కరోనా వైరస్ పట్ల ప్రపంచమంతా అప్రమత్తంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అలసత్వం ప్రదర్శిస్తోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ ధ్వజమెత్తారు. ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటనలు ఇస్తూనే ఎక్కడికక్కడ చేతులెత్తేస్తున్నారని ఆయన విమర్శించారు. వాస్తవాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తూ.. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రుల నిర్లక్ష్యంతో కరోనా పాజిటివ్ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన ఉంటే...రికవరి రేటులో ఉత్తరాఖండ్ వంటి మిగతా రాష్ట్రాల కన్నా వెనుకబడిందని మండిపడ్డారు.
బెడ్లు ఖాళీలేక బాధితులు ఇక్కట్లు
కరోనా పరీక్షలకు సంబంధించి 3 లక్షలకు పైగా శాంపిల్స్ వృథా కావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని కళా విమర్శించారు. మంత్రివర్గ సమావేశంలో తాత్కాలిక ఆస్పత్రులను నిర్మించడం, ఐసీయూ బెడ్ల సంఖ్య పెంచుకోవడం, ఆక్సిజన్ ఏర్పాట్లు, వెంటిలేటర్లు తెప్పించడం ఇటువంటి అత్యవసర అంశాలపై ఎందుకు చర్చించలేదని కళా నిలదీశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీలేక బాధితులను వెనక్కి పంపుతుంటే మంత్రులు అన్ని వసతులు ఉన్నాయని చెప్పటం దుర్మార్గమన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులు లక్షల్లో బిల్లులు వేస్తుంటే మంత్రులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.