ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 29, 2020, 11:57 AM IST

ETV Bharat / city

సీతక్క: అడవిలో అక్క.. ఆదివాసీలకు అమ్మ

ఆపదకాలంలో అడవిబిడ్డల పాలిట ఆమె ఆశాదీపమైంది. ఆదివాసీల ఆకలి తీర్చేందుకు నిత్యం కొండాకోనల్లో పర్యటిస్తోంది. గిరిజనుల కష్టాలు తెలిసిన అక్కగా... ఆపన్నులకు అమ్మగా.... విపత్కర పరిస్థితుల్లో ఉన్న తన ప్రజల కోసం పరితపిస్తోంది తెలంగాణలోని ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క. గన్‌‌తో ఉన్నా.... గన్‌మెన్‌తో ఉన్నా..... అడవి బిడ్డల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సీతక్క... పేదల ఆకలి తీర్చేందుకు 'గో హంగర్‌ గో' పేరుతో ఛాలెంజ్‌ విసిరారు. ప్రజా సేవలో సరికొత్త ఒరవడి సృష్టించారు.

సీతక్క: అడవిలో అక్క.. ఆదివాసీలకు అమ్మ
సీతక్క: అడవిలో అక్క.. ఆదివాసీలకు అమ్మ

సీతక్క: అడవిలో అక్క.. ఆదివాసీలకు అమ్మ

కరోనా మహమ్మారి కష్టజీవుల బతుకులను దుర్భరం చేసిన వేళ.... ఎంతో మందికి పూటగడవటమే కష్టంగా మారింది. అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసీలైతే.. మరింత దయనీయ స్థితిలో జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అడవి బిడ్డలకు ఆశాదీపంగా.... వారి ఆకలి తీర్చే దిశగా నిరంతరం పరితపిస్తున్నారు.... తెలంగాణలోని ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్‌ సీతక్క.

లాక్‌డౌన్‌ కారణంగా తన నియోజకవర్గంలో తిప్పలు పడుతున్న ప్రజల కోసం ఆమె చేస్తున్న కృషి.... ప్రజాప్రతినిధి అన్న పదానికి సరైన నిర్వచనంగా నిలుస్తోంది. మండుటెండను సైతం లెక్కచేయకుండా.... కొండలు, కోనల్లో కాలినడకన, ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లలో గిరిజన ప్రాంతాలకు వెళ్తూ.... నిత్యావసర సరకులను అందిస్తున్నారామె. రాత్రింబవళ్లు గుత్తికోయల గూడేల్లో పర్యటిస్తూ... ప్రజల్లో భరోసా నింపుతున్నారు.

ఇప్పటివరకు 320 గ్రామాల్లో పర్యటన

ములుగు నియోజకవర్గంలో 700కు పైగా పల్లెలుండగా.... ఇప్పటి వరకు 320 గ్రామాల్లో పర్యటించిన సీతక్క... అందరికీ నిత్యావసర సరకులు అందజేశారు. ఆదివాసీలకు బియ్యం, కూరగాయలు, నూనె, పప్పుదినుసులు ఇలా 15 రోజులకు సరిపడేలా పంపిణీ చేస్తున్నారు. రవాణా సౌకర్యం సరిగాలేని గిరిజన ప్రాంతాలకు సరకులను ఎడ్ల బండ్లలో, ట్రాక్టర్లలో పంపిస్తున్నారు. అవసరమైతే భుజాల మీద మోస్తూ తీసుకువెళ్లి ప్రజలకు అందిస్తున్నారు.

కరోనా పట్ల అవగాహన తక్కువగా ఉండే గిరిజన గూడేల్లో.... వైరస్‌ వ్యాప్తిపై తెలియజేస్తూ.... మాస్కులు పంపిణీ చేస్తున్నారు. చిన్నపిల్లలు, మహిళలకు పౌష్ఠికాహారం, అప్రమత్త చర్యలను తెలియజేస్తున్నారు. ఆదివాసీల ప్రాంతాల్లో పర్యటిస్తున్న క్రమంలో... ఆమె నిరాడంబరత, పేదలపై చూపించే ఆప్యాయత ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. గిరిజన గ్రామాల పర్యటనలో చెలిమల్లో దప్పిక తీర్చుకుంటూ.... అడవుల్లోనే సేదతీరుతున్నారు.. సీతక్క.

'గో హంగర్‌ గో'

లాక్‌డౌన్‌ దృష్ట్యా పేదల ఆకలి తీర్చేందుకు వినూత్న సవాల్‌ను సీతక్క ప్రారంభించారు. 'గో హంగర్‌ గో' పేరుతో ఛాలెంజ్‌ను ఏర్పాటు చేసి.... ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇందులో భాగంగా.... గవర్నర్ తమిళిసై, ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌అలీకి ఆమె సవాల్‌ విసిరారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సీతక్క చేస్తున్న సాహసం, సేవపై నెట్టింట్లో ప్రశంసలు వర్షం కురుస్తోంది. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఆమె సేవలను.... తెలుగు రాష్ట్రాల ప్రజలు కొనియాడుతున్నారు.

ఇవీ చూడండి:

రోనా కేసులు తగ్గుముఖం.. 12 జిల్లాల్లో జాడలేదు

ABOUT THE AUTHOR

...view details