ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దండు దాడి మనకు దూరం

By

Published : Jun 1, 2020, 7:09 AM IST

ఎడారి మిడతల దండు..దేశంలోని రైతులను వణికిస్తున్న కొత్త ఉపద్రవం. ప్రస్తుతం ఈ దండు ముప్పు పశ్చిమ, ఉత్తరాది రాష్ట్రాలపైనే ఉన్నా.. కొద్దిరోజుల్లోనే తెలుగు రాష్ట్రాలకు తలెత్తవచ్చన్న అంచనాలున్నాయి. ఈ క్రమంలో జిల్లేడు మొక్కలపై వాలే దేశీయ మిడతలను చూసి తెలుగు రైతులు బెంబేలెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాలపై ఎడారి మిడతల దండు దాడికి గల అవకాశాలపై 1935లోనే వేసిన ఓ అంచనా ఆసక్తి రేకిత్తిస్తోంది. సాధారణ పరిస్థితుల్లో దక్షిణాదికి మిడతల దండు వచ్చే అవకాశాలు తక్కువని.. అసాధారణ పరిస్థితుల్లో మాత్రం ‘మద్రాసు దక్కన్‌’ ప్రాంతం వరకు వచ్చే అవకాశాలున్నాయన్నది ఆనాటి విశ్లేషణ.

దండు దాడి మనకు దూరం
దండు దాడి మనకు దూరం

స్వాతంత్య్రానికి పూర్వం కరాచీలోని ఇంపీరియల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చిలో ఎంటమాలజిస్ట్‌ రావు సాహిబ్‌ వై.రామచంద్రరావు మిడతలపై పరిశోధనలు నిర్వహించారు. 1935 జులైలో పరిశోధనా పత్రాన్ని వెలువరించారు. అందులో..‘‘అసాధారణ పరిస్థితుల్లో ఎడారి మిడతలు దక్షిణాది దాకా ఎగురుతాయి. ఈ దండుల కారణంగా కరవొచ్చిందనే అంశం వేదాలు, బైబిల్‌లోనూ ఉంది. మిడతల దండు కిలోమీటర్ల దూరం విస్తరిస్తూ.. ముందుకు కదిలే సమయంలో.. సూర్యుడూ కనిపించని పరిస్థితి ఉంటుంది’’అని వివరించారు. ఆయన పరిశోధనలోని మరికొన్ని ముఖ్యాంశాలు...

మూడో రకంతోనే నష్టం
*మిడతల్లో ఎన్నో రకాలున్నా మూడు రకాలతోనే సమస్యలున్నాయి.
*మొదటిది సాధారణ మిడతలు.. ఇవి చిన్న గుంపులుగా ఏర్పడి అన్ని చోట్లా కన్పిస్తుంటాయి. నష్టం పరిమితం.
*రెండోది బొంబాయి మిడతలు.. ఇవి గుజరాత్‌, మధ్య భారత ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. పెద్ద నష్టం ఉండదు.
*మూడోది ఎడారి మిడతలు.. ఇరాన్‌, పాకిస్థాన్‌ల నుంచి రాజస్థాన్‌ మీదుగా భారత్‌లోకి ప్రవేశిస్తాయి.
*మిడతల దండు బాగా ఉద్ధృతమైన సందర్భాల్లో .. మధ్య భారతదేశం వరకు వచ్చింది.
*అసాధారణ పరిస్థితుల్లో.. తూర్పున అసోం, దక్షిణాన మద్రాస్‌ దక్కన్‌ ప్రాంతం వరకు చేరే అవకాశం ఉంది.

రాజస్థాన్‌లోనే నియంత్రించే దిశగా చర్యలు
ఇకపై వచ్చే మిడతల దండుల్ని.. ఇతర రాష్ట్రాలకు విస్తరించకుండా రాజస్థాన్‌లోనే నిర్మూలించడంపై దృష్టి సారించామని ఐకార్‌ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్రకు చేరిన మిడతల దండు బలహీనపడిందని శనివారం వివిధ రాష్ట్రాల శాస్త్రవేత్తలతో నిర్వహించిన వీడియో సమావేశంలో చెప్పారు. ఈ దండు గాలివాటం ఆధారంగా అసోం, బిహార్‌ వైపు వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు.

రాష్ట్రంలో కనిపించేవి సాధారణ మిడతలే

'ప్రస్తుతం అనంతపురం, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో జిల్లేడు మొక్కలపై మిడతల దండు దాడి ఉంది. ఇవి సాధారణంగా ఎప్పుడూ ఉండేవే. 50 నుంచి 60 ఒక సమూహంగా ఉంటాయి. వీటితో పంటలకు నష్టం లేదు. ఎడారి మిడతల కారణంగా ఇప్పుడు ఎక్కువ దృష్టి పెడుతున్నారు'.- - దుర్గా ప్రసాద్‌, కీటక శాస్త్రవేత్త, లాం వ్యవసాయ పరిశోధనా కేంద్రం, గుంటూరు

ABOUT THE AUTHOR

...view details