ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 5, 2019, 2:25 PM IST

ETV Bharat / city

ఇవాళ నాగోల్​లో విజయారెడ్డి అంత్యక్రియలు

తెలంగాణలో దాడికి గురై చనిపోయిన తహసీల్దార్ విజయారెడ్డి మృతదేహానికి హైదరాబాద్‌ నాగోల్‌లోని స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం ముగిసిన అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఉద్యోగులు, శ్రేయోభిలాషుల సందర్శనార్థం కొత్తపేట్​లోని గ్రీన్ హిల్స్ కాలనీలో భౌతికకాయాన్ని ఉంచారు. ఇవాళ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలిరానున్న రెవెన్యూ ఉద్యోగసంఘాల నాయకులు, సిబ్బంది అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.

Breaking News

ఇవాళ నాగోల్​లో విజయారెడ్డి అంత్యక్రియలు

భూవివాదం నేపథ్యంలో సజీవదహనమైన తహసీల్దార్ విజయారెడ్డి మృతదేహానికి కుటుంబ సభ్యులు ఈ రోజు దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం సురేశ్ అనే వ్యక్తి చేతిలో హత్యకు గురైన విజయారెడ్డి మృతదేహాన్ని సాయంత్రం 4 గంటల సమయంలో ఉస్మానియా శవాగారానికి తీసుకొచ్చారు. భర్త సుభాశ్ రెడ్డి అనుమతితో మరణాణంతర పరీక్ష నిర్వహించారు.

విజయారెడ్డి తల్లితో పాటు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఉస్మానియా ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి కలెక్టర్ తో పాటు..డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు ఉస్మానియా ఆస్పత్రి వద్దకు చేరడంతో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. పోలీసులు ముందు జాగ్రత్తగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు కొత్తపేటలోని గ్రీన్ హిల్స్ కాలనీకి తీసుకెళ్లారు. విజయారెడ్డి కుటుంబ సభ్యులు, కాలనీవాసులు భారీగా ఇంటికి తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.

సూర్యాపేట జిల్లా మునుగోడు మండలం కల్వర్‌పల్లికి చెందిన సుభాశ్ రెడ్డికి, నకిరేకల్‌కు చెందిన విజయారెడ్డితో పదుకొండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 9ఏళ్ల పాప, ఐదేళ్ల వయసున్న బాబు ఉన్నారు. భర్త సుభాష్ రెడ్డి హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. 2009లో గ్రూప్ -2 లో ఎంపికైన విజయారెడ్డి కొంతకాలంగా కొత్తగా ఏర్పాటైన అబ్దుల్లాపూర్ మెట్ మండల తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అంతకన్నా ముందు మల్కాజ్ గిరి తహసీల్దార్ గా పనిచేశారు.

అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్‌గా పని ఒత్తిడి కారణంగా బదిలీ కోసం కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు తోటి రెవెన్యూ అధికారులు తెలిపారు. అంతలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విజయారెడ్డి కుటంబసభ్యులను పరామర్శించారు. ఇలాంటి ఘటనలు హేయమైనవన్న డీజీపీ మహేందర్‌ రెడ్డి నిందితుడికి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కల్పించేలా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు . విజయారెడ్డి హత్యకు నిరసనగా మూడు రోజుల పాటు విధుల బహిష్కరించాలని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని పిలుపునిచ్చాయి.

ABOUT THE AUTHOR

...view details