బతుకుదెరువు కోసం తెలంగాణలోని భాగ్యనగరానికి వలస వచ్చాడు. కరోనా కోరలు చాస్తుండడం వల్ల పని కోల్పోయి రోడ్డున పడ్డాడు. స్వరాష్ట్రానికి పోదామంటే వాహనాలు లేవు... ఇక్కడే ఉందామంటే నిలువ నీడ లేదు. కడుపు నిండా తిండి... కంటి నిండా నిద్రపోయి ఎన్నాళ్లైందో... చేసేదేమీ లేని నిస్సహాయ స్థితిలో ఎందరో వలస కూలీలతో తాను పయనమయ్యాడు. నడకను నమ్ముకుని రోడ్డు బాట పట్టారు. మండే ఎండలో... సెగలు కక్కుతున్న వేడిలో ఇంటిని తలచుకుంటూ నడిచి'పోతున్నారు'. అలసి సొలసిన సమయంలో చీకట్లు కమ్ముకుని చనిపోతున్నామన్న విషయం తెలియకుండానే నడకలోనే కన్నుమూస్తున్నారు.
గమ్యం చేరకుండానే... కన్నుమూశాడు - man dies after going hungry at parigi
కమ్ముకొస్తున్న కరోనా నుంచి తప్పించుకునేందుకు కాలి నడకన బయలుదేరిన ఓ వ్యక్తి గమ్యం చేరుకోకుండానే కన్నుమూశాడు.. ఆకలి బాధతో పేగులు మాడిపోతున్నా... మండుటెండలో అడుగు ముందుకు సాగకున్నా బలవంతంగా నడుస్తూ దారిలోనే ప్రాణాలు కోల్పోయాడు.

దేశంలో లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్లో ఉంటున్న వలస కూలీలు స్వరాష్ట్రాలకు కాలినడకన బయలుదేరారు. తెలంగాణ వికారాబాద్ జిల్లా పరిగి మీదుగా ఉన్న జాతీయ రహదారిలో వందల మంది బాటసారులు సాగిపోతున్నారు. అలా నడిస్తున్న వారిలో ఎర్రగడ్డపల్లి గ్రామ శివారులో ఆహారం లేక ఓ వలస కూలీ మృతి చెందాడు. కర్ణాటక రాష్ట్రం సేడంకు చెందిన అలిసాబ్(60) హైదరాబాద్ లింగంపల్లిలో ఓ హోటల్లో పని చేసేవాడు. లాక్డౌన్ కారణంగా ఈ నెల 28న పరిగి చేరుకున్నాడు. దాదాపు 80 కిలోమీటర్లు నడిచి ఇక ఓపిక లేక ఇవాళ దారి మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. అలిసాబ్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో 40 కరోనా పాజిటివ్ కేసులు