ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 26, 2022, 10:19 AM IST

ETV Bharat / city

'పార్ట్​టైమ్​'కే ఆ విద్యార్థుల మొగ్గు.. జేఎన్​టీయూహెచ్​దే టాప్​ ప్లేస్

Part time PhD : ఇంజినీరింగ్‌లో ఫుల్‌టైమ్‌ పీహెచ్‌డీ చేసే విద్యార్థుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది. జేఎన్‌టీయూహెచ్‌లో మొత్తం పరిశోధన విద్యార్థుల్లో కేవలం 6 శాతం మాత్రమే ‘ఫుల్‌టైమ్‌’ కావడమే ఇందుకు నిదర్శనం. మొత్తం 1,849 మంది పార్ట్‌టైమ్‌ పీహెచ్‌డీ విద్యార్థులతో ఈ కేటగిరీలో జేఎన్‌టీయూహెచ్‌ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

జేఎన్​టీయూహెచ్
జేఎన్​టీయూహెచ్

Part time PhD : ఇంజినీరింగ్‌లో ఫుల్‌టైమ్‌ పీహెచ్‌డీ చేసేందుకు విద్యార్థులు ముందుకు రావడం లేదా? అంతా పార్ట్‌టైమేనా..? 2020-21 నాటికి జేఎన్‌టీయూహెచ్‌ను పరిశీలిస్తే అదే స్పష్టమవుతోంది. అసలు ఇంజినీరింగ్‌లో పీజీ చేయడమే తగ్గిపోయిందని.. అందులోనూ ఫుల్‌టైమ్‌ పీహెచ్‌డీ వరకు విద్యార్థులు రావడం లేదని వర్సిటీ అధికారులు చెబుతున్నా.. ఆ వాదన పాక్షిక సత్యమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పరిశోధనకు విశ్వవిద్యాలయం ఫెలోషిప్‌లు ఇవ్వకపోవడం కూడా ప్రధాన కారణాల్లో ఒకటని చెబుతున్నారు. ఆ వర్సిటీలో మొత్తం పరిశోధన విద్యార్థుల్లో కేవలం 6 శాతం మాత్రమే ‘ఫుల్‌టైమ్‌’ కావడం గమనార్హం.

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లలో తొలి 100 విశ్వవిద్యాలయాలు, 100 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో పీహెచ్‌డీ నమోదును ‘ఈనాడు-ఈటీవీ భారత్’ పరిశీలించింది. మొత్తం 1,849 మంది పార్ట్‌టైమ్‌ పీహెచ్‌డీ విద్యార్థులతో ఈ కేటగిరీలో జేఎన్‌టీయూహెచ్‌ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ 390 మంది ఆచార్యులు ఉండగా.. కేవలం 116 మందే ఫుల్‌టైమ్‌ పరిశోధన విద్యార్థులు ఉన్నారు. విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ ప్రవేశాలను ఆదాయ వనరుగా మార్చుకుందని.. నాణ్యతను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఉస్మానియా విశ్వవిద్యాలయం సైతం 1,200 మంది తాత్కాలిక విద్యార్థులతో మూడో స్థానంలో నిలిచింది.

ఎందుకీ పరిస్థితి..పార్ట్‌టైమ్‌ అంటే ఇతర కొలువులు చేసుకుంటూ తాము పనిచేసే సంస్థలోనే పరిశోధన చేస్తుంటారు. బీటెక్‌ పూర్తి కావడంతోనే సగం మంది ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరుతున్నారు. మిగిలిన వారిలో అధిక శాతం ఎంఎస్‌ చేసేందుకు విదేశాలకు వెళుతున్నారు. ఇక మిగిలిన కొద్దిమంది ఎంటెక్‌లో చేరుతున్నారు. ఈ క్రమంలో పీహెచ్‌డీ కోసం వచ్చేవారు తగ్గిపోయారని, అందుకే ఉద్యోగాలు చేస్తూ పార్ట్‌టైమ్‌ పీహెచ్‌డీలో చేరుతున్నారని వర్సిటీ అధికారి ఒకరు తెలిపారు.

‘ఇప్పటికీ ఫుల్‌టైమ్‌కు ఆసక్తి చూపే విద్యార్థులు ఎక్కువ మందే ఉంటున్నారు. అయితే, సైన్స్‌, హ్యుమానిటీస్‌ అభ్యర్థులకు యూజీసీ నెట్‌, సీఎస్‌ఐఆర్‌ నెట్‌ జేఆర్‌ఎఫ్‌ ఫెలోషిప్‌ల తరహాలో ఇంజినీరింగ్‌లో తక్కువ. ఆ లోటును పూడ్చేందుకు విశ్వవిద్యాలయమే ఫెలోషిప్‌లు ఇస్తే ఫుల్‌టైమ్‌ పీహెచ్‌డీలో చేరే వారి సంఖ్య భారీగానే పెరుగుతుంది’ అని జేఎన్‌టీయూహెచ్‌ సీనియర్‌ ఆచార్యుడు ఒకరు అభిప్రాయపడ్డారు. పార్ట్‌ టైమ్‌ పీహెచ్‌డీకి ఏడాదికి ఫీజు రూ.30 వేలు. ఆ ప్రకారం 1,849 మందికి కలిపి వర్సిటీకి రూ.55 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ‘ఫుల్‌టైమ్‌ను ప్రోత్సహించాలని ఒక్కో విభాగానికి రెండు, మూడు ఫెలోషిప్‌లు ఇవ్వాలని ఇటీవల వర్సిటీ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. అది అమలైతే ప్రస్తుత పరిస్థితిలో మార్పు రావొచ్చు’ అని వర్సిటీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

ఇవీ చూడండి..

రైల్వే జోన్‌పై కేంద్రం దాటవేత.. గడువు చెప్పలేమంటూ ప్రకటన

రెండుసార్లు మూల్యాంకనం.. కోట్ల వ్యయం.. ఇదీ గ్రూప్​-1 అభ్యర్థుల పరిస్థితి

ABOUT THE AUTHOR

...view details