‘తిరుపతి ఉప ఎన్నికలో వెంకటేశ్వరస్వామిని రాజకీయంగా వాడుకునే ప్రయత్నాన్ని కొన్ని పార్టీలు చేస్తున్నాయి, అలాంటివారిపై ఆ స్వామే కన్నెర్ర చేసి శిక్షిస్తాడు, వైకాపా అభ్యర్థికి 5లక్షలకు పైగానే మెజారిటీ వచ్చేలా ఆశీర్వదిస్తాడు. ఈ ఎన్నికల్లో నోటాను దాటేందుకు దేశంలోనే పెద్దపార్టీ ప్రయత్నిస్తోంది, డిపాజిట్ అయినా దక్కించుకోవాలని ఇంకోపార్టీ ప్రయత్నిస్తోంది’ అని పరోక్షంగా భాజపా, తెదేపాలను ఉద్దేశిస్తూ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ‘కరోనా కష్ట కాలంలో ముఖ్యమంత్రి జగన్ రూ.90వేల కోట్లు అప్పులు తెచ్చి పేదలకు అండగా ఉన్నారని, ఎన్టీఆర్, వైఎస్ వారసుడిగా ఆయన ప్రజల్లో నిలిచారు’ అని పేర్కొన్నారు.
132 శాతం అధికంగా అప్పులు చేయలేదా?: అంబటి
‘మీ హయాంలో 132.31శాతం అదనంగా అప్పులు చేయలేదా? ఆ అప్పులతో వచ్చిన డబ్బును కాంట్రాక్టర్ల జేబుల్లోకి పంపలేదా’ అని ప్రతిపక్ష నేత చంద్రబాబును ఉద్దేశించి వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. ‘ఆదాయానికి మించి అప్పులు చేయడానికి మీకెవరిచ్చారు అధికారమని చంద్రబాబు మాట్లాడుతున్నారు. అయిదేళ్లు రాష్ట్రాన్ని పాలించమని ప్రజలే మాకు అధికారం ఇచ్చారు’ అని వ్యాఖ్యానించారు. ‘ప్రత్యేక హోదా కోసం మేం నిరంతరం అడుగుతూనే ఉంటాం, అవసరమైనపుడు పోరాటం చేస్తాం. భాజపాకు కేంద్రంలో పూర్తి మెజారిటీ ఉన్నందున వారి మెడలు వంచలేకపోతున్నాం. ఎన్టీఆర్ వారసులకు పౌరుషమే ఉంటే తెదేపాను చంద్రబాబు సర్వనాశనం చేసే పరిస్థితి రాకుండా కాపాడుకునేవారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కాదు ఇంకెవరొచ్చినా తెదేపాను కాపాడలేరు.’ అని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి:కొవిడ్ను తరిమికొట్టాలంటే.. వ్యాక్సినేషన్ తప్ప మరోమార్గం లేదు: సీఎం