ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లైవ్ అప్ డేట్స్: జనతా కర్ఫ్యూ @ ఆంధ్రప్రదేశ్

By

Published : Mar 22, 2020, 7:31 AM IST

Updated : Mar 22, 2020, 6:14 PM IST

janata curfew
జనతా కర్ఫ్యూ

18:11 March 22

కుటుంబసభ్యులతో కలిసి చప్పట్లు కొట్టిన చంద్రబాబు

కుటుంబసభ్యులతో కలిసి చప్పట్లు కొట్టిన చంద్రబాబు

ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూకు తెదేపా అధినేత చంద్రబాబు మద్దతు తెలిపారు. కుటుంబసభ్యులతో కలిసి చప్పట్లు కొట్టారు. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్​ తో పాటు మనవడు దేవాన్ష్ సంఘీభావం వ్యక్తం చేశారు.

17:35 March 22

గంట మోగించి జనసేన అధినేత పవన్ సంఘీభావం

జనతా కర్ఫ్యూకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గంట మోగించి సంఘీభావం తెలిపారు. కరోనా పై పోరాడుతున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మీడియా వారికి ట్విటర్​ వేదికగా పవన్ కృతజ్ఞతలు తెలిపారు.

17:24 March 22

జనతా కర్ఫ్యూకి మద్దతుగా సీఎం జగన్ చప్పట్లు

జనతా కర్ఫ్యూకి మద్దతుగా సీఎం జగన్ చప్పట్లు

జనతా కర్ఫ్యూకి మద్దతుగా ముఖ్యమంత్రి జగన్ చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు. మీడియా సమావేశానికి ముందు సీఎస్ నీలం సాహ్ని, మంత్రి ఆళ్ల నానితో పాటు ఇతర ఉన్నతాధికారులతో కలిసి చప్పట్లు కొట్టారు.

15:45 March 22

కరోనా నివారణపై సీఎం జగన్ సమీక్ష

జనతా కర్ఫ్యూ, కరోనా వ్యాప్తి నివారణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. సీఎస్‌, డీజీపీ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, కరోనా వ్యాప్తి నివారణకు  కేంద్రం నియమించిన పర్యవేక్షకుడు సురేశ్​ కుమార్‌, ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో తక్షణం చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి చర్చించారు. రాష్ట్రంలో రెండు పాజిటివ్‌ కేసులు నమోదు కావడంపై విస్త్రత స్థాయిలో చర్చ జరిగింది. విదేశాల నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చే ఎన్‌ఆర్‌ఐలకు సంబంధించి ప్రత్యేకంగా కేంద్రం నిర్దేశించిన ప్రొటోకాల్‌ ప్రకారం వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారు. కరోనా అనుమానిత కేసులకు సంబంధించి ఐసోలేషన్‌ వార్డులు, చికిత్సకు ఉపకరణాలు, ఔషధాల కోసం ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం సూచించారు. అలాగే రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ తరహాలోనే మరో రెండు రోజులు కర్ఫ్యూ కొనసాగించాలనే అంశంపై కూడా చర్చించినట్లు సమాచారం. 

15:29 March 22

కరోనా మహమ్మారిని తరిమికొట్టాలి

ప్రజల సహకారంతోనే కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వీలు ఉంటుందని మంత్రి మోపిదేవి వెంకటరమణ అభిప్రాయపడ్డారు. జనతా కర్ఫ్యూకు ప్రజల నుంచి భారీ స్పందన ఉందని చెప్పారు. తాడేపల్లిలోని తన స్వగృహంలో కుటుంబసభ్యులతో కలిసి ఇంటికే పరిమితమయ్యారు. ప్రజలు స్వీయ స్వచ్ఛత పాటించాలని, సమూహాలకు దూరంగా ఉండాలని పిలుపు నిచ్చారు.

15:07 March 22

జనతా కర్ఫ్యూ: మనవడితో చంద్రబాబు

జనతా కర్ఫ్యూ: మనవడితో చంద్రబాబు

జనతా కర్ఫ్యూ నేపథ్యంలో చంద్రబాబు ఇంటికే పరిమితమయ్యారు. మనవడు దేవాన్ష్‌తో కలిసి పుస్తకం చదువుతున్న వీడియోను చంద్రబాబు ట్విట్టర్​లో షేర్ చేశారు. ‘దేవాన్ష్‌ పుస్తకం చదువుతూ.. 'జనతా కర్ఫ్యూను ప్రజలు ఎలా పాటిస్తున్నారో గమనిస్తున్నా. ఇది మన భద్రత కోసం.. ఇవాళ ఇళ్లలోనే ఉందాం. కుటుంబంతో కలిసి సమయం గడపండి' అని తెదేపా అధినేత ట్వీట్‌ చేశారు.

14:14 March 22

మైదుకూరులో నిర్మానుష్య వాతావరణం

మైదుకూరులో నిర్మానుష్య వాతావరణం

జనతా కర్ఫ్యూతో కడప జిల్లా మైదుకూరులో నిర్మానుష్య వాతావరణం ఏర్పడింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా  ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో బస్టాండ్ వెలవెలబోయింది. దుకాణదారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పోలీసులు కర్ఫ్యూను పర్యవేక్షిస్తున్నారు.

14:11 March 22

పశ్చిమ గోదావరి జిల్లాలో జనతా కర్ఫ్యూ

ఏలూరులో జనతా కర్ఫ్యూ

పశ్చిమ గోదావరిజిల్లాలోని  ఏలూరు నగరంతోపాటు.. భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు, నరసాపురం, జంగారెడ్డిగూడెం, నిడదవోలు పట్టణాల్లో జనం స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూకు మద్దతు పలికారు. గ్రామాల్లో  జనం బయటకు రాకుండా స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. జనతా కర్ఫ్యూలో భాగస్వామ్యులయ్యారు. ఏలూరు నగరంలో ప్రధాన కూడళ్లలో నిశ్శబ్ధ వాతావరణం కనిపించింది. ఆర్టీసీ బస్టాండ్, పాత బస్టాండ్, రైల్వేస్టేషన్, ఒకటో పట్టణం, ఆర్ఆర్ పేట ప్రాంతాల్లో రహదారులు బోసిపోయాయి. ప్రధాన కూడళ్లలో మాత్రం ట్రాఫిక్ పోలీసులు కనిపించారు. జిల్లాలో జాతీయ రహదారుల్లో  రవాణా వ్యవస్థ స్తంభించింది. దుకాణాలు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంకులు మూసేశారు.

13:48 March 22

కర్నూలులో రోడ్లపైకి రాని జనాలు

కర్నూలులో రోడ్లపైకి రాని జనాలు

జనతా కర్ఫ్యూ కర్నూలులో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ప్రజలు బయటికి రాకుండా ఇళ్లలోనే ఉండి కరోనాను అరికట్టేందుకు సహకరిస్తున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, క్రీడామైదానాలు ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఒక్క వాణిజ్య సముదాయం తెరుచుకోలేదు. జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొనాలన్న లక్ష్యంతో ప్రజలు ముందుగానే నిత్యావసర సరుకులు కొనుగోలు చేశారు. జనాలు ఇళ్లకే పరిమితమవుతున్న కారణంగా.. వీధులు సైతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

13:43 March 22

విశాఖ జిల్లా పాయకరావుపేటలో జనతా కర్ఫ్యూ

విశాఖ జిల్లా పాయకరావుపేటలో...

విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో జనతా కర్ఫ్యూ ప్రశాంతంగా జరుగుతోంది. ప్రజలు ఇళ్లకే పరమితమయ్యారు. ప్రధాన కూడళ్లు జన సమ్మర్థం లేక బోసిపోయాయి. సినిమా హాళ్లు, ప్రార్థనా స్థలాలు, చర్చిలు, దేవాలయాలు మూసివేశారు.

13:31 March 22

జనతా కర్ఫ్యూలో పాలుపంచుకున్న ఏలూరు ప్రజలు

జనతా కర్ఫ్యూలో పాలుపంచుకున్న ఏలూరు ప్రజలు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది.  ఉదయం 6 గంటల నుంచి 7 గంటలలోపు  నిత్యావసరాలను ప్రజలు కొనుగోలు చేశారు. రహదారులు, వీధులు నిర్మానుష్యంగా మారాయి. నగరంలోని పెద్ద మార్కెట్​కు పెద్ద ఎత్తున ప్రజలు చేపలు మాంసాహారం కొనుగోలు చేసేందుకు వచ్చేవారు. అలాంటిది కర్ఫ్యూ నేపథ్యంలో మార్కెట్ అంతా నిర్మానుష్యంగా మారింది. దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రార్థనలు, ప్రత్యేక పూజలు నిలిపివేశారు.

11:00 March 22

నెల్లూరులో జనతా కర్ఫ్యూ

నెల్లూరు జిల్లాలో జనతా కర్ఫ్యూ

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జనతా కర్ఫ్యూలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఉదయం నుంచి ప్రజలు ఇళ్లకే పరిమతిమయ్యారు. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్​ మాల్స్​ మూతపడ్డాయి. అత్యవసర సేవలు మినహా మిగతావన్నీ నిలిచిపోయాయి.

10:57 March 22

రాజమహేంద్రవరంలో జనతా కర్ఫ్యూతో రహదారులు వెలవెల

రాజమహేంద్రవరంలో జనతా కర్ఫ్యూ

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను పాటిస్తున్నారు. ఉదయం నుంచి అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన రహదారి అయిన కోటిపల్లి బస్టాండ్ నిర్మానుష్యంగా దర్శనమిస్తోంది. కర్ఫ్యూ నేపథ్యంలో నిత్యం రద్దీగా ఉండే రహదారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దుకాణాలన్నీ మూతపడ్డాయి.

10:54 March 22

గుంటూరులో జనతా కర్ఫ్యూ

గుంటూరులో కర్ఫ్యూతో బోసిపోయిన రహదారులు

గుంటూరు ప్రజానీకం కర్ఫ్యూ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజలంతా జనతా కర్ఫ్యూను స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. గుంటూరులోని ప్రధాన కూడళ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. షాపింగ్ మాల్స్, మాంసం దుకాణాలు, పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 1053 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. గుంటూరు డివిజన్​లో 27 ప్యాసింజర్, 5 ఎక్స్​ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. మరో రెండు రైళ్ల షెడ్యూళ్లు మార్చారు. నిత్యం రద్దీగా ఉండే రహదారులన్నీ కర్ఫ్యూ కారణంగా వెలవెలబోతున్నాయి.

10:48 March 22

విజయవాడలో జనతా కర్ఫ్యూ

విజయవాడ బెంజ్​ సర్కిల్​లో

జనతా కర్ఫ్యూతో విజయవాడ బెంజ్ సర్కిల్ నిర్మానుష్యంగా దర్శనమిస్తోంది. ఉదయం ఏడు గంటల నుంచే ప్రజలంతా స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. అత్యవసరం మినహా మిగతా సేవలు నిలిచిపోయాయి. కర్ఫ్యూ నేపథ్యంలో రహదారులన్నీ బోసిపోయాయి.

10:45 March 22

విశాఖలో జనతా కర్ఫ్యూ

విశాఖలో

కరోనా వ్యాప్తి నివారణకు సామాజిక దూరం పాటించి.. ఇళ్లకే పరిమితమవ్వాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు. విశాఖలో ఉదయం నుంచే ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. రహదారులన్నీ బోసిపోయాయి. బీచ్​రోడ్డులో సైతం బంద్​ వాతావరణం కనిపిస్తోంది. అత్యవసర సేవలు మినహా మిగతావన్నీ బంద్​ అయ్యాయి. 

10:36 March 22

తిరుపతిలో జనతా కర్ఫ్యూ ప్రభావం

తిరుపతిలో జనతా కర్ఫ్యూ

కరోనా వైరస్​ వ్యాప్తి నివారణకు రాష్ట్రంలో జనతా కర్ఫ్యూను ప్రజలంతా స్వచ్ఛందంగా పాటిస్తున్నారు. తిరుపతిలో ఉదయం నుంచే బంద్​ వాతావరణం కనిపిస్తోంది. నిత్యం రద్దీగా ఉండే తిరుపతి రైల్వేస్టేషన్​ వెలవెలబోయింది. కర్ఫ్యూ దృష్ట్యా అన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పట్టణంలో రహదారులన్నీ బోసిపోయాయి. అత్యవసర సేవలు మినహా మిగతావన్నీ నిలిచిపోయాయి. 

10:35 March 22

10:21 March 22

ఒంగోలులో రోడ్లపైకి యువకులు.. హెచ్చరించిన పోలీసులు

ఒంగోలులో యువకులను హెచ్చరిస్తున్న పోలీసులు

ప్రకాశం జిల్లా ఒంగోలులో జనతా కర్ఫ్యూను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. రోడ్లపై తిరుగుతున్న యువకులను హెచ్చరించి ఇళ్లకు పంపారు.

10:18 March 22

కడపలో నిర్మానుష్యంగా రహదారులు

కడప నగరంలో నిర్మానుష్యంగా రహదారులు

కడప నగరంలో జనతా కర్ఫ్యూ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

09:48 March 22

అత్యవసర సేవలు మినహా వ్యాపార సముదాయాలన్నీ ముసివేత

రాత్రి 9 వరకు ఇళ్లల్లో నుంచి ప్రజలు బయటకు రావద్దని వైద్య ఆరోగ్యశాఖ పిలుపునిచ్చింది. అత్యవసర సేవలు మినహా అన్ని దుకాణాలు మూసివేయాలని కోరింది. సాయంత్రం 5గంటలకు స్థానిక అధికారులు సైరన్‌ మోగించాలని ఆదేశించింది.

08:20 March 22

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రజానీకం ఇళ్లకే పరిమితమైంది. రహదారులు నిర్మానుష్యంగా మారాయి. జిల్లాలోని 5 డిపోల నుంచి బస్సులు రోడ్డెక్కలేదు. 486 ఆర్టీసీ బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.

08:19 March 22

కడపలో నిర్మానుష్యంగా రహదారులు

జనతా కర్ఫ్యూతో కడపలో స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. ఆర్టీసీ బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ఇతర ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి.

08:16 March 22

మచిలీపట్నంలో జనతా కర్ఫ్యూ

జనతా కర్ఫ్యూతో మచిలీపట్నం ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు.  తెల్లవారుజాము నుంచే కర్ఫ్యూకు మద్దతుగా రోడ్లపైకి రావడం మానేశారు. అత్యవసర సేవలు మినహా... పెట్రోల్ బంకులు, మార్కెట్లు మూతపడ్డాయి.

07:49 March 22

విజయనగరం.. నిర్మానుష్యం

జనతా కర్ఫ్యూతో విజయనగరం నిర్మానుష్యంగా మారింది. తెల్లవారుజాము నుంచే ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. మార్కెట్లు, షాపింగ్‌ మాళ్లు సహా అన్ని దుకాణాలు మూసివేశారు. ఆర్టీసీ బస్టాండుకే బస్సులు పరిమితమయ్యాయి.

07:47 March 22

విజయవాడలో నిలిచిన వాహనాలు.. విజయవంతంగా జనతా కర్ఫ్యూ

విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మానుష్యంగా మారింది. ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. జనతా కర్ఫ్యూకు ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పూర్తి మద్దతు తెలిపింది. ప్రధాన కూడళ్లలో వాహనాలు నిలిచిపోయాయి. ప్రజలు కూడా స్వీయ నిర్బంధాన్ని పాటిస్తున్నారు. ఉదయం 7 గంటలలోపే నిత్యావసరాల కొనుగోలును పూర్తి చేసుకున్నారు. మరోవైపు.. సాధారణ ఆరోగ్య పరీక్షలకు రావద్దని ఎయిమ్స్‌ అధికారులు ప్రకటించారు.

07:39 March 22

తిరుపతివాసుల సంఘీభావం

తిరుపతిలోని అలిపిరి, కపిలతీర్థం, లీలామహల్ సర్కిల్ ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ఇళ్లలోనే ఉంటున్న ప్రజలు జనతా కర్ఫ్యూకు సంఘీభావం తెలుపుతున్నారు.

07:36 March 22

గుంటూరు జిల్లాలో ఇళ్లకే పరిమితమైన ప్రజలు

గుంటూరు జిల్లాలో ప్రజానీకం ఇళ్లకే పరిమితమయ్యారు. కరోనా నివారణపై ప్రధాని పిలుపునకు ప్రజల సంఘీభావం తెలుపుతున్నారు. రాత్రి 9 గంటల వరకు ప్రజల స్వీయనిర్బంధం కొనసాగనుంది. గుంటూరులో ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. షాపింగ్ మాల్స్, చికెన్, మటన్ దుకాణాలు, పెట్రోల్ బంకులు మూసివేశారు. గుంటూరు జిల్లావ్యాప్తంగా 1053 ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. గుంటూరు డివిజన్ పరిధిలో 27 ప్యాసింజర్, 5 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు చేశారు. మరో రెండు రైళ్ల షెడ్యూల్ మార్చారు.

07:34 March 22

పశ్చిమ గోదావరి జిల్లాలో నిలిచిన బస్సులు

పశ్చిమ గోదావరి జిల్లాలోని 7 డిపోల్లో 584 ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. జిల్లాలో స్వచ్ఛందంగా దుకాణాలు, హోటళ్లు మూసివేశారు. స్వీయ నిర్బంధంతో జనతా కర్ఫ్యూకు ప్రజలు సహకరిస్తున్నారు.

07:31 March 22

అమరావతి ఆందోళనలపై జనతా కర్ఫ్యూ ప్రభావం

అమరావతి: రాజధాని గ్రామాల్లో 96వ రోజూ నిరసన దీక్షలు కొనసాగాయి. జనతా కర్ఫ్యూ ప్రభావంతో కృష్ణాయపాలెంలో ఉదయం 6.45 వరకు రైతులు, మహిళలు ధర్నా చేశారు. ఆ తర్వాత.. కర్ఫ్యూను పాటిస్తూ ఇళ్లలోనే దీక్షలు కొనసాగిస్తున్నారు.

07:22 March 22

అందరం జనతా కర్ఫ్యూలో పాల్గొందాం: చంద్రబాబు

కరోనాపై పోరాటానికి దేశమంతా సిద్ధమైందని తెదేపా అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రధాని పిలుపు మేరకు అందరం జనతా కర్ఫ్యూలో పాల్గొందామని పిలుపునిచ్చారు. ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని కోరారు. సామాజిక దూరం పాటించడం తొలి అడుగు కావాలనన్నారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ప్రతి ఒక్కరం సెల్యూట్ చేద్దామని చెప్పారు. వీడియో సందేశాన్ని ట్వీట్ కు జత చేశారు.

Last Updated : Mar 22, 2020, 6:14 PM IST

ABOUT THE AUTHOR

...view details