Urad price: మార్కెట్లో మినుముల ధర రోజురోజుకూ పెరుగుతోంది. రైతుల వద్ద ఉన్నప్పుడు స్థిరంగా ఉన్న ధర.. వారి గడపదాటాక ఎగబాకుతోంది. రబీలో దిగుబడులు వచ్చే పాలిష్ రకం మినుములు మార్చిలో క్వింటా రూ.6,500 పలకగా.. ప్రస్తుతం రూ.8,700 ఉంది. మే ప్రారంభంలో క్వింటా రూ.7,000 ఉన్నప్పుడు ఎక్కువ మంది రైతులు అమ్ముకున్నారు. 2నెలల్లోనే క్వింటా రూ.1,700 వరకు రైతులు నష్టపోయారు. ఖరీఫ్ సాగు ఆలస్యం కావడం, వేసిన పంట అధిక వర్షాలకు దెబ్బతినడం, రైతులు పత్తి, సోయాబీన్ వైపు మొగ్గు చూపడంవంటి కారణాలతో ప్రస్తుతం మినుముల లభ్యత తగ్గింది.
దేశంలో ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తెలంగాణలలో ఖరీఫ్లో మినుము వేస్తారు. సీజన్ ప్రారంభంలో వర్షాలు లేక సాగు ఆలస్యమైంది. తర్వాత అధిక వర్షాలతో పంట దెబ్బతింది. దీంతో గతేడాది నిల్వలు లేవు. దీనికితోడు పత్తి, సోయాబీన్కు ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఉత్తరాది రాష్ట్రాలవారు వాటి సాగుపైనే శ్రద్ధ చూపారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రబీలో మినుము వేస్తారు. ఇందులో ఎక్కువగా పాలిష్ రకం ఉంటుంది. ఈ ఏడాది సుమారు లక్షన్నర టన్నుల దిగుబడి వచ్చింది. ఇందులో 70శాతం రైతులు ఇప్పటికే విక్రయించారు. మరో 10శాతం విత్తన అవసరాలకు ఉంచుకోగా.. 20శాతమే రైతుల వద్ద ఉన్నాయి. రైతులనుంచి కొన్న వ్యాపారులు సైతం క్వింటా రూ.7500నుంచి రూ.8వేల మధ్య విక్రయించారు. మార్కెట్ అంచనా వేసిన కొద్ది మంది వ్యాపారుల వద్దే నిల్వలున్నాయి.