తక్కువ ధరలకే మాస్క్లు అమ్ముతాం.. అధిక ధరలకు మాస్కులు కొంటాం.. అంటూ సైబర్ కేటుగాళ్లు వెబ్సైట్లలో ప్రకటనలు గుప్పించి రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్లోని పాతబస్తీలో ఉంటున్న ఓ వైద్యుడి నుంచి రూ.4.05 లక్షలు కొట్టేసిన సైబర్ నేరస్థులు తాజాగా ఒక్కరోజు వ్యవధిలో ఒక వైద్యుడు, వ్యాపారి నుంచి రూ.1.11 లక్షల నగదు బదిలీ చేసుకున్నారు.
మరికొందరు సైబర్ నేరస్థులు పలు కంపెనీలు, ఎన్-91, ఎన్-95 మాస్క్ల పేరుతో ప్రకటనలు ఇస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన మాస్క్లు ఇళ్లకు చేరకుండా నగదు బదిలీ చేయవద్దని ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. అంతర్జాలంలో మాస్క్ల ప్రకటనలను తాము కూడా పరిశీలిస్తున్నామని, అనుమానం వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఎన్-95 మాస్క్లంటూ...
నగరంలోని ఓ కార్పొరేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుడొకరు ఎన్-95 మాస్క్లు వందల సంఖ్యలో అవసరం కావడం వల్ల ఎక్స్పోర్ట్ ఇండియా డాట్కాం వెబ్సైట్ చూశాడు. ఎన్-95 మాస్క్లను తాము విక్రయిస్తున్నామని, దిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నందున ఆర్డర్ చేస్తే రెండురోజుల్లో మీ చిరునామాకు పంపిస్తామని చెప్పారు.
సరేనన్న వైద్యుడు.. తక్కువ ధరకు ఇవ్వండి అని అడగ్గా వారు అంగీకరించారు. అడ్వాన్సుగా రూ.56 వేల నగదు పంపించాలని వారం క్రితం వారు కోరడం వల్ల వైద్యుడు సైబర్ నేరస్థులు సూచించిన ఖాతాలో నగదు జమ చేశాడు. డబ్బు ముట్టిందని, మాస్క్లను పంపుతున్నామనే సమాధానం వచ్చింది. ఏప్రిల్ 28న మాస్కులు ఆసుపత్రికి వస్తాయని చెప్పారు. ఏప్రిల్ 28న రాకపోవడం వల్ల 29న వస్తాయని వైద్యుడు అనుకున్నారు. 29న రాకపోవడంతో ఏప్రిల్ 30న సైబర్ నేరస్థులకు ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ అని రావడం వల్ల సాయంత్రం వరకు ప్రయత్నించి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి... రాష్ట్రంలో.. లక్ష దాటిన కరోనా పరీక్షలు