శ్రీశైలం జలాశయానికి ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టును బోర్డుల పరిధిలోకి తీసుకురాకపోతే ఎలా అని అంతర్రాష్ట్ర జలవనరుల నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అసలు తెలుగు రాష్ట్రాల్లోకి కృష్ణాజలాలు నారాయణపూర్ జలాశయం దాటి ప్రవేశించేదే జూరాలలోకని... ఎంత నీరు వచ్చిందో లెక్కలు ఖరారు చేయాలన్నా జూరాలను బోర్డు పరిధిలోకి తేవాలని అనేక ఏళ్లపాటు కృష్ణా అంతర్రాష్ట్ర వివాదాల్లో పనిచేసిన విశ్రాంత ఇంజినీరింగు నిపుణులు గంగాధర్ సూచించారు.
*దాదాపు 500 టీఎంసీల నికరజలాలు జూరాలను దాటి రావాలని, అక్కడ ఎంత నీరు మళ్లిస్తున్నారనేది కూడా కొన్ని సందర్భాల్లో ముఖ్యమైన అంశమవుతుందని అంతర్రాష్ట్ర జల విభాగంలో సీఈగా పనిచేసిన విశ్రాంత అధికారి రామకృష్ణ పేర్కొన్నారు.
*జూరాల కింద 59 టీఎంసీల వరకు వినియోగిస్తున్నారని- జూరాల దిగువన పదకొండో షెడ్యూలు ప్రాజెక్టు నెట్టెంపాడు ఉందని మరో విశ్రాంత నిపుణులు తెలిపారు. వరదజలాల వినియోగంలో భాగంగా ఉన్న నెట్టెంపాడు కింద వినియోగం ఇలా చేయడం వల్ల లెక్కల్లోకి రాదని గంగాధర్ అభిప్రాయపడ్డారు. ఆ మూడు ప్రాజెక్టుల కింద కొంత ఆయకట్టు రెండేసి ప్రాజెక్టుల కింద గతంలో చూపారని విశ్రాంత సీఈ చెప్పారు. అక్కడి నుంచి చెరువులకు నీటిని కూడా ఎత్తిపోసుకుంటున్నారని- ఈ పరిస్థితుల్లో జూరాలను విస్మరిస్తే బోర్డుల పరిధికి సమగ్రత రాదని అభిప్రాయపడుతున్నారు. గతంలో ముసాయిదా నోటిఫికేషన్లో జూరాల చేర్చామని గుర్తు చేసుకున్నారు.