ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో పట్టాలెక్కుతున్న పరిశ్రమలు

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పరిశ్రమలు ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తున్నాయి. మొత్తం 13 భారీ పరిశ్రమలు మరో ఆరు నెలల్లో ఉత్పత్తికి సిద్ధమవుతాయని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. వీటి ద్వారా రాష్ట్రానికి రూ.8,600 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 14 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. పరిశ్రమలకు భూముల కేటాయింపు నుంచి ఉత్పత్తికి మధ్య ఎనిమిది దశలుగా పరిశ్రమల శాఖ వర్గీకరించింది. ఇందులో భూసేకరణ నుంచి డీపీఆర్‌ల వరకు మొదటి నాలుగు దశలు కాగా..  సివిల్‌ పనుల నుంచి ఉత్పత్తి వరకు మరో నాలుగు దశలున్నాయి. పరిశ్రమల శాఖ అంచనా ప్రకారం ఆరు నెలల్లో ఉత్పత్తి దశకు రానున్న వాటి వివరాలివీ..

By

Published : Dec 9, 2019, 8:22 AM IST

రాష్ట్రంలో పట్టాలెక్కుతున్న పరిశ్రమలు
రాష్ట్రంలో పట్టాలెక్కుతున్న పరిశ్రమలు

అపోలో టైర్స్‌
ప్రసిద్ధ టైర్ల తయారీ సంస్థ అపోలో టైర్స్‌ తన ఏడో ఉత్పత్తి ప్లాంట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తోంది.
ఒప్పందం: 2018 జనవరి 9న గత ప్రభుత్వ హయాంలో
ఎక్కడ: చిత్తూరు జిల్లా సత్యవేడు సమీపంలోని చినపందూరులో 200 ఎకరాల్లో
పెట్టుబడి: రెండు దశల్లో రూ.4,125 కోట్లు. నిర్మాణంలో ఉన్న మొదటి దశలో రూ.1,800 కోట్లు.
ఉత్పత్తి: మొదటి దశలో ఏటా 55 లక్షల టైర్లు ఉత్పత్తి చేయనుంది.
ఉపాధి: ప్రత్యక్షంగా 1,400 మందికి.
ప్రస్తుత పరిస్థితి: యూనిట్‌ మొదటి దశలో యంత్రాలు అమర్చుచున్నారు. ఆరు నెలల్లో ఉత్పత్తి ప్రారంభిస్తుంది.
ఇసుజు మోటార్స్‌ ఇండియా ప్రై లిమిటెడ్‌
చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌ విస్తరణ పనులు రూ.250 కోట్లతో చేపట్టింది. 2016 జనవరి 10న ప్లాంట్‌ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. వంద మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది.
రంగా పార్టికల్‌ బోర్డు
ప్రకాశం జిల్లాలో రూ.280 కోట్లతో ప్లాంట్‌ ఏర్పాటుకు 2016లో ఎంవోయూ కుదుర్చుకుంది. ప్రయోగాత్మక ఉత్పత్తి ప్రారంభించింది. 750 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించనుంది.
హీరో మోటార్స్‌
ప్రముఖ ద్విచక్రవాహన సంస్థ హీరో మోటార్స్‌ చిత్తూరు జిల్లాలో ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటు చేస్తోంది.
ఒప్పందం: 2014 సెప్టెంబరు 16న ప్లాంట్‌ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. భూముల వివాదం కారణంగా ఒప్పందం పెండింగ్‌లో పడింది. గత ప్రభుత్వ హయాంలో అన్ని అనుమతులిచ్చి 2018 మార్చి 23న యూనిట్‌ నిర్మాణానికి భూమి పూజ చేశారు. 600 ఎకరాల భూమిని కేటాయించారు.
పెట్టుబడి: రూ.1,600 కోట్లు
ఉత్పత్తి సామర్థ్యం: ఏటా 18 లక్షల వాహనాల తయారీ
ఉపాధి: 2వేల మందికి ప్రత్యక్షంగా, 10వేల మందికి పరోక్షంగా
ప్రస్తుత పరిస్థితి: యంత్రాలు అమర్చే పనులు జరుగుతున్నాయి. ఆరు నెలల్లో ఉత్పత్తి దశకు చేరుతుంది.
కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(కాంకర్‌)
నెల్లూరు జిల్లాలో రూ.150 కోట్ల పెట్టుబడితో యూనిట్‌ నెలకొల్పింది. 2016 జనవరి 10న భాగస్వామ్య సదస్సుల్లో ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం యూనిట్‌ ప్రయోగాత్మక పరిశీలన దశకు చేరింది. 610 మందికి ప్రత్యక్ష ఉపాధి దక్కనుంది.
మోహన్‌ స్పిన్‌టెక్స్‌ (టెక్స్‌టైల్స్‌)
కృష్ణా జిల్లాలో రూ.751 కోట్ల పెట్టుబడులతో ప్లాంట్‌ ఏర్పాటు. 3,575 మందికి ఉపాధి కల్పించనుంది. ప్రస్తుతం యంత్రాలు అమర్చే పని జరుగుతోంది.
శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసిన లిక్వినాక్స్‌ గ్యాసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, విశాఖ జిల్లాలోని సన్‌రే మెటలర్జికల్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమలు ప్రయోగాత్మక పరిశీలన దశకు చేరాయి.
శ్రీనివాస ఫార్మ్స్‌ ప్రై లిమిటెడ్‌ (ఫుడ్‌, ఆగ్రో, మెరైన్‌ ప్రొడక్ట్స్‌) ప్రకాశం జిల్లాలో రూ.250 కోట్ల పెట్టుబడితో రెండు వేల మందికి ఉపాధి కల్పించేలా పరిశ్రమ నెలకొల్పింది. ప్రయోగాత్మక ఉత్పత్తి దశకు చేరింది.
రాజయోగి గ్రానైట్స్‌ (శ్రీకాకుళం), సిరిమాన్‌ (కెమికల్‌, పెట్రో కెమికల్స్‌, విశాఖపట్నం) సంస్థల్లో యంత్రాలు అమర్చే పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ వచ్చే ఆరు నెలల్లో ఉత్పత్తి దశకు చేరతాయని పరిశ్రమల శాఖ పేర్కొంది.
నిరంతరం పర్యవేక్షిస్తున్నాం - సుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌
రాష్ట్రంలో ఏర్పాటవుతున్న పరిశ్రమలను సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తి దశకు తేవాలని ప్రయత్నిస్తున్నాం. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టే ఆరు యూనిట్లను ప్రయోగాత్మక ఉత్పత్తి దశకు తీసుకెళ్లాం. రూ.7,850 కోట్ల పెట్టుబడులతో వచ్చిన మరో ఏడు పరిశ్రమలను త్వరలోనే ప్రయోగాత్మక ఉత్పత్తి దశకు తీసుకొస్తాం.

ABOUT THE AUTHOR

...view details