తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన దళితబంధు పథకానికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదని ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. ఆ పథకాన్ని ఉప ఎన్నిక జరగనున్న హుజూరాబాద్కే (Huzurabad) పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లోని ఎస్సీలకు ఫలాలు అందాలని అన్నారు. కేవలం ఉపఎన్నిక ఉన్న నియోజకవర్గాలకే పరిమితం కాకూడదని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత, గిరిజనులకు రూ. 10 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇస్తవా-చస్తవా
'హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకే దళిత బంధు పథకం తెచ్చినట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం ఏదైనా కొత్త పథకం తేవాలంటే ఉప ఎన్నికలు రావాలి. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఉప ఎన్నికలు తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఇస్తవా-చస్తవా అనే నినాదంతో మేము ముందుకెళుతున్నాం. ప్రజల తరఫున మేం ప్రభుత్వంతో కొట్లాడతాం. తెరాస ఎమ్మెల్యేలు ప్రతి దళిత, గిరిజన కుటుంబానికి రూ.10 లక్షలు ఇప్పించాలి. లేదంటే రాజీనామా చేయాలి. అలా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయి. అందరికీ ప్రయోజనం జరుగుతుంది. గత ఏడేళ్లుగా మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు తగిన గుణపాఠం, జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఉద్యమకారుడు, తెలంగాణ బిడ్డల మీద ఉంది.'
-రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు