ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 12, 2021, 5:37 AM IST

ETV Bharat / city

ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు ప్రైవేటుగా మారితే.. విద్యార్థులకు ఇబ్బందే..!

రాష్ట్రంలోని ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు ప్రైవేటుగా మారితే.. అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ కళాశాలల కొరత ఏర్పడనుంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదవాలనుకునే విద్యార్థులు గంటల తరబడి, కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుంది. ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ఆర్థిక సాయం నిలిపివేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. వాటిని ప్రైవేటుగా నిర్వహించుకోవాలని, లేదంటే తనకు అప్పగించాలని షరతు విధించింది.

ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు
ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు

ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు ప్రైవేటుగా మారితే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ కళాశాలల కొరత ఏర్పడనుంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదవాలనుకునే విద్యార్థులు గంటల తరబడి, కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుంది. ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ఆర్థిక సాయం నిలిపివేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. వాటిని ప్రైవేటుగా నిర్వహించుకోవాలని, లేదంటే తనకు అప్పగించాలని షరతు విధించింది. కళాశాలలకు ఉన్న స్థలాలు, భవనాల విలువ పెరగడంతో వాటిని ప్రభుత్వానికి ఇచ్చేంద]ుకు చాలావరకు యాజమాన్యాలు అంగీకరించడం లేదు. సిబ్బందినే ఇస్తామంటున్నాయి.

ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌గా మారిన విద్యా సంస్థలు అదనపు ఫీజులను వసూలు చేస్తాయి. ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ చదివే వారికి ప్రభుత్వం బోధనా రుసుములను చెల్లిస్తున్నా కొన్ని యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా అదనంగా వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ కళాశాల అయితే అర్హత కలిగిన అధ్యాపకులతోపాటు అదనపు రుసుముల వసూలు ఉండదు. ఇప్పటివరకు ఎయిడెడ్‌ సంస్థలను ప్రభుత్వ కళాశాలలుగానే భావిస్తూ అవి ఉన్నచోట ప్రభుత్వ కళాశాలలను ఏర్పాటు చేయలేదు. ఇప్పుడవి అన్‌ ఎయిడెడ్‌గా మారితే ప్రైవేటులో మరిన్ని ప్రవేశాలు పెరుగుతాయి. బోధన రుసుముల చెల్లింపుతో ప్రభుత్వంపైనా ఆర్థికభారం పడనుంది. రాష్ట్రంలో 137 ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలుండగా.. వీటిలో 10 యాజమాన్యాలే స్థలాలతో సహా పూర్తిగా ప్రభుత్వానికి అప్పగించేందుకు ముందుకొచ్చాయి. మరో 90 కళాశాలలు సిబ్బందిని వెనక్కి ఇచ్చేందుకు సమ్మతి తెలిపాయి. మిగతావి తమ నిర్ణయాన్ని వెల్లడించలేదు.

సిబ్బంది సర్దుబాటు

రాష్ట్రంలో ఉన్న 137 ఎయిడెడ్‌ కళాశాలల్లో 1,091 మంది అధ్యాపకులు పని చేస్తున్నారు. వీరినీ ప్రభుత్వ కళాశాలల్లో సర్దుబాటు చేయాలి. రాష్ట్రంలోని 154 ప్రభుత్వ కళాశాలల్లో కొత్త నియామకాలను మినహాయిస్తే 400 ఖాళీలు ఉన్నాయి. 700 మంది ఒప్పంద అధ్యాపకులున్నారు. జూనియర్‌ లెక్చరర్లకు పదోన్నతులు కల్పిస్తే ఈ సంఖ్య మరింత తగ్గుతుంది. అధికంగా ఉండే అధ్యాపకులను ఎక్కడ వినియోగిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.

గుంటూరులోని ఎయిడెడ్‌ కళాశాలలు ప్రైవేటుగా మారితే అబ్బాయిలు ప్రభుత్వ కళాశాలలో చదివేందుకు 18 కిలోమీటర్ల దూరంలోని చేబ్రోలు వెళ్లాలి. నగరంలోని ఇతర కళాశాలలన్నీ ఎయిడెడ్‌వే. ప్రభుత్వ మహిళా కళాశాల ఒక్కటే ఉంది. నర్సరావుపేటలోని రెండు కళాశాలలూ ఎయిడెడ్‌వే. ఇక్కడి విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చేరాలంటే 45 కిలోమీటర్ల దూరంలోని వినుకొండకు వెళ్లాలి. తెనాలిలో రెండు ఎయిడెడ్‌ విద్యా సంస్థలున్నాయి. బాపట్లలో ఎయిడెడ్‌ కళాశాల ప్రైవేటుకు మారితే ప్రభుత్వ కళాశాల కోసం అబ్బాయిలు 35 కిలోమీటర్ల దూరంలోని చేబ్రోలుకు వెళ్ల్లాల్సిందే. ఇక్కడ ఒకే ఒక్క ప్రభుత్వ మహిళా కళాశాల ఉంది.

*ప్రకాశం జిల్లా చీరాలలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఒక్కటే ఉంది. ఎయిడెడ్‌ ప్రైవేటుగా మారితే అబ్బాయిలు 60 కిలోమీటర్ల దూరంలోని ఒంగోలు వెళ్లాలి.

*చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఎయిడెడ్‌ కళాశాల ఉంది. ఇక్కడ ప్రభుత్వ మహిళా కళాశాల మాత్రమే ఉంది. ఎయిడెడ్‌ ప్రైవేటుగా మారితే ఇక్కడ అబ్బాయిలు 40 కిలోమీటర్ల దూరంలోని పీలేరుకు వెళ్లాల్సిందే.

*నెల్లూరులో ఎండోమెంట్‌ విభాగంలో ఉన్న వీఆర్‌సీ, సర్వోదయ ఎయిడెడ్‌ సంస్థలే. వీటిని ప్రైవేటుగా మార్చితే డీకే మహిళా కళాశాల మాత్రమే ఉంటుంది. అబ్బాయిలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉండదు.

*రాజమహేంద్రవరంలో రెండు ఎయిడెడ్‌ ఉండగా.. ఒక ప్రభుత్వ కళాశాల ఉంది. కాకినాడలో 3 ఎయిడెడ్‌, రెండు ప్రభుత్వ కళాశాలలున్నాయి.

*కడప జిల్లా ప్రొద్దుటూరులో రెండు ఎయిడెడ్‌ ఉండగా.. ఒక ప్రభుత్వ కళాశాల ఉంది. పులివెందులలో ఎయిడెడ్‌, ప్రభుత్వ కళాశాలలు ఒక్కోటి ఉన్నాయి.

ఒక్కటీ లేదు..

*సత్తెనపల్లిలో ఎయిడెడ్‌ కళాశాలలు ప్రైవేటుగా మారితే ప్రభుత్వ కళాశాల అందుబాటులో ఉండదు. చిలకలూరిపేటలోనూ ప్రభుత్వ కళాశాల లేదు.

*గుడివాడలో ఉన్న రెండు కళాశాలలు ఎయిడెడ్‌వే. జగ్గయ్యపేటలో ఒకే ఒక్క ఎయిడెడ్‌ సంస్థ ఉంది. ప్రభుత్వ కళాశాల కావాలంటే 20 కిలోమీటర్ల దూరంలోని నందిగామ వెళ్లాలి.

*నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ఎయిడెడ్‌ ప్రైవేటుగా మారితే ప్రభుత్వ కళాశాల కోసం సుమారు 70 కిలోమీటర్ల దూరంలోని విడవలూరు వెళ్లాలి.

*విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఒకే ఒక్క ఎయిడెడ్‌ విద్యా సంస్థ ఉంది. పార్వతీపురంలోనూ ఇదే పరిస్థితి. వీరు ప్రభుత్వ కళాశాలలో చేరాలంటే 25-40 కిలోమీటర్లలోని సాలూరుకు వెళ్లాలి.

*అనకాపల్లిలోని ఉన్న ఒక్క ఎయిడెడ్‌ ప్రైవేటు అయితే ఇక్కడి విద్యార్థులు చోడవరానికి వెళ్లాలి.

*అమలాపురంలోని ఎస్‌కేబీఆర్‌ ఎయిడెడ్‌ కళాశాల కోనసీమలోని 16 మండలాల విద్యార్థులకు ఆధారం. ఇది అన్‌ఎయిడెడ్‌గా మారితే ప్రభుత్వ కళాశాల కోసం 65 కిలోమీటర్ల దూరంలోని కాకినాడ, లేదంటే ఇంకా ఎక్కువ దూరంలోని రాజమహేంద్రవరం వెళ్లాలి. పెద్దాపురంలోనూ ఇదే పరిస్థితి.

*ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఒక్క ఎయిడెడ్‌ కళాశాల అన్‌ ఎయిడెడ్‌గా మారితే ప్రభుత్వ కళాశాల కోసం 25-35కిలోమీటర్ల దూరంలోని కంభం వెళ్లాలి.

*కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఒకే ఒక్క ఎయిడెడ్‌ కళాశాల ఉంది. ప్రభుత్వ విద్యా సంస్థలో చేరాలంటే 15-20 కిలోమీటర్ల దూరంలోని ఎర్రగుంట్ల, చాగలమర్రి ప్రయాణించాల్సిందే. ఆదోనిలోనూ ఒకే ఒక్క ఎయిడెడ్‌ కళాశాల ఉంది.

ఇప్పటికీ భవనాలే లేవు..

ఏలూరులో మూడు డిగ్రీ కళాశాలలుండగా.. వీటిలోని ఏకైక ప్రభుత్వ విద్యా సంస్థకు సొంత భవనాలు లేవు. ఈ ప్రాంతంలో పేరుగాంచిన సీఆర్‌ఆర్‌ కళాశాల ఎయిడెడ్‌గానే ఉంది. ఇందులో సీట్లకు మంచి డిమాండ్‌ ఉంటుంది.

సేవా దృక్పథంతో పనిచేసేవీ ఉన్నాయి

‘ఎయిడెడ్‌ విద్యా సంస్థల్లో కొన్ని సేవా దృక్పథంతో పని చేసేవీ ఉన్నాయి. అన్నింటినీ ఒకేలా చూడకూడదు. ఎందరో ప్రముఖులు చదివిన కళాశాలలు కనుమరుగయ్యేలా చేయడం సరికాదు. గతంలో ప్రభుత్వ కళాశాలలు లేనందునే ఎయిడెడ్‌ సంస్థలు వచ్చాయి. ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటుచేయకుండా సాయం నిలిపివేయడం మంచిది కాదు. వెనక్కి తీసుకునే బోధన, బోధనేతర సిబ్బంది సర్వీసు నిబంధనలపైనా స్పష్టత ఇవ్వాలి’ - ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి

దూరాభారం

*హిందూపురంలో ప్రభుత్వ మహిళా కళాశాల మాత్రమే ఉంది. ఇక్కడి ఎయిడెడ్‌ విద్యా సంస్థ ప్రైవేటుగా మారితే అబ్బాయిలు వంద కిలోమీటర్ల దూరంలోని అనంతపురం వెళ్లాలి.

*విజయవాడలో 10 డిగ్రీ కళాశాలలుండగా.. తొమ్మిది ఎయిడెడ్‌. ఇవి ప్రైవేటుగా మారిపోతే ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ కళాశాల మాత్రమే మిగులుతుంది. మచిలీపట్నంలోని 4 డిగ్రీ కళాశాలలూ ఎయిడెడ్‌వే.

*విశాఖపట్నంలో 5 ఎయిడెడ్‌ కళాశాలలుండగా.. ప్రభుత్వ కళాశాలలు రెండున్నాయి. ఇందులో ఒకటి మహిళలకు ప్రత్యేకం.

*విజయనగరంలో 3 డిగ్రీ కళాశాలలుండగా.. వీటిలో రెండు మహారాజా కళాశాలలు ఎయిడెడ్‌వే. ఉన్న ఒక్క ప్రభుత్వ కళాశాలకు భవనాలు లేవు.

ఇదీ చదవండి:

పార్లమెంట్​ నిరవధిక వాయిదా.. కీలక బిల్లుల ఆమోదం

Amit Sha Srisailam Tour: నేడు శ్రీశైలానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ABOUT THE AUTHOR

...view details