ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 12, 2020, 1:10 PM IST

ETV Bharat / city

కిలో కంది పప్పు రూ.110.. కిలో చింతపండు రూ.240

తెలంగాణలో లాక్​డౌన్​ కొనసాగుతున్న వేళ నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా పప్పుదినుసులు, చింతపండు, నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సరకుల రవాణాలో అవాంతరాలు ధరల పెరుగుదలకు కొంత కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీనిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కంట్రోల్​రూమ్​ను ఏర్పాటు చేసింది.

increased-essential-commodity-prices
increased-essential-commodity-prices

నిత్యావసర వస్తువుల ధరల్లో క్రమేపీ పెరుగుదల నమోదవుతోంది. లాక్‌డౌన్‌ ముందు.. తర్వాత అని బేరీజు వేసి చూస్తే తేడా స్పష్టంగా కళ్లకు కడుతోంది. దాదాపు 30 శాతం వరకు పెరుగుదల ఉంది. ముఖ్యంగా పప్పుదినుసులు, చింతపండు, నూనెల ధరలకు రెక్కలొచ్చాయి. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆంక్షలతో సరకుల రవాణాలో అవాంతరాలు కొంత కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే డీజీపీ మహేందర్‌రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం ఈ పరిస్థితులను అధిగమించేందుకు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.

ధర ఎక్కువనిపిస్తే ఫోన్‌ చేయండి..
కొనే నిత్యావసర వస్తువు ధర గతంతో పోలిస్తే పెరిగిందా.. అంత ధర పెట్టి కొనొచ్చా.. లేక మోసపోతున్నామా.. ఇలాంటి సందేహాలు నివృత్తి చేసుకునేందుకు పౌరసరఫరాల శాఖ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా 040-23336116 నంబరుకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు. లేదా 7330774444 నంబరుకు వాట్సప్‌ చేసి అధిక ధరలపై సందేహాలు అడగొచ్చు. ఫిర్యాదులు చేయొచ్చు. హైదరాబాద్‌లో అయితే చీఫ్‌ రేషనింగ్‌ ఆఫీసర్‌ (సీఆర్‌వో)కు 040-23447770కు ఫోన్‌ చేయొచ్చు.

24 గంటల పాటు ఈ హెల్ప్​లైన్ అందుబాటులో ఉంటుంది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పౌరసరఫరాల అధికారులు 24 నిత్యావసర వస్తువుల ధరలను రోజూ సేకరిస్తారు. ధర పెరిగితే ఎందుకు పెరిగింది? ఎంత పెరిగింది? అనే వివరాలన్నీ వారి వద్ద ఉంటాయి. దీని ద్వారా ఏ జిల్లాలో ఏ వస్తువుకు ఎంత ధర ఉందో అధికారులకు తెలుస్తుంది. వినియోగదారులు ఎవరైనా ఫోన్‌ చేసినప్పుడు ఎంతకు అమ్ముతున్నారో తెలుసుకొని, అధిక ధరకు విక్రయిస్తున్నట్లయితే వెంటనే చర్యలు తీసుకుంటారు. మార్కెట్‌లో ప్రస్తుతం పెరిగిన ధరలపై పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ అర్జున్‌ మల్లిక్‌ను ‘ఈనాడు’ వివరణ కోరగా పరిశీలించి చర్యలకు సిఫార్సు చేస్తామని చెప్పారు.

ప్యాకెట్లు బంద్‌... విడిగా కొనాల్సిందే

సూపర్‌ మార్కెట్‌లలో 500 గ్రాములు, కిలో ఇలా ప్యాకింగ్‌లో లభించే పప్పుదినుసులు ఇప్పుడు విడిగా మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. కూలీలు పనిలోకి రాక, సరకుల కొరత కారణంగా ప్యాకింగ్‌ చేయడం లేదని ఉప్పల్‌లోని ఓ మార్ట్‌ నిర్వహకుడు తెలిపారు. మాల్స్‌తో పాటు కిరాణా దుకాణాలకు నిత్యావసరాలు సరఫరా చేసే హోల్‌సేల్‌లోనూ ధరలు పెరిగాయి. గతనెల కిలో రూ.180 ఉన్న చింతపండు శుక్రవారం కిలో రూ.240కి చేరింది. లాక్‌డౌన్‌ ముందు కిలో రూ.75 ఉన్న కందిపప్పు ఇప్పుడు రూ.110 అయ్యింది. లాక్‌డౌన్‌ను పొడిగించవచ్చనే అభిప్రాయంతో గత నాలుగు రోజులుగా సూపర్‌ మార్కెట్లు, నిత్యావసరాలు విక్రయించే దుకాణాలు ఎప్పుడు చూసినా రద్దీగానే కనిపిస్తున్నాయి. మాల్స్‌ ముందు గంటల తరబడి పడిగాపులుకాయాల్సి వస్తోంది. ఉదయం 11 గంటలకు వస్తే షాపింగ్‌ పూర్తి చేసుకొని బయటికి వచ్చే సరికి మధ్యాహ్నం 12.30 దాటిందని రామంతాపూర్‌లో సూపర్‌ మార్కెట్‌కు వచ్చిన ఓ వినియోగదారుడు తెలిపారు. గత నెలతో పోలిస్తే వస్తువుల ధరలు పెరిగాయన్నారు.

ఇవీచూడండి:కరోనా రక్కసి అంతానికి ఆయుర్వేద బ్రహ్మాస్త్రం!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details