ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 21, 2021, 4:34 AM IST

ETV Bharat / city

Krishna Tribunal: కృష్ణా ట్రైబ్యునల్ కాల పరిమితి పొడిగింపు

కృష్ణా ట్రైబ్యునల్‌ కాలపరిమితిని మరో ఏడాది పొడిగిస్తూ కేంద్రజల్‌శక్తి శాఖ నోటిఫికేషన్‌ జారీచేసింది. 2021 ఆగస్టు 1 నుంచి మరో ఏడాది పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర మధ్య కృష్ణా జలాల పంపిణీకి 2004 ఏప్రిల్‌ 2న ఏర్పాటైన ట్రైబ్యునల్‌..ఆరేళ్లు విచారణ జరిపి 2010 డిసెంబర్‌ 30న తీర్పు వెలువరించింది.

కృష్ణా ట్రైబ్యునల్ కాల పరిమితి పొడిగింపు
కృష్ణా ట్రైబ్యునల్ కాల పరిమితి పొడిగింపు

కృష్ణా ట్రైబ్యునల్‌ కాల పరిమితిని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర జల్‌శక్తిశాఖ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అంతర్జాతీయ జల వివాదాల చట్టం-195లోని సెక్షన్‌ 5(3)కింద కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలను అనుసరించి దీని కాలపరిమితిని 2021 ఆగస్టు 1 నుంచి మరో ఏడాది పొడిగిస్తున్నట్లు పేర్కొంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య కృష్ణా జలాల పంపిణీ కోసం కేంద్రం 2004 ఏప్రిల్‌ 2న ఈ ట్రైబ్యునల్‌ను ఏర్పాటుచేసింది.

అది ఆరేళ్లపాటు విచారణ కొనసాగించి 2010 డిసెంబరు 30న నివేదిక సమర్పించింది. ఆ నివేదికపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలు జలవివాద చట్టంలోని సెక్షన్‌ 5(3)ని అనుసరించి 2011 మార్చి 29న మళ్లీ దరఖాస్తు చేశాయి. వాటిపై ఏడాదిలోపు ట్రైబ్యునల్‌ తుది నివేదికను కేంద్రానికి సమర్పించాలి. అయితే దానిపై వాదనలు ముగియకపోవడంతో కేంద్రం ఏటా ట్రైబ్యునల్‌ కాలపరిమితిని పొడిగిస్తూ వచ్చింది.

2014లో ఆంధ్రప్రదేశ్‌ విడిపోయిన తర్వాత విభజన చట్టంలోని సెక్షన్‌ 89 ఏపీ, తెలంగాణల మధ్య కృష్ణా జలాల పంపిణీ కోసం ట్రైబ్యునల్‌ కాలపరిమితిని పెంచి, దానికి కొత్తగా విధివిధానాలను ఖరారు చేయాలని చెప్పడంతో అందుకు అనుగుణంగా కేంద్రం దాని కాలపరిమితిని పెంచింది. 2020 జులై 23న కేంద్ర జల్‌శక్తి జారీ చేసిన ఉత్తర్వుల్లోని విధివిధానాల ప్రకారం ట్రైబ్యునల్‌ 2021 ఆగస్టు ఒకటిలోపు తుది నివేదిక సమర్పించాల్సి ఉంది. ఇందుకు తమకు మరో ఏడాది సమయం కావాలని కృష్ణా ట్రైబ్యునల్‌ విజ్ఞప్తి చేయడంతో కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండి:

Night curfew in ap: మరో వారం.. రాత్రి కర్ఫ్యూ కొనసాగింపు

ABOUT THE AUTHOR

...view details