అమరావతి కోసం దర్గా వద్ద పొంగళ్లు పెట్టిన ముస్లిం మహిళలు - అమరావతి రైతుల ఆందోళనలు
రాజధాని అమరావతి ప్రాంతంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు ఆ ప్రాంత రైతులు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాళ రాయపూడిలో దర్గా వద్ద ముస్లిం, హిందూ మహిళలు పొంగళ్లు పెట్టారు. అలాగే రైతుల ఆందోళనలకు గుంటూరు, కడప జిల్లాకు చెందిన ముస్లిం పెద్దలు మద్దతు తెలిపారు.
![అమరావతి కోసం దర్గా వద్ద పొంగళ్లు పెట్టిన ముస్లిం మహిళలు Amaravati farmer's protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5994587-867-5994587-1581087426237.jpg)
రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న డిమాండ్తో ప్రజాందోళనలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మనసు మార్చాలని వేడుకుంటూ ముస్లిం, హిందూ మహిళలు కలిసి రాయపూడిలోని దర్గా వద్ద పొంగళ్లు పెట్టారు. అనంతరం దీక్షా శిబిరానికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రభుత్వం రాజధాని అంశంపై దిగి వచ్చే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని మహిళలు తెలిపారు. మరోవైపు రాయపూడిలో రైతుల దీక్షకు గుంటూరు, కడప జిల్లాల నుంచి వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు మద్దతు పలికారు. దీక్షా శిబిరానికి వచ్చిన రాయపూడికి చెందిన ముస్లిం పెద్దలను గుంటూరు వాసులు సన్మానించారు. శాసనమండలిలో ఛైర్మన్ షరీఫ్ రాజధాని బిల్లులను సమర్థవంతంగా నిలువరించారని.. ముస్లింలకు వన్నె తెచ్చారని కొనియాడారు. ఈ నేపథ్యంలో ముస్లింలను గౌరవిస్తూ సన్మానం చేసుకుంటున్నామని గుంటూరు వాసులు తెలిపారు.