ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 20, 2021, 8:02 AM IST

ETV Bharat / city

AADHAR E-KYC: ఆధార్ కష్టాలు... తెల్లవారుజాము నుంచే కేంద్రాల వద్ద పడిగాపులు

ఈ-కేవైసీ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆధార్‌ కేంద్రాలు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. ప్రభుత్వ పథకాల వర్తింపునకు పిల్లల ఆధార్‌ అప్‌డేట్‌ తప్పనిసరి చేయడంతో కేంద్రాల వద్ద వేకువజామున నుంచే ప్రజలు బారులు తీరుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఇంకా 60 లక్షల మంది వరకు ఈకేవైసీ ద్వారా ఆధార్‌ ధ్రువీకరించుకోవాల్సి ఉంది. వారిలో పెద్దలైతే నెలాఖరులోగా, పిల్లలు సెప్టెంబరు చివర్లోగా ధ్రువీకరణ తీసుకోవాల్సి ఉంది.

AADHAR E-KYC
ఆధార్ కష్టాలు

ఆధార్‌ నవీకరణ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఏ కేంద్రం వద్ద చూసినా బారులు తీరిన కార్డుదారులే కన్పిస్తున్నారు. ఈకేవైసీ (ఈ వ్యక్తిని నేనే అని ఆధార్‌ ద్వారా ధ్రువీకరించుకోవడం) చేయించుకుంటేనే వచ్చే నెలలో రేషన్‌ ఇస్తామని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేయడంతో లక్షలాది మందిలో ఆందోళన మొదలైంది. పిల్లలతో సహా తెల్లవారుజామునే ఆధార్‌ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. మధ్యాహ్నం వరకు క్యూలైన్లలోనే నిరీక్షిస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఇంకా 60 లక్షల మంది వరకు ఈకేవైసీ ద్వారా ఆధార్‌ ధ్రువీకరించుకోవాల్సి ఉంది. నాలుగైదు రోజుల్లో 12లక్షల మంది వరకు ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు. మిగిలిన వారిలో పెద్దలైతే నెలాఖరులోగా, పిల్లలు సెప్టెంబరు చివర్లోగా ధ్రువీకరణ తీసుకోవాల్సి ఉంది.

ఎందుకింత హడావుడి?

కార్డులోని కుటుంబీకులంతా నిజంగానే ఉన్నారని వాలంటీరు వద్ద ధ్రువీకరించుకోవడమే ఈకేవైసీ ఉద్దేశం. ఇందుకు ఆధార్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. సంబంధిత కుటుంబసభ్యుడు వాలంటీరు వద్ద వేలిముద్ర వేస్తే ఆధార్‌ సర్వర్‌కు అనుసంధానమై ధ్రువీకరణ పూర్తవుతుంది. వేలిముద్రలు పడకపోతే ఆధార్‌ కేంద్రానికి వెళ్లి నవీకరించుకోవాలి. వాలంటీరు, రేషన్‌డీలర్‌ వద్ద ఈకేవైసీ చేయించుకోవాలి. ఐదేళ్లు దాటిన పిల్లల వేలిముద్రలను కొత్తగా నమోదు చేయించుకుంటేనే ఈకేవైసీ పూర్తవుతుంది. వృద్ధులు కూడా తమ వేలిముద్రలు సరిపోకపోతే నవీకరించుకోవాల్సిందే. అయితే కొందరి వేలిముద్రలు బాగానే ఉన్నా వాలంటీర్లు పట్టించుకోకుండా ఆధార్‌ కేంద్రానికి వెళ్లి నవీకరించుకోమని సూచిస్తున్నారు.

అంతా గందరగోళం

రేషన్‌కు ఈకేవైసీ కోసం రెండేళ్ల కిందట కూడా ఇలాగే హడావుడి కనిపించింది. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతమైంది. ఈకేవైసీపై ఒక్కోసారి ఒక్కోమాట చెబుతున్నారు. తొలుత కుటుంబీకులంతా ధ్రువీకరించుకోవాలని చెప్పారు. తర్వాత పెద్దవాళ్లు వేలిముద్ర వేస్తే సరిపోతుందన్నారు. ఇటీవల మళ్లీ కుటుంబీకులంతా ఈకేవైసీ చేయించుకోవాలని స్పష్టం చేస్తున్నారు. పొంతన లేకపోవడంతో అందరిలోనూ గందరగోళం నెలకొంటోంది.

మధ్యాహ్నం రెండింటి వరకు లైన్లలోనే

‘తెల్లవారుజామున వస్తే మధ్యాహ్నం రెండింటి వరకు లైనులో నిలబడాల్సి వచ్చింది. ముందే రిజర్వు చేసుకోమని చెబుతున్నారు. అదెలాగో తెలియడం లేదని’ మంగళగిరినుంచి విజయవాడ కేంద్రానికి వచ్చిన వరలక్ష్మి వాపోయారు. ‘కరోనా భయం పొంచి ఉంది. పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. ఈ సమయంలో ఇంతమంది పిల్లలను ఒకేచోట చేర్చి ఆధార్‌ పూర్తి చేయించుకోవాల్సి వస్తోంది. భయంభయంగా ఉంది’ అని పలువురు మహిళలు పేర్కొన్నారు. ‘పిల్లలకు ఒకరి తర్వాత ఒకరి వేలిముద్రలు వేయిస్తున్నారు. యంత్రాన్ని శుభ్రం చేయకుండానే ఐరిస్‌ తీస్తున్నారు’ అని పలువురు వాపోయారు.

కేంద్రాలెక్కడో.. పనిచేసేదెప్పుడో?

మీసేవ, కామన్‌ సర్వీస్‌ సెంటర్లు, తపాలా కార్యాలయాలు, బ్యాంకుల్లో ఆధార్‌ సేవలను అందిస్తున్నారు. అవి ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయో సరైన సమాచారం లేదు. పనిచేసినా రోజుకు 30 మించి తీయడం లేదు. సర్వర్‌ సమస్యలూ ఎదురవుతున్నాయి. బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో ఆధార్‌ సేవలపై ప్రచారం లేదు. ఇదే అదనుగా కొందరు ఒక్కొక్కరినుంచి రూ.250 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. విజయవాడలో రోజుకు 500, విశాఖపట్నంలో 1,700 మంది వరకు సేవలందించేలా ఆధార్‌ శాశ్వత కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇక్కడ రద్దీ తీవ్రంగా ఉంది.

వారం వరకు ఆన్‌లైన్‌ స్లాట్లు పూర్తి

ఆధార్‌ కేంద్రాల్లో వేలిముద్రలను నవీకరించుకునేందుకు ముందుగా ఆన్‌లైన్‌లో స్లాట్‌ తీసుకునే వీలుంది. వచ్చిన తేదీ ప్రకారం కేంద్రానికి వెళ్లి ఆధార్‌ నమోదు చేసుకోవచ్చు. దీనిపై అవగాహన లేని వారు కంప్యూటర్‌ కేంద్రాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఇక్కడా రద్దీ తీవ్రంగానే ఉంది. ఆగస్టు 26 వరకు స్లాట్లు పూర్తయ్యాయని విజయవాడలోని ఆధార్‌ కేంద్రం మేనేజర్‌ హరికృష్ణ వివరించారు. స్లాట్‌ తీసుకోకుండా ఎక్కువమంది వస్తుండటంతో వారందరికీ ఆధార్‌ వేలిముద్రలు నమోదు చేస్తున్నామని చెప్పారు. కొంతమందికి ఆధార్‌ నమోదై ఉన్నా, వాలంటీర్లు చెప్పారని వారు వస్తున్నారని వివరించారు.

అవసరమైతే పొడిగిస్తాం

కేంద్రం ఆదేశాల మేరకు కార్డులోని కుటుంబసభ్యులందరికీ ఈకేవైసీ నమోదు చేస్తున్నాం. కార్డులు తొలగించడం ఉద్దేశం కాదు. ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారికి వెంటనే రేషన్‌ ఇస్తాం. మిగిలిన కుటుంబసభ్యులు ఎప్పుడు నమోదు చేసుకుంటే అప్పుడు రేషన్‌ పొందవచ్చు. పెద్దలకు నెలాఖరు వరకు, పిల్లలకు సెప్టెంబరు ఆఖరు వరకు గడువు ఉంది. ఐదేళ్లలోపు పిల్లలకు అవసరం లేదు. ఎక్కువ మంది మిగిలిపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమయం పొడిగించే అవకాశాన్ని పరిశీలిస్తాం. ఏడాదిన్నరగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈకేవైసీ చేయించుకుంటే దేశంలో ఎక్కడైనా వేలిముద్ర వేసి రేషన్‌ తీసుకోవచ్చు. రాష్ట్రంలో ప్రస్తుతం 2102 ఆధార్‌ నమోదు కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. అన్ని గ్రామ/వార్డు సచివాలయాలనూ ఆధార్‌ నమోదు కేంద్రాలుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి విన్నవించాం. ఆధార్‌ వేలిముద్రలు సరిగా పడనివారు రేషన్‌ దుకాణంలో ఉండే ఫ్యూజన్‌ ఫింగర్‌ సదుపాయాన్ని వినియోగించుకుని ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. బయోమెట్రిక్‌ రికార్డు కాని వారు మాత్రమే ఆధార్‌ కేంద్రాల వద్దకు వెళ్లాలి. - కోన శశిధర్‌, కమిషనర్‌, పౌరసరఫరాలశాఖ


ఇదీ చదవండి

e-kyc must: రేషన్ కావాలంటే.. ఈ-కేవైసీ చేయించుకోవాల్సిందే..!

ABOUT THE AUTHOR

...view details