ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 6, 2021, 9:51 AM IST

ETV Bharat / city

హెల్మెట్​ ధరించట్లేదా...? వాహనాదారులు తస్మాత్​ జాగ్రత్త..!

రహదారి ప్రమాదాల్లో గతేడాది లక్షన్నర మంది మృతి చెందారు. అతివేగం, నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదాలకు కారణమవుతున్నట్లు పోలీసుల అధ్యయనంలో తేలింది. ప్రమాదాల్లో చనిపోతున్న వాళ్లలో ద్విచక్ర వాహనదారులు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. శిరస్త్రాణం ధరించకపోవడం వల్ల ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై మృతి చెందేవారు ఎక్కువగా ఉండటం వల్ల హైదరాబాద్ లోని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. హెల్మెట్​ లేకుండా ప్రయాణించే ద్విచక్ర వాహనదారుల లైసెన్సును రద్దు చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు.

traffic police
traffic police

హైదరాబాద్.. వాహనదారులు నిబంధనలు పాటించేలా ట్రాఫిక్ పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నారు. నిత్యం వాహనాలను తనిఖీ చేస్తూ... నిబంధనలు అతిక్రమించే వాళ్లకు జరిమానా విధిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా కెమెరాలు చేతపట్టి ద్విచక్ర వాహనదారుల ఫోటోలు తీస్తున్నారు. శిరస్త్రాణం ధరించకపోయినా... చరవాణిలో మాట్లాడుతూ వాహనాలు నడిపినా.. ఫోటోలు తీసి వాహనం నంబర్ ఆధారంగా ఇంటి చిరునామాకు చలాన్లు పంపిస్తున్నారు. రహదారులపై కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలనూ ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానించి, అక్కడి నుంచి 24 గంటల పాటు వాహనదారులను పర్యవేక్షిస్తున్నారు.

కఠిన నిబంధనలను పక్కాగా అమలు

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించాలనే నిబంధన పక్కాగా అమలయ్యేలా చూస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గతేడాది నుంచి ద్విచక్ర వాహనంపై వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్​ ధరించాలనే నిబంధనను సైబరాబాద్​లో అమలు చేస్తున్నారు. వాహనం నడిపే వ్యక్తి శిరస్త్రాణం ధరించి... వెనకాల కూర్చున్న వ్యక్తికి లేకపోయినా జరిమానా విధిస్తున్నారు. కొంతమంది వాహనదారులు మాత్రం పోలీసుల సూచనలు పట్టించుకోవడంలేదు.

నిబంధనలు ఇంత కఠినంగా అమలు చేస్తున్నా... ద్విచక్ర వాహనదారులు చాలా మంది హెల్మెట్​ ధరించడం లేదని ట్రాఫిక్ ఉన్నతాధికారులు గుర్తించారు. చట్టంలో ఉన్న కఠిన నిబంధనలను పక్కాగా అమలు చేసే విధంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ముందుకు వెళుతున్నారు. అందులో భాగంగానే ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి శిరస్త్రాణం ధరించకపోతే లైసెన్సు రద్దు చేసే విధంగా ప్రణాళిక రచిస్తున్నారు. మొదటి సారి పట్టుబడిన వాళ్లకు 3 నెలలు, రెండో సారి శిరస్త్రాణం లేకుండా పట్టుబడితే శాశ్వతంగా లైసెన్సు రద్దు చేసే అవకాశం ఉందని ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు.

625 ప్రమాదాలు.. 663 మంది మృతులు

గతేడాది తెలంగాణ వ్యాప్తంగా 16,866 ప్రమాదాలు జరిగాయి. ఇందులో 5,821మంది మృతి చెందగా... 16,591 మంది గాయపడ్డారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 625 ప్రమాదాలు చోటు చేసుకోగా... 663 మంది మృతి చెందారు. వీరిలో ద్విచక్ర వాహనదారులే 455 మంది. 362 మంది వాహనం నడుపుతున్న వాళ్లు చనిపోతే... 93 మంది ద్విచక్రవాహనం వెనకాల కూర్చున్న వాళ్లున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే తలకు తీవ్ర గాయాలై చనిపోయినట్లు ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది. ఒకవేళ శిరస్త్రాణం ధరిస్తే ప్రమాదంలో గాయాలతో బయటపడే అవకాశముంటుందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.

రూ. 613 కోట్ల జరిమానాలు...

తరచూ తనిఖీలు నిర్వహిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాళ్లపై పోలీసులు జరిమానాల అస్త్రం ప్రయోగిస్తున్నారు. గతేడాది తెలంగాణ వ్యాప్తంగా రూ.613 కోట్లు.. జరిమానాల రూపంలో వాహనదారులపై విధించారంటే ఏ స్థాయిలో తనిఖీలు చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై మోటారు వాహనాల చట్టం కింద 47 లక్షల 83 వేల వాహనాలపై కేసులు నమోదు చేసి రూ. 178 కోట్ల జరిమానా విధించారు. కేవలం జరిమానాలే కాకుండా... ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కూడా కల్పిస్తున్నారు.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శివారు ప్రాంతాల్లో 7 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి.. అక్కడ గ్రామీణ ప్రజలకు శిరస్త్రాణం యొక్క ప్రాధాన్యతను వివరిస్తున్నారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:

విశాఖలో రెండోరోజు చంద్రబాబు పర్యటన

ABOUT THE AUTHOR

...view details