CJI Justice NV Ramana : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణకు ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇవ్వనుంది. ఈ మేరకు వర్సిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 5న సాయంత్రం వర్సిటీలో జరగనున్న 82వ స్నాతకోత్సవంలో జస్టిస్ ఎన్.వి.రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. కులపతి హోదాలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరుకానున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం చివరిసారిగా 2001లో ప్రముఖ భారత-అమెరికన్ కంప్యూటర్ ఇంజినీర్ అరుణ్నేత్రావలికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. తర్వాత రెండు దశాబ్దాలుగా ఎవరికీ ఇవ్వలేదు.
CJI Justice NV Ramana: సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణకు ఓయూ గౌరవ డాక్టరేట్ - CJI Justice NV Ramana
CJI Justice NV Ramana: వచ్చే నెలలో ఉస్మానియా యూనివర్సిటీలో జరగనున్న 82వ స్నాతకోత్సవంలో జస్టిస్ ఎన్.వి.రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు వర్సిటీ అధికారులు వెల్లడించారు.

ఉస్మానియా యూనివర్సిటీ 105 ఏళ్ల చరిత్రలో 81 స్నాతకోత్సవాలు నిర్వహించింది. ఇప్పటి వరకు 47 మందికి మాత్రమే గౌరవ డాక్టరేట్లు ప్రకటించింది. తొలిసారిగా 1917లో నవాబ్ జమాదుల్ ముల్క్ బహదూర్కు ఇచ్చింది. తర్వాత విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, సి.రాజగోపాలాచారి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, బాబూ రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, బీఆర్ అంబేడ్కర్, డాక్టర్ వై.నాయుడమ్మ, డాక్టర్ మన్మోహన్సింగ్ వంటి ప్రముఖులెందరో ఓయూ నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. వారి సరసన జస్టిస్ ఎన్.వి.రమణ చేరనున్నారు. తెలుగు వ్యక్తి అయిన ఆయన.. దేశ సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిగా గతేడాది ఏప్రిల్ 24 నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను గౌరవ డాక్టరేట్కు ఎంపిక చేస్తూ ఓయూ నిర్ణయం తీసుకుంది.