ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 9, 2020, 8:11 PM IST

ETV Bharat / city

కరోనా కట్టడికి కంటైన్​మెంట్ వ్యూహం..!

కరోనా వైరస్​ను కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్​ను హైదరాబాద్ పోలీసులు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. హైదరాబాద్​లో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు.. ప్రధాన రహదారి పైకి వాహనాలు రాకుండా కట్టడి చేస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా జీహెచ్​ఎంసీ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో శానిటైజేషన్ పనులుతో పాటు నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చూస్తోంది. బయటి వ్యక్తుల లోపలికి రాకుండా ఆ జోన్లను దిగ్బంధం చేశారు.

hyderabad-containment-zones
hyderabad-containment-zones

కరోనా కట్టడికి కంటైన్​మెంట్ వ్యూహం

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలను నియంత్రించడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఏదొక కారణం చెప్పి రోడ్లపైకి వస్తున్నారు. దీంతో వివిధ శాఖల అధికారులతో కలిసి కార్యాచరణ రూపొందించారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 15 ప్రాంతాలను జీహెచ్​ఎంసీ అధికారులు గుర్తించారు. కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో కుత్బుల్లాపూర్, చందానగర్, మూసాపేట్, యూసఫ్​గూడ, రెడ్ హిల్స్, రాంగోపాల్ పేట్, సంతోష్​ నగర్, చాంద్రాయణగుట్ట, అల్వాల్, కూకట్​పల్లి, బాలాపూర్, మయూరి నగర్​ ఉన్నాయి. ప్రస్తుతం ఈ 12 ప్రాతాలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. భవిష్యత్తులో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

పగడ్బందీగా లాక్​డౌన్​ అమలు

4 నుంచి 7వేల మంది జనాభా ఉన్న ప్రాంతాన్న ఒక క్లస్టర్​గా విభజించారు. ఈ 12 ప్రాంతాల్లోనే 89 మందికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల నుంచి రాకపోకలు ఇతర కాలనీలోకి సాగకుండా చర్యలు చేపట్టారు. బయట వ్యక్తులు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిత్యావసర వస్తువులు, ఔషధాలు ఎప్పటికప్పుడు వీరికి అందుబాటులో ఉంటాయని జీహెచ్ఎంసీ కమిషనర్ వెల్లడించారు. దీంతోపాటు పోలీసులు కూడా పకడ్బందీగా లాక్ డౌన్ అమలుచేసేందుకు చర్యలు చేపట్టారు.

ఆ బాధ్యత వారికి అప్పగించారు

ఆ వీధుల నుంచి వచ్చే వాహనాలను ప్రధాన రహదారి పైకి రాకుండా నిలువరిస్తున్నారు. ఖైరాతాబాద్ లోని రైల్వే గేట్ నుంచి వాహన రాకపోకలు సాగకుండా పూర్తిగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. జోన్ల పరిశీలన ఆయా డీసీపీ, జీహెచ్​ఎంసీ జోనల్ కమిషనర్లకు అప్పగించారు. మున్సిపల్ అధికారుతో కలిసి హైదరాబాద్ కమిషనర్ ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాను అధికారులతో కలిసి తనిఖీ చేస్తున్నారు. కరోనా వ్యాప్తిని పూర్తిగా అరికట్టేందుకు చేస్తున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details