ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 10, 2020, 4:29 PM IST

ETV Bharat / city

ఆ పత్రికతో ముఖ్యమంత్రికి నిజాలు తెలియవు: రఘురామ

పెయిడ్ ఆర్టిస్టులు రాసిన ఆర్టికల్స్, కట్టుకథలు, అవాస్తవాలు ఉన్న పత్రిక ద్వారా ముఖ్యమంత్రికి నిజాలు తెలియవని ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న నిజాలు బయటకి తేవడానికి చాలా మంది కేసులు పెడతారేమో అనే భయంతో ఉన్నారని అన్నారు. నిమ్మగడ్డ రమేశ్​కుమార్ ఎన్నికల కమిషనర్​గా ఉండగా.. ఎన్నికలు జరపవద్దని నేతలు డరోనాతో భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

MP Raghu Rama Krishna Raju controversial comments on YCP
రఘురామకృష్ణరాజు

పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణరాజు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పెయిడ్ ఆర్టిస్టులు రాసిన ఆర్టికల్స్, కట్టుకథలు, అవాస్తవాలు ఉన్న పత్రిక ద్వారా ముఖ్యమంత్రికి నిజాలు తెలియవని పేర్కొన్నారు. "ఆ పత్రికలో తేదీ, వారం తప్ప.. మిగిలినవి అన్నీ అసత్యాలే. మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న కాలేజీని భ్రష్టుపట్టించే ప్రయత్నాలు ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయని పూర్వ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న నిజాలు బయటకి తేవడానికి చాలా మంది కేసులు పెడతారేమో అనే భయంతో ఉన్నారు" అని ఆరోపించారు.

మాన్సాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న అక్రమాలపై పూర్వ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాలని రఘురామకృష్ణరాజు సూచించారు. నిరసనలు తెలియజేయాలని చెప్పారు. న్యాయస్థానాల్లో కేసులు వేసి పోరాడాలని, అప్పుడే న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. పూర్వట్రస్టును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజు నిజాయతీ ప్రతి ఒక్కరికీ తెలుసని పేర్కొన్నారు. నిమ్మగడ్డ రమేశ్​కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలకు విఘాతం కలుగుతుందని తమ పార్టీ నేతలు భయపడుతున్నారని చెప్పారు. ఆయన ఎన్నికల కమిషనర్​గా ఉండగా.. ఎన్నికలు జరపవద్దని నేతలు డరోనాతో భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. నిమ్మగడ్డపై కులముద్రవేసి తమకు జరిగిన అవమానంపై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేశారు. ఏపీ సీఎం ఎంతగానో అభిమానించే కేసీఆర్ శాసనమండలి, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుపుతున్నారు. గాంధీ మళ్లీ పుట్టిన ఆంధ్రప్రదేశ్​లో గాంధీ గ్రామస్వరాజ్య ప్రతీక అయిన స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి. ఏపీ సీఎంకు ఉన్న భయం కరోనా కాదు.. డరోనా. గతంలో ఏకగ్రీవం అయిన ఎన్నికలు స్వచ్ఛందం కాదు నిర్భంధం. ప్రజాస్వామ్య వ్యవస్థ మీద తమ పార్టీకి నమ్మకం ఉంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని, ఇష్టం లేకపోయినా కుల ముద్రవేసిన నిమ్మగడ్డతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చ జరపాలి. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారిని ఏపీలోని ప్రైవేట్ హాస్పిటళ్లలో అనుమతించడంలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.- రఘురామకృష్ణరాజు, ఎంపీ

ABOUT THE AUTHOR

...view details