పోస్టు గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. ఈ ఏడాది పీజీ కోర్సులకు వస్తున్న దరఖాస్తుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. ప్రైవేటు కళాశాలల్లోని పీజీ కోర్సులకు బోధనా రుసుములను ప్రభుత్వం చెల్లించకపోవడమే దీనికి ప్రధాన కారణమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు పూర్తిగా రుసుములను చెల్లిస్తున్న ప్రభుత్వం.. గతేడాది నుంచి ప్రైవేటు కళాశాలల్లో పీజీ కోర్సులకు బోధనా రుసుముల చెల్లింపు నిలిపేసింది. దీంతో సొంతంగా ఫీజులు చెల్లించి ఉన్నత విద్య చదివే వారి సంఖ్య తగ్గుతోంది. చదువు, వసతికి అయ్యే వ్యయాన్ని భరించలేక కొందరు పేదలు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో చేరిన వారికి మాత్రమే బోధన రుసుముల చెల్లింపు, వసతి దీవెనను ప్రభుత్వం అమలు చేస్తోంది.
కనిపించని స్పందన
ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్కు గతేడాది 64,884 మంది దరఖాస్తు చేయగా 51,991 మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 29,338 మంది ప్రవేశాలు పొందారు. ఈసారి 40,324 దరఖాస్తులే వచ్చాయి. అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు గడువు 14వ తేదీతో ముగిసింది. గతేడాదితో పోలిస్తే 24,560 దరఖాస్తులు తగ్గాయి. ప్రవేశాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడనుంది. ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకే అభ్యర్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలకు పీజీఈసెట్ నిర్వహిస్తున్నారు.
గతేడాది 28,868 మంది దరఖాస్తు చేయగా.. 22,911 మంది పరీక్ష రాశారు. వీరిలో 8,108 మంది చేరారు. దరఖాస్తుకు గడువు సమయం దగ్గరపడుతున్నా ఇప్పటివరకూ 5,541 మాత్రమే వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణ గత నెల 19న ప్రారంభం కాగా.. అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు గడువు ఈ నెల 19తో ముగియనుంది. ప్రస్తుతం వస్తున్న దరఖాస్తులను పరిశీలిస్తే ఏడు వేలకు మించే పరిస్థితి కనిపించడం లేదని అధికారులు అంటున్నారు. ఈ లెక్కన ప్రవేశ పరీక్ష రాసేవారి సంఖ్య, ప్రవేశాలు మరింత తగ్గిపోనున్నాయని విశ్లేషిస్తున్నారు.