రక్తం పంచుకుపుట్టిన ముగ్గురు అక్కలపై ఓ ఉన్మాది కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఇద్దరు తొబుట్టువులు చనిపోగా... మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మూడో అక్కను చంపేటప్పుడు అడ్డుగా వచ్చిన బావనూ పొడిచేశాడు. నాలుగో అక్కనూ చంపుదామనుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ పాతబస్తీలో సోమవారం రాత్రి ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట ఠాణా పరిధి బార్కస్ సలాలాలో అహ్మద్ ఇస్మాయిల్(27) అనే మాజీ బౌన్సర్ తల్లి పుత్లీబేగంతో కలిసి ఉంటున్నాడు. సోమవారం ఇంటికి వచ్చిన ఇద్దరక్కలు రజియాబేగం, జకిరాబేగంలపై కత్తితో దాడిచేశాడు.
అనంతరం అక్కడి నుంచి అర కిలోమీటరు దూరంలోని నబీల్కాలనీలో ఉంటున్న మూడో సోదరి నూరాబేగం ఇంటికి వెళ్లి ఆమెపై, బావ ఉమర్పై కత్తితో దాడి చేసి పారిపోయాడు. సమాచారం తెలుసుకున్న అదనపు సీపీ(ట్రాఫిక్)అనిల్కుమార్ అక్కడికి చేరుకున్నారు.
రజియాబేగం అప్పటికే చనిపోవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న జకిరాబేగం, నూరాబేగం, ఉమర్లను ఒవైసీ ఆసుపత్రికి తరలించారు. జకిరాబేగం చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. నూరాబేగం, ఉమర్లకు వైద్య చికిత్స అందిస్తున్నారు. నిందితుడు ఇస్మాయిల్ గతేడాది మార్చిలో తన భార్యను ఇదేవిధంగా గొంతు కోసి చంపేశాడని పోలీసులు తెలిపారు.
అమ్మకు బాగాలేదని పిలిచి..
తన అక్కలను చంపేందుకు ముందుగానే పథకం వేసుకున్న ఇస్మాయిల్.. సోమవారం ఉదయం తల్లికి బాగాలేదని రజియాబేగంకు ఫోన్ చేశాడు. ఆమె ఉదయం 11 గంటలకు వచ్చింది. సాయంత్రం జకిరాబేగంకు కూడా చెప్పడంతో ఆమె కూడా వచ్చింది.