ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 5, 2022, 4:06 AM IST

Updated : May 5, 2022, 10:24 AM IST

ETV Bharat / city

పోలవరం భూసేకరణలో భారీ అక్రమాలు.. లబోదిబోమంటున్న బాధితులు

స్థలాలు, సర్వే నంబర్లు అవే..! డీ-పట్టాల్లో(D- Patta) పేర్లు మాత్రం మారుతున్నాయి. లబ్ధిదారులకు అందాల్సిన పరిహారం మోసగాళ్ల ఖాతాల్లోకి చేరుతోంది. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పోలవరంలో నిర్వాసితులకు అందాల్సిన పరిహారంలో చోటుచేసుకుంటున్న అక్రమాలివి..! అసలైన భూయజమానులు పరిహారం అందక ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతూ అవమానాలు ఎదుర్కొంటుంటే.. అక్రమార్కులు దొంగ డీ-పట్టాలు సృష్టించి.. గంటల వ్యవధిలోనే డబ్బులు కాజేస్తున్నారు. పాత అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి మరీ అక్రమాలు సాగిస్తున్నారు.

Massive irregularities in Polavaram land acquisition
పోలవరం భూసేకరణలో భారీ అక్రమాలు

పోలవరం భూసేకరణలో భారీ అక్రమాలు.. లబోదిబోమంటున్న బాధితులు

Scam in Polavaram Project Land Acquisition: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డీ-పట్టాల్లో భారీ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు అక్రమార్కులు.. నకిలీ డీ-పట్టాలు సృష్టించి.. పరిహారాన్ని కాజేస్తున్నారు. అసలైన నిర్వాసితులు ఏళ్ల తరబడి తిరుగుతున్నా రాని పరిహారం.. అక్రమార్కులు సృష్టిస్తున్న నకిలీ పట్టాలకు మాత్రం గంటల వ్యవధిలోనే వచ్చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో దళారులు, కొందరు అధికారులు కుమ్మక్కై చేస్తున్న మాయాజాలమిది. కొండ పోరంబోకు భూములకు నకిలీ డీ- పట్టాలు, దొంగ లబ్ధిదారులను సృష్టించి.. కోట్ల రూపాయలలో పరిహారాన్ని దండుకుంటున్న వ్యవహారమిది.

స్థానికంగా ఉన్న కొందరు దళారులకు తోడుగా.. కొందరు రెవెన్యూ సిబ్బంది, ఆర్​ అండ్ బీ అధికారుల సహకారంతో వందల ఎకరాల్లో నకిలీ డీ-పట్టాలు జారీ అయిపోతున్నాయి. దానికి పరిహారమూ చెల్లించేస్తున్నారు. గిరిజన లబ్ధిదారుల పేర్లు, వారి పొలాల సర్వే నంబర్లతోనే ఈ నకిలీ పత్రాలను సృష్టించి వారి పేరిట పరిహారాన్ని కూడా కాజేస్తున్న ఉదంతాలు ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల్లో వెలుగుచూస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా దేవీపట్నం మండలంలో ఈ అక్రమాలు తాజాగా బయటపడ్డాయి.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ప్రధాన జలాశయానికి, కుడి కాలువల నిర్మాణానికి భూమిని సేకరిస్తున్నారు. మరోవైపు నిర్వాసిత గ్రామాల పునరావాస ప్రక్రియ సాగుతోంది. ఈ సమయంలోనే దేవీపట్నం మండలంలోని చినరమణయ్యపేట, గుబ్బలంపాలెం గ్రామాల్లో ఈ నకిలీ డీ-పట్టాల బాగోతం వెలుగులోకి వచ్చింది. ఎకరానికి ఏడున్నర లక్షల చొప్పున ఇప్పటికే ఆ మొత్తాలు నకిలీ లబ్ధిదారులకు అందించడం, ఆ సొమ్ము చేతులు మారడం కూడా పూర్తయిపోయింది.

గత కొన్నేళ్లుగా ఒక్క దేవీపట్నం మండలంలోనే 345 ఎకరాల వరకు ఇలా అక్రమ పట్టాల రూపేణా పరిహారం దారిమళ్లినట్లు తెలుస్తోంది. ఎప్పటి నుంచో సాగుచేసుకుంటున్న భూమికి తాము యజమానులుగా ఉన్నా.. అందని పరిహారం.. తమ సర్వే నంబర్లను డివిజన్ చేసిన దొంగ పట్టాలకు మాత్రం వెంటనే వచ్చేసిందని నిర్వాసితులు వాపోతున్నారు.

పోలవరం ప్రాజెక్టు వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే దేవీపట్నం మండలం గుబ్బలంపాలెం, చినరమణయ్యపేట, సీతారం గ్రామాలకు చెందిన గిరిజనులు, గిరిజనేతరులు.. తమ భూములకు పరిహారం అందుతుందని ఎన్నాళ్ల నుంచో వేచిచూస్తున్నారు. పరిహారం కోసం అధికారులు చుట్టూ తరుగుతూనే ఉన్నప్పటికీ.. ఫలితం లేకుండా పోతోంది. పరిహారం దారిమళ్లిందని తెలుసుకుని ప్రశ్నిస్తే తమపైనే ఎదురు కేసులు పెట్టారని బాధితులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

గతంలో ఈ ప్రాంతంలో పనిచేసిన తహశీల్ధార్లు సంతకాలను ఫోర్జరీ చేసి మరీ దొంగ పట్టాలను సృష్టిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భూసేకరణ కార్యాలయానికి చెందిన అధికారులు, సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా భూములకు జెన్యూనిటీ సర్టిఫికెట్ల జారీలో కూడా అక్రమాలు చోటు చేసుకోవడం వల్లే ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగిపోతోందని తెలుస్తోంది.

ఇదీ చదవండి:ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. పోస్టుమార్టం చేసేందుకు లంచం అడిగిన డాక్టర్

Last Updated : May 5, 2022, 10:24 AM IST

ABOUT THE AUTHOR

...view details