ప్రపంచ వ్యాప్తంగా ఏ అస్థిర పరిస్థితి ఏర్పడినా.. ప్రభావం పడేది బంగారం ధరపైనే. ఇప్పుడు కరోనా భయాలు కూడా పసిడి ధరను విపరీతంగా పెంచేస్తున్నాయి. హైదరాబాద్లో మూడు రోజుల్లో రూ.2 వేలకు పైగా పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ధర వేగంగా పెరుగుతుందని తెలిపారు. బంగారం ధర మూడు రోజుల క్రితం రూ.42 వేలుగా ఉండేదని, ఇప్పుడు రూ.45వేలకు చేరుకుందని వెల్లడించారు.
ఇవే కారణాలా?
ప్రపంచానికి ముడిసరుకులందించే చైనాలో కొవిడ్ వైరస్ ఇప్పటికే వేల మందిని బలితీసుకుంది. దీని ప్రభావం వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలపై పడుతోంది. అంతర్జాతీయంగా వివిధ దేశాల కరెన్సీల విలువల్లో పెరుగుదల లేకపోవడం వల్ల వాటిలో పెట్టుబడి పెట్టేందుకు మదుపరులు ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితుల దృష్ట్యా బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించడం వల్ల బంగారం ధర పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.