ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పురపాలక ఎన్నికలకు ఎస్‌ఈసీ రమేశ్‌కుమారేనా? - రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్ కుమార్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీకాలం కుదింపు వ్యవహారంలో.... హైకోర్టు కీలక సందేహాలు లేవనెత్తింది. పురపాలక చట్టానికి సవరణ చేయనందున రమేశ్‌కుమార్‌ ఎస్‌ఈసీగా కొనసాగుతున్నట్లేనా అని ప్రశ్నించింది. మున్సిపల్ చట్టంలో ఎస్‌ఈసీ నియామక నిబంధనలపై స్పష్టత ఇవ్వాలని కోరింది. ఈ వ్యవహారంపై హైకోర్టులో నేడు వాదనలు కొనసాగనున్నాయి.

Rameshkumar continues to be the SEC as he has not amended the municipal law.
పురపాలక ఎన్నికలకు ఎస్‌ఈసీ రమేశ్‌కుమారేనా?

By

Published : May 5, 2020, 7:27 AM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) పదవీ కాలం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పురపాలక చట్టాన్ని సవరించనందున పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల ఎన్నికల విషయంలో ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పదవీ కాలం కొనసాగుతున్నట్లేనా....అని హైకోర్టు సందేహం వెలిబుచ్చింది. తాజాగా సవరించిన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ఎస్‌ఈసీగా మూడేళ్లు.. పురపాలక చట్టం ప్రకారం ఐదేళ్ల పదవీ కాలంతో ఒకే వ్యక్తి ఎలా వ్యవహరించగలరని వ్యాఖ్యానించింది. పురపాలక చట్టంలో ఎస్‌ఈసీ నియామకం, పదవీకాల నిబంధనలు ఏమైనా ఉన్నాయా? తదితర అంశాలపై స్పష్టతనివ్వాలని సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావును కోరింది. వాదనల కొనసాగింపునకు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశించింది.

తనను ఎస్‌ఈసీగా తొలగించేందుకు ప్రభుత్వం దురుద్దేశంతో ఆర్డినెన్సు తీసుకొచ్చిందంటూ మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంతోపాటు ఆర్డినెన్సు, తదనంతర జీవోలను సవాలు చేస్తూ మరో 12 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టు ప్రత్యక్షంగా విచారించింది. వ్యాజ్యాలను దాఖలు చేసిన న్యాయవాదులు, వారి తరఫు సీనియర్‌ న్యాయవాదులు, ప్రతివాదుల తరఫు న్యాయవాదులను మాత్రమే హైకోర్టు అనుమతించింది. వారు దూరం పాటించేలా చూసింది.

ఆర్డినెన్సులో ప్రస్తావించలేదే?

ఓ పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు ప్రారంభిస్తూ.. ఆర్డినెన్సు తీసుకొచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఎస్‌ఈసీ సర్వీసు నిబంధనలు, పదవీ కాలాన్ని నిర్ణయిస్తూ చట్టం చేసే అధికారం మాత్రమే శాసనసభకు ఉందని వివరించారు. రమేశ్‌కుమార్‌ను ఎస్‌ఈసీగా కొనసాగించకూడదనే దురుద్దేశంతోనే పంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరిస్తూ కొత్త నిబంధన చేర్చి ఆర్డినెన్సు తెచ్చారన్నారు. ఎన్నికల సంస్కరణల కోసమేనని ఆర్డినెన్సులో ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించలేదని వివరించారు.

రాజ్యాంగ రక్షణ ఉంది

ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్‌ మస్తాన్‌వలీ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. ఆర్డినెన్సు చట్టబద్ధతను సవాలు చేసే అధికారం ప్రజలకు ఉందని అన్నారు. ఆర్డినెన్సును సవాలు చేస్తూ తాము వేసిన వ్యాజ్యానికి విచారణార్హత లేదని ప్రభుత్వం చెప్పడం సరికాదని అన్నారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఒకే విధమైన బాధ్యతలు, రాజ్యాంగ రక్షణ ఉంటుందని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి...మహిళా ఎస్సై అత్యుత్సాహం... విలేకరిపై దాడి..!

ABOUT THE AUTHOR

...view details