అఖిల భారత సర్వీసు అధికారులపై కొనసాగుతున్న ముఖ్యమంత్రి పేషీ వేధింపుల అడ్డుకోవాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాను కోరారు. ఈ మేరకు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనా నియమాలను గాలికి వదిలేయడంతో.. అరాచక పరిస్థితులు నెలకొన్నాయని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో సివిల్ సర్వీసు అధికారులు ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేయడం మినహా.. ఏ ఒక్క పనీ చేయడం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని సంతృప్తి పర్చేందుకు ఏకపక్షంగా పని చేస్తున్నారని తెలిపారు.
ప్రధానమంత్రి ఈ నెల నాలుగో తేదీన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు హాజరయ్యారని, ప్రొటోకాల్ ప్రకారం తాను హాజరుకావల్సి ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం పలు అడ్డంకులు సృష్టించిందని రాజీవ్ గౌబా దృష్టికి తీసుకెళ్లారు. తన ఫోన్ కాల్కు సమాధానమిచ్చినందుకు.. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతిని సీఎం కార్యాలయానికి పిలిపించి బెదిరించారని రఘురామ ఆరోపించారు. సీఎం కార్యాలయం నుంచి ఇటువంటి బెదిరింపులను నిరోధించకపోతే.. బ్యూరోక్రసీ పూర్తిగా అచేతనమయ్యే ప్రమాదం ఉందని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు.