ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇళ్లలోనే పాల నాణ్యతను ఇలా గుర్తించవచ్చు...

Adulterated Milk: 2018లో భారత్‌లో సేకరించిన పాల నమూనాల్లో 7 శాతం నాణ్యతగా లేవు. పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఫార్మాలిన్‌ లేదా బోరిక్‌ ఆమ్లం, చిక్కగా ఉండటానికి క్లోరిన్‌, అమ్మోనియం సల్ఫేట్‌ కలుపుతున్నారు. ఈ రసాయనాలు కలిపిన పాలు తాగితే ఆరోగ్యానికి హానికరమని బెంగళూరుకు చెందిన ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌)’ శాస్త్రవేత్తలు విర్కేశ్వర్‌కుమార్‌, సుస్మితాదాస్‌ ఇటీవల పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. ఇళ్లలోనే చిన్న పరీక్షల ద్వారా పాల స్వచ్ఛతను, నాణ్యతను గుర్తించవచ్చని సూచించారు.

By

Published : Feb 4, 2022, 10:53 AM IST

milk identity at home
http://10.10.50.85:6060//finalout4/telangana-nle/thumbnail/04-February-2022/14366239_87_14366239_1643929207799.png

Adulterated Milk: పొద్దున్నే పాలు తాగడం మనలో చాలామందికి అలవాటు. ఆరోగ్యకరమని పిల్లలకు పట్టి మరీ తాగిస్తుంటాం. నాణ్యమైనవైతే నిజంగానే మేలే. కల్తీదైతే అనారోగ్యం‘పాలు’ కావడం తథ్యమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలోని పలు వ్యవస్థలపై కల్తీ పాలు దుష్ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. పాలలో ఎక్కువగా నీళ్లు, డిటర్జెంట్‌, గంజి పొడి, యూరియాలను కలుపుతుంటారు. ఇటీవల హైదరాబాద్‌ నగర శివారులోని పటాన్‌చెరులో పోలీసులు కృత్రిమ పాల తయారీ కేంద్రం గుట్టురట్టు చేయడంతో ఈ సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. ఈ పరిస్థితుల్లో పాలు కల్తీ అయ్యాయో లేదో ఇంట్లోనే సులభమైన పద్ధతుల్లో తెలుసుకోవచ్చని ఐఐఎస్‌ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

పరిశోధన పత్రం ఏమి చెబుతోంది?
స్వచ్ఛమైన పాలు -0.55 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వద్ద గడ్డకడతాయి. ఈ ఉష్ణోగ్రత మారిందంటే అందులో నీరు కలిసిందని అర్థం. సగటున లీటరు పాలకు 2 నుంచి 20 శాతం దాకా నీరు కలుపుతున్నారు. ‘లాక్టోమీటరు’ పరికరంలో పాలు పోయగానే అందులో ‘కొవ్వు కాకుండా ఇతర ఘనపదార్థాలు’(ఎస్‌ఎన్‌ఎఫ్‌) ఎంత శాతం ఉన్నాయో తెలిసిపోతుంది. పాలను వేడి చేసినప్పుడు వచ్చే ఆవిరిలో ఏర్పడే ఘనపు రేణువులు స్ఫటికాల రూపంలో ఘనీభవిస్తే అందులో యూరియా కల్తీ చేశారని కనుగొనవచ్చు.

డిటర్జెంట్‌ పొడిని కలిపారేమో గుర్తించడానికి.. ఒక గ్లాసులో 10 మి.లీ. పాలు, అంతే మొత్తంలో నీరు పోసి గిరాగిరా తిప్పి బాగా కలపాలి. డిటర్జెంట్‌ పొడి కలిపి ఉంటే పైన బాగా నురగ వస్తుంది. స్వచ్ఛమైన పాలైతే చాలా స్వల్పంగా నురగ వస్తుంది.

పాలు చిక్కగా కనిపించాలని పిండి పదార్థాలు, గంజిపొడి కలుపుతుంటారు. 2-3 మి.లీ. పాలను ఒక చెంచాలో తీసుకొని.. అంతే మోతాదులో నీళ్లు కలిపి మరగబెట్టి చల్లార్చాలి. అందులో 5 చుక్కలు ‘టించర్‌ అయోడిన్‌’ కలపాలి. (ఇది ఔషధ దుకాణాల్లో లభ్యమవుతుంది.) పిండి పదార్థాలు కలిపి ఉంటే.. పాలు నీలి రంగులోకి మారుతాయి. కల్తీ కాకపోతే తెల్లగానే ఉంటాయి.

పాలలో యూరియాను గుర్తించడానికి సులభమైన పద్ధతులున్నాయి. ఔషధ దుకాణాల్లో ‘యూరియాసే స్ట్రిప్స్‌’ అమ్ముతుంటారు. వాటిపై కొంచెం పాలు పోయాలి. అందులో గీతలు కనిపిస్తే యూరియాతో తయారుచేసిన కృత్రిమ పాలని అర్థం.

నీళ్లు కలిపితే గుర్తించండిలా..

నీరు కలిపారా? లేదా? తెలుసుకోవడానికి.. వాలుగా ఉన్న బండ/చెయ్యిపై పాలు పోయాలి. మెల్లగా కదిలితే అవి స్వచ్ఛమైన పాలు. జరజరా పారితే నీరు కలిపినట్టు లెక్క.

నెయ్యిలో వనస్పతి కల్తీనీ గుర్తించొచ్చు

నెయ్యిలో వనస్పతి కల్తీని గుర్తించడమూ సులభమే. ఒక స్పూన్‌ నెయ్యిని టెస్ట్‌ట్యూబ్‌లోకి తీసుకోవాలి. అంతే మొత్తంలో హైడ్రోక్లోరిక్‌ ఆమ్లాన్ని అందులో పోయాలి. దానికి కొంచెం చక్కెర కలపాలి. ఆ తర్వాత ఒక నిమిషం పాటు గిరాగిరా తిప్పి, కలపాలి. 10 నిమిషాలు పక్కనపెట్టాలి. టెస్ట్‌ట్యూబ్‌ అడుగుభాగంలో ముదురు ఎరుపురంగు కనిపిస్తే.. నెయ్యిలో వనస్పతి కల్తీ చేసినట్లు అర్థం.

నీటి కల్తీని చేతిపైనా గుర్తించొచ్చు

పాలలో నీళ్లు కలిపారో, లేదో తెలుసుకోవడానికి అరచేతిని వెనుక వైపు తిప్పి.. మరో చేత్తో కొన్ని చుక్కల పాలను దానిపై పోయాలి. నాణ్యమైన పాలైతే సన్నటి ధారలా పారుతుంది. చేతిపై ఎంత దూరం ప్రవహించిందో అంత దూరం పాల చార కనిపిస్తుంది. నీళ్లు కలిపిఉంటే చార ఏర్పడకుండా.. చివరన తెల్లటి చుక్క నిలిచిపోతుంది. పాలలో పాలపొడిని, తినే సోడానూ కలుపుతారు. దీన్ని ప్రయోగశాలలో గుర్తించాల్సిందే. నాణ్యత విషయంలో రాజీపడని సంస్థల నుంచి కొనుగోలు చేయడంమేలు. అందుకు భారత ఆహార సంరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) లేబుల్‌ ఉన్నదే తీసుకోవాలి.

- వి.సుదర్శనరావు, విశ్రాంత శాస్త్రవేత్త, జాతీయ పోషకాహార సంస్థ

కల్తీ పాలతో తీవ్ర అనారోగ్య సమస్యలు

చేతిపంపులు, నల్లాలు, చెరువులు, కాలువల నీటిని పాలలో కలుపుతుంటారు. ఆ నీటిలో ఉండే హానికారక రసాయనాలు పాలలో కలసి కల్తీ అవుతాయి. పాలలో మంచినీరు కలపకపోతే.. పిల్లల జీర్ణకోశ వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుంది. వాంతులు, విరేచనాలతో బాధపడే అవకాశాలుంటాయి. టైఫాయిడ్‌, కామెర్లు వంటివి రావొచ్చు. కంటిచూపు దెబ్బతినే ప్రమాదమూ ఉంది. యూరియా, డిటర్జంట్లు కలపడం వల్ల కిడ్నీపై దుష్ప్రభావం పడుతుంది. యూరియా స్థాయి పెరిగితే అమ్మోనియంగా మారి.. గుండె, మెదడు, కాలేయం, నాడీ వ్యవస్థపై దుష్ప్రభావం పడుతుంది. కొన్నిరకాల పదార్థాలను కలపడం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్‌కూ దారితీయొచ్చు.

-డాక్టర్‌ అనిల్‌ చెరుకూరి, ప్రముఖ జీర్ణకోశ వైద్యనిపుణులు

ఇదీ చదవండి:

బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడికి 14 రోజుల రిమాండ్

ABOUT THE AUTHOR

...view details