తెలంగాణ రాష్ట్రం హుజూరాబాద్లో ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. దళితబంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలతో హుజూరాబాద్లో భాజపా, తెరాస మధ్య మాటలయుద్ధం మరింత తీవ్రమైంది. దళితబంధు పథకాన్ని ఆపాలని ఈసీకి లేఖ రాసింది మీరంటే.. మీరే అంటూ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు పథకాలు ప్రకటించి, ఈసీ పేరు చెప్పి ఆపుతున్నారని భాజపా ఆరోపిస్తుండగా.. ఎన్నికల సంఘానికి ప్రత్యర్థులు ఫిర్యాదు చేయడం వల్లే పథకం తాత్కాలికంగా నిలిచిందని తెరాస చెబుతోంది.
కడుపు మంటతోనే లేఖ..
జమ్మికుంటలో జరిగిన ధూంధాం కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. తెరాస అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు. దళిత బంధు పథకం ఆపాలని ఎన్నికల కమిషన్కు భాజపా లేఖ ఇచ్చినట్లు పూర్తి ఆధారాలు ఉన్నాయని తెలిపారు. రుజువు చేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు. పథకం కారణంగా గెల్లు శ్రీనివాస్కు ఎక్కడ మంచిపేరు వస్తుందో అనే కడుపు మంటతోనే లేఖ రాశారని అరోపించారు. లబ్ధిదారులు ఆందోళన చెందవద్దన్న హరీశ్.. ఎన్నికల తర్వాత ప్రక్రియను మళ్లీ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.