దాదాపు నాలుగు దశాబ్దాలు జనజీవితంతో మమేకమై లక్షల అభిమానుల్ని సంపాదించుకున్న కవి, రచయిత, నాటకకర్త ఆత్రేయ. 1921 మే నెల ఏడో తేదీన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని మంగళంపాడు గ్రామంలో జన్మించిన ఆత్రేయ తల్లిదండ్రులు సీతమ్మ, కృష్ణమాచార్యులు. అసలు పేరు కిళాంబి నరసింహాచార్యులు. చిన్నతనంలో చదువుపై శ్రద్ధ ఉండేది కాదు. రాయవెల్లూరులో ఇంటర్మీడియట్ చదివి, చిత్తూరులో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. ‘జమీన్ రైతు’ పత్రికలోనూ పని చేశారు. విద్యార్థి దశలో వామపక్ష భావాలుండేవి. ఒకసారి కమ్యూనిస్టు కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు అరెస్టయ్యారు. నాటకాల్లోనూ నటించేవారు.
ఏది రాసినా తనదైన బాణీ!
ఆత్రేయ సినీ జీవితానికి మూలాలు నాటకాల్లో ఉన్నాయి. ఆయన కలం పదును మొదట వ్యక్తమైంది నాటక సంభాషణల్లోనే. ఆత్రేయ చాలా నాటకాలు, నాటికలు రాసినా వాటిలో కొన్ని చిరస్మరణీయం. కాలదోషం పట్టని కచ్చితమైన సామాజిక విలువలకు అద్దంపట్టే పదునైన ఆయుధం ‘ఎన్జీఓ’. ‘గుమాస్తా’ పేరుతో చలనచిత్రమైంది. డబ్బు మహిమను తెలిపే నాటకం ‘కప్పలు’. మత విద్వేషాల నేపథ్యంలో హజ్రాబేగం కథ ఆధారంగా రాసిన నాటకం ‘ఈనాడు’. యుద్ధంపట్ల సహజ వైముఖ్యంతో రచించిన సందేశాత్మక నాటకం ‘విశ్వశాంతి’. దీనికి శ్రీశ్రీ ముందుమాట రాశారు. బెర్నార్డ్ షా రచన ‘ది బ్లాక్ గర్ల్ ఇన్ సెర్చ్ ఆఫ్ ది గాడ్’ ప్రేరణతో ప్రతీకాత్మకంగా ‘గౌతమబుద్ధ’ రాశారు. ‘చావకూడదు’ నాటకం ప్రిస్ట్లే ‘ఇన్స్పెక్టర్ కాల్స్’కు అనుసరణ. ‘జాన్ జి. ఇర్విన్ ప్రోగ్రెస్’ను మూలంగా గ్రహించి ‘ప్రగతి’ నాటకం రచించారు. ఆత్రేయ నాటికలూ సమకాలీన సమస్యల్ని ఘాటుగా విమర్శించాయి. ‘ఎవరు దొంగ’ మౌలికమైన రచన. అత్యధిక ప్రదర్శనలు పొందింది. 1951లో ‘దీక్ష’ చిత్రంకోసం ‘పోరా బాబు పో’ గీతరచనతో ఆత్రేయ సినీరంగ ప్రవేశం చేశారు. సినిమా పాటకు జీవం పోశారాయన.
మార్పులు తెచ్చి..
ప్రజల నాడిని అద్భుతంగా పట్టుకున్నారు. భావం, భాష, శైలిలో మార్పులు తెచ్చి సినిమా పాటను సినిమా పాటగానే నిలబెట్టారు. ఆయన పాటకోసం నిర్మాతలు పడిగాపులు పడేవారు. ఆయన పాటలు, మాటల వల్ల విజయవంతమైన చిత్రాలెన్నో ఉన్నాయి. ఆత్రేయ వైవిధ్య భరితమైన పాటలు రాశారు. సన్నివేశాన్ని బలంగా రక్తికట్టించే పాటలెన్నో ఆయన కలం నుంచి జాలువారాయి. యువతరాన్ని ఆకర్షించే శృంగార గీతాలనూ మనోహరంగా గుప్పించారు. ఆ రోజుల్లో ఆయన రాసిన ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే’ పాట పెద్ద సంచలనమే సృష్టించింది. ‘ఎక్కడున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా’ వంటి వియోగ గీతం వెలువరించినా, ‘ప్రేమకు మరణం లేదు దానికి ఓటమి లేదు’ అని ప్రేమ తత్వాన్ని ప్రకటించినా ఆత్రేయది ప్రత్యేక బాణీ.