రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా.. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ ఘనంగా జరిగింది. కొన్ని ప్రాంతాలు మినహా ఏపీ అంతటా.. వివిధ మతాలకు చెందిన మూడు పండుగలతో పాటు ప్రజలు నాలుగవ పండగగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. భారీ సంఖ్యలో లబ్ధిదారులు హాజరై.. నివేశన స్థలాలను అందుకున్నారు.
విశాఖ జిల్లాలో...
పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల్లో పక్కా గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలని.. విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ లబ్ధిదారులకు పిలుపునిచ్చారు. గొలుగొండలో సుమారు 162 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. సంక్షేమ పథకాలను పేదలకు అందించడంలో సీఎం జగన్ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య హాజరయ్యారు.
అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చేలా సీఎం జగన్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని.. అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. అనకాపల్లి మండలంలోని మారేడు పూడి, గోపాలపురం, సీహెచ్ఎం అగ్రహారంలో పలువురు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. ఆర్డీవో సీతారామారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మాడుగుల మండలంలో 1,363 మందికి ఉచితంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు అన్నారు. గత ప్రభుత్వం సొంత పార్టీ కార్యకర్తలకు పథకాలను అందజేయగా.. వైకాపా సర్కారు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.
ఇళ్ల పట్టాల పంపిణీ తర్వాత ఏర్పాటయ్యే గృహ సముదాయాలను పచ్చని వాకిళ్లుగా తయారు చేయాలన్నది తమ లక్ష్యమని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు. రావికమతం మండలం చిన్న పాచిలి, రోలుగుంట మండలం వడ్డిపలో ఆయన మొక్కలు నాటారు. ఈ కాలనీలను చక్కని ఉద్యానవనాలుగా తీర్చిదిద్దాలని కోరారు.
శ్రీకాకుళం జిల్లాలో...
సరుబుజిలి మండలం పురుషోత్తపురంలో స్పీకర్ తమ్మినేని సీతారాం.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్న సీఎం జగన్కు అందరం రుణపడి ఉంటామన్నారు.
విజయనగరం జిల్లాలో...
గరివిడి మండలం బొండపల్లిలో ఎంపీ బెల్లన చంద్రశేఖర్.. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. గ్రామంలో సుమారు 40 మంది మహిళలకు పట్టా పాస్ పుస్తకాలు అందజేశారు. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని.. 90 రోజుల్లో ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని తెలిపారు.
చిత్తూరు జిల్లాలో...
ఈనెల 28న శ్రీకాళహస్తి మండలంలో సీఎం జగన్ చేపట్టనున్న ఇళ్ల పట్టాలు పంపిణీని విజయవంతం చేయాలని.. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కోరారు. నియోజకవర్గంలో సుమారు 25వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందజేయనున్నట్లు వివరించారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
కర్నూలు జిల్లాలో...
నవరత్నాలులో భాగంగా పేదలందరికీ ఇళ్లు పంపిణీ ఓ మహాయజ్ఞం అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. బేతంచెర్ల మండలం ఆర్.ఎస్ రంగాపురంలో నవరత్నాలు ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు అందజేశారు. బేతంచెర్ల నుంచి రామళ్లకోటకు రూ. 42 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రహదారికి శంకుస్థాపన చేశారు.
ఇళ్ల పట్టాల పంపిణీతో రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొందని.. పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. మద్దికేరలో 208 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు అందజేశారు. నిరుపేదలకు స్థలం చూపడమే కాక ప్రభుత్వమే గృహ నిర్మాణమూ పూర్తి చేస్తుందన్నారు.
పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో రెండవరోజున.. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి బస్తిపాడులో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి గ్రామంలో మొదటి సారి ఇళ్ల పట్టాలు ఇస్తుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లాలో...
చీరాల మండలం సాల్మన్ నగర్లో జరిగిన ఇళ్ల స్థలాల పంపిణీలో.. ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత పాల్గొన్నారు. గతంలో నియోజకవర్గంలోని గృహనిర్మాణ శాఖ అధికారులు ఇష్టారాజ్యాంగా వ్యవహరించగా.. ఇప్పుడు అలాంటి పరిస్థితి రానీయమని తెలిపారు. మాజీమంత్రి పాలేటి రామారావు, వైకాపా రాష్ట్ర కార్యదర్శి వరికూటి అమృత పాణి, చీరాల తహసీల్దార్ హుస్సేన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కొమరోలులో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు.. పేదలకు ఇళ్ల స్థలాలను అందజేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 30 లక్షల మందికి పైగా.. ఇళ్ల పట్టాలు ఇవ్వడం సామాన్యమైన విషయం కాదన్నారు. ఒక్కో ఇంటికి రూ. 1,80,000 ఖర్చుతో ప్రభుత్వమే గృహం నిర్మించి లబ్ధిదారునికి ఇస్తుందని తెలిపారు.