఆధారంగా చిట్టీలతో సమాధానాలు పరీక్ష కేంద్రాలకు చేరవేస్తున్నారు. మాస్‌ కాపీయింగ్‌ పెరిగిపోతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రతిభకు ప్రాధాన్యం లేకుండా పోతోందని మనోవ్యధకు గురవుతున్నారు.

పదో తరగతి పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇప్పటి వరకు 42 మంది టీచర్లును అరెస్టు చేయగా... వారందరినీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే నంద్యాల జిల్లా నందికొట్కూరులో గత నెల 19న ఆంగ్లం పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీకి కారకులైన ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్‌కు పంపారు. అరెస్టు అయిన ఉపాధ్యాయులు.. ఉద్దేశపూర్వకంగానే మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పిడినట్లు రుజువైతే సర్వీస్ నుంచి తొలగించాలని విద్యాశాఖ యోచిస్తోంది.

ఇదీ చదవండి:పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్‌.. ఘటనలపై ప్రభుత్వం సీరియస్​

ABOUT THE AUTHOR

...view details