'జనతా కర్ఫ్యూ'... ఒక్కసారిగా ఇండియా మెుత్తం ఇంటికే పరిమితమైంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఎప్పుడూ లేని నిశ్శబ్దాన్ని భారతీయులకు వినిపించింది. రోజూలాగే పక్కవాళ్ల ఆరోగ్యాన్ని పాడుచేసే చర్యలు లేవు. రోడ్లపై ఉమ్మెయడాలు లేవు. చెత్తవేసేవారు... తీసే వారూ లేరు. ఇవాళ ఒక్కరోజు 'పరిశుభ్ర భారత్' దర్శనమిచ్చింది. ఎవరీ ఆరోగ్యాన్ని పాడుచేయకుండా భారతీయులంతా ఇంటికే పరిమితమయ్యారు.
ఉదయం లేవగానే మెుదలయ్యే కాలుష్య భారత్ ఇవాళ కనిపించలేదు. ఇది కాస్త ఉపశమనమే. రోజూ ఉండే వాహనాల చప్పుళ్లు వినిపించలేదు. బస్సులో వెళ్తూ ఒకరు అరటి తొక్క రోడ్డుపై వేస్తారు. బైక్పై వెళ్లే ఓ వ్యక్తి నోట్లో వేసుకున్న పాన్ రోడ్డుపై ఊస్తాడు. దవాఖానాలో పనిచేసే వ్యక్తి రోడ్డుపక్కనే సిరంజిలు, వాడిన కాటన్... ఇతర మెడీ వేస్ట్ను పడేస్తాడు. కొబ్బరి బోండాల దుకాణం నిర్వాహకుడు కాయ కొట్టి నడిరోడ్డుపై వేస్తాడు. వైన్షాపులో తాగి గ్లాసు, సీసాలు రోడ్డుపక్కన పడేస్తారు. ఇవన్నీ చూస్తుంటే... మనకు అపరిచితుడు సినిమాలో రాము పాత్ర గుర్తొస్తుంది కదూ. నిజమే మరీ సినిమాలో విక్రమ్ చెప్పిన ప్రతీ సంఘటన మనం నిత్యం చూసేదే కదా. శుభ్రతను పాటించుకుండా, బాధ్యత లేకుండా చేసే ఎన్నో చర్యలు అనారోగ్యానికి గురిచేసేవే మరీ.