'కాకతీయ వైభవ సప్తాహం' వేడుకలు ఓరుగల్లులో గురువారం కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్లో ఉంటున్న కాకతీయుల 22వ వారసుడైన కమల్చంద్ర భంజ్దేవ్ కాకతీయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమ పూర్వీకులు పాలించిన వరంగల్ కోటలో గాలిలోకి బెలూన్లు ఎగరేసి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. మంత్రులు శ్రీనివాస్గౌడ్, సత్యవతి రాథోడ్, చీఫ్విప్ వినయ్భాస్కర్, ఎంపీ దయాకర్, నగర మేయర్ సుధారాణి, కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతులు కమల్చంద్రకు ఘనంగా స్వాగతం పలికారు. తొలుత ఆయన భద్రకాళి ఆలయాన్ని దర్శించుకున్నారు. వందలాది మంది డప్పు కళాకారులు, బోనాలతో మహిళలు చంద్రదేవ్ను ఆహ్వానించారు. భద్రకాళి బండ్పై కమల్చంద్ర మొక్క నాటారు. పోచమ్మమైదాన్ కూడలికి వెళ్లి రాణి రుద్రమదేవి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తర్వాత వరంగల్ కోటకు వెళ్లారు. కోట పడమటి ద్వారం నుంచి గుర్రాల బొమ్మలున్న ప్రత్యేక వాహనంలో ఆయనపై పూల వర్షం కురిపిస్తూ మధ్య కోట వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. కోటలోని శంభులింగేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశాక, కీర్తి తోరణాలను సందర్శించారు. కోట నుంచి వేయిస్తంభాల ఆలయానికి విచ్చేసి రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. చివరగా హనుమకొండలోని అగ్గలయ్య గుట్టను సందర్శించిన కమల్చంద్ర రాత్రి హైదరాబాద్ మాదాపూర్లో జరిగిన చిత్ర ప్రదర్శనలో పాల్గొన్నారు.
భద్రకాళి ఆలయం, వరంగల్ కోటలో కమల్చంద్ర మీడియాతో మాట్లాడారు. వరంగల్లో కాకతీయులు అనేక చెరువులు తవ్వించి ప్రజలకు ఎంతో మేలు చేశారని, తాము బస్తర్లో సైతం చెరువుల పరిరక్షణకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. తమ మూలాలున్న వరంగల్కు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కోటలోని కీర్తి తోరణాలు చాలా సుందరంగా ఉన్నాయని, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నంలో ఈ చిత్రాన్ని చేర్చడం గొప్ప విషయమని కొనియాడారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వ గెజిట్లో తమ తాత మహారాజ ప్రవీర్చంద్ర భంజ్ కాకతీయ అని ఉన్నదని.. తాము కాకతీయుల వారసులమని చెప్పడానికి అదే నిదర్శనమని పేర్కొన్నారు. ఉత్సవాలను జరుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కమల్చంద్ర ధన్యవాదాలు తెలిపారు.