తెలంగాణలోని మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేటలోని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భూముల్లో అధికారులు సర్వే పూర్తి చేశారు. జమున హేచరీస్ భూముల్లో సర్వే చేసిన రెవెన్యూ అధికారులు ఆక్రమణలు జరిగినట్లు గుర్తించారు. అసైన్డ్ భూములను జమునా హేచరీస్ కబ్జా చేసింది వాస్తవమేనని మెదక్ కలెక్టర్ హరీశ్ తెలిపారు. 70.33 ఎకరాల్లో ఆక్రమణలు జరిగాయని స్పష్టం చేశారు. సర్వే జరుగుతున్న సమయంలో ఈటల అనుకూల, వ్యతిరేక వర్గాలు... జమున హేచరీ ముందు నిరసనకు దిగాయని తెలిపారు. వారికి పోలీసులు నచ్చజెప్పి పంపిచారని స్పష్టం చేశారు.
జమునా హేచరీస్లో 70.33 ఎకరాలు కబ్జా చేసినట్లు సర్వేలో తేలింది. 56 మంది అసైనీల భూములను కబ్జా చేశారు. అచ్చంపేట, హకీంపేట్ పరిధిలో అసైన్డ్ భూములు కబ్జాకు గురయ్యాయి. జమునా హేచరీస్ యాజమాన్యం అక్రమంగా కబ్జా చేసింది. అసైన్డ్ భూములను వ్యవసాయేతర అవసరాలకు వాడుతున్నారు. అనుమతులు లేకుండా పెద్ద పెద్ద షెడ్డులు నిర్మించారు. నిషేధిత జాబితాలోని భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి అటవీప్రాంతంలో రోడ్లు వేశారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి చెట్లు నరికారు. పౌల్ట్రీ నుంచి కాలుష్యం వెదజల్లుతున్నట్లు గుర్తించాం. అక్రమాలకు పాల్పడినవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం.
పెద్ద ఎత్తున ఆక్రమణలు జరుగుతున్నా.. పెద్ద పెద్ద షెడ్లు వేస్తున్నా.. అధికారులు చూస్తూ ఉండిపోయారు. పైగా నిషేధిత జాబితాలోని భూములకు రిజిస్ట్రేషన్ చేశారు. అక్రమాలకు సహకరించిన అధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. బాధిత అసైనీలకు న్యాయం చేసేలా కృషి చేస్తాం. ఈ నేపథ్యంలోనే అసైన్డ్ భూముల కబ్జా, అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి నివేదిక పంపాం.