ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 9, 2020, 8:54 PM IST

ETV Bharat / city

ఈనాడు గూడు.. కష్టం తీర్చి కన్నీళ్లు తుడిచింది

ప్రకృతి ప్రకోపంతో నిరాశ్రయులైన కేరళ వరద బాధితులకు సొంత గూడు ఏర్పడింది. 2018లో వరదతో సర్వం కోల్పోయిన అలెప్పీ వాసుల మోముల్లో... వెలుగులు విరిశాయి. వారికి అండగా నిలవడానికి రామోజీ గ్రూపు సంస్థలు వేసిన అడుగు... 121 కుటుంబాల్లో సంతోషం నింపింది. మానవతామూర్తుల అండతో నిర్మించిన ఇళ్లను... కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ లబ్ధిదారులకు అందజేశారు.

homes-distribution-to-kerala-flood-victims-by-ramoji-groups
homes-distribution-to-kerala-flood-victims-by-ramoji-groups

కేరళ వరద బాధితులకు ఈనాడు ఇళ్లు పంపిణీ

కనీవినీ ఎరుగని కుంభవృష్టితో రోడ్డున పడిన కేరళ వరద బాధితుల జీవితాల్లో... వెలుగులు వెల్లివిరిశాయి. ఈనాడు సహాయ నిధితో... 7 కోట్ల 77 లక్షల రూపాయలతో నిర్మించిన....121 రెండు పడక గదుల ఇళ్ల పట్టాలు, తాళాలను... లబ్ధిదారులకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అందించారు. కేరళ మంత్రులు థామస్‌ ఐజక్‌, సుధాకరన్‌, తిలోత్తమన్‌... ఈనాడు ఎండీ కిరణ్‌, ఈనాడు తెలంగాణ ఎడిటర్‌ డీఎన్ ప్రసాద్‌, మార్గదర్శి వైస్‌ ప్రెసిడెంట్‌ రాజాజీ..ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వరద బాధితులకు ఇళ్ల నిర్మాణం చేపట్టిన విధానాన్ని... కేరళ పర్యాటక అభివృద్ధి మండలి ఎండీ మైలవరపు కృష్ణతేజ వివరించారు.

రామోజీ గ్రూపు తపన అమోఘం: సీఎం విజయన్

రామోజీ గ్రూపు సంస్థల సాయంపై... కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హర్షం వ్యక్తం చేశారు. అలెప్పీ ప్రజలను ఆదుకోవాలని... రామోజీ ఫిల్మ్‌సిటీ బలంగా నిశ్చయించుకుందని కొనియాడారు. బాధితులకు ఆపన్న హస్తం ఇవ్వాలన్న తపన అమోఘమన్నారు. ఇళ్ల నిర్మాణంలో... యువ ఐఎఎస్ కృష్ణతేజ చురుకుగా వ్యవహరించారని అభినందించారు.

ఆదుకునేందుకు ఎప్పుడైనా సిద్ధమే: ఈనాడు ఎండీ

ఎక్కడ విపత్తులు వచ్చినా ఆదుకునేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉంటుందని ఈనాడు ఎండీ కిరణ్ చెప్పారు. తమ సాయంలో సంస్థ ఉద్యోగుల భాగస్వామ్యమూ ఉందన్నారు. ఇంత అందమైన ఇళ్లను నిర్మించిన 'కుటుంబ శ్రీ' సంస్థ కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించిన యువ ఐఎఎస్ కృష్ణతేజకు ధన్యవాదాలు తెలిపారు.

8 నెలల్లో 121 ఇళ్లు

ప్రణాళిక ప్రకారం ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని.. కేరళ పర్యాటక అభివృద్ధి మండలి ఎండీ కృష్ణతేజ చెప్పారు. ఎనిమిది నెలల కాలంలో 121 ఇళ్లను నిర్మించామని చెప్పారు. ఇంత మంచి ఇళ్లు రావడం పట్ల లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారని తెలిపారు.అంతకు ముందు... అలెప్పీ జిల్లా మరియకుళంలో నిర్మించిన ఇళ్లను ఈనాడు ఎండీ కిరణ్‌ పరిశీలించారు. నాణ్యతను పరిశీలించిన ఆయన.. లబ్ధిదారులతో మాట్లాడారు.

ఇదీ చదవండి:

మా కంటే రామోజీ గ్రూప్ తపనే ఎక్కువ: సీఎం విజయన్

ABOUT THE AUTHOR

...view details