ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 1, 2021, 3:29 AM IST

ETV Bharat / city

ఎన్నికల ప్రక్రియలో ఎస్ఈసీయే రథసారథి: హైకోర్టు

ఎన్నికల ప్రక్రియలో రథసారథి ఎస్ఈసీయేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఇంటింటికీ రేషన్ పంపిణీలో రాజకీయ నేతల ప్రమేయం ఉండదని అధికారుల ద్వారా పంపిణీ చేస్తామని.. ఎన్నికల కోడ్ కిందకు పంపిణీ ఏ విధంగా రాదో ఎస్ఈసీకి 2 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం వినతి సమర్పించుకునేందుకు స్వేచ్ఛనిచ్చింది. దానిపై ఐదు రోజుల్లో ఎస్ఈసీ తగు నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.

door to door ration distribution case verdict
ఇంటింటికీ రేషన్ పంపిణీపై హైకోర్టు ఆదేశం

వాహనాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ నిత్యావసరాల పంపిణీని తాత్కాలికంగా నిలిపివేస్తూ.... జనవరి 28న ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ.... పౌరసరఫరాలశాఖ కార్యదర్శి శశిధర్ అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కార్యక్రమాన్ని జూన్‌ 2019లోనే శాసనసభలో ప్రకటించారని... ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదించారు. ఈ ఏడాది జనవరి 21న ముఖ్యమంత్రి ఆ వాహనాలను ప్రారంభించారన్నారు. ఈ పథకం సంబంధిత వివరాల సమర్పణకు ఎస్ఈసీ నోటీసు పంపగా... సీఎస్ వాటిని అందించారని.... అయినా సరకుల పంపిణీ ప్రారంభాన్ని నిలువరిస్తూ ఉత్తర్వులిచ్చారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎస్ఈసీ నిర్ణయం ప్రజాహితం ప్రకారం లేదన్నారు. ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకుని.... ప్రవర్తన నియమావళి క్లాజ్‌(2) ప్రకారం అనుమతి ఇవ్వొచ్చన్నారు. పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీల రహితంగా జరిగేవన్నారు.

ఫిర్యాదులు అందాయి..

ఇంటింటికీ సరకుల పంపిణీ ప్రభావం, బలహీనవర్గాలకు ప్రయోజనం తదితర వివరాలను ఎస్ఈసీ పరిగణనలోకి తీసుకుంటుందని.. ఎస్ఈసీ తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. అధికార పార్టీకి చెందిన రంగులున్న వాహనాలను పంపిణీకి వినియోగించడంపై వివిధ రాజకీయ పక్షాల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. ఈ నేపథ్యంలోనే పరిశీలన కోసం పంపిణీని వాయిదా వేశారన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి.... ఎన్నికల కోడ్‌ను పరిశీలించారు. కొత్త, పాత పథకాలపై ఎస్ఈసీ షరతులు, నిషేధం విధించడాన్ని తప్పుపట్టలేమన్నారు. అయితే ఆ సమయంలో... పథకం స్వభావం, కొనసాగింపునకు ఉన్న ఆవశ్యకత, ప్రజాప్రయోజనానికి విరుద్ధమా? కాదా? వంటి విషయాలపై దృష్టి పెట్టాలన్నారు. పూర్తిస్థాయి నిషేధం విధించడం కన్నా.... రాజకీయ నేతలతో ప్రమేయం లేకుండా.... అభిమానుల ఉత్సవాలకు తావివ్వకుండా అధికార యంత్రాంగంతో ఆ పథక అమలుపై ఎస్ఈసీ దృష్టి పెట్టొచ్చన్నారు. ప్రజాపంపిణీ పథకం... ప్రజా అవసరాల్ని తీర్చేది అనడంలో సందేహం లేదన్నారు. సంక్షేమ పథకాలు రాజకీయ పార్టీల దాతృత్వంతో చేపట్టేవి కావని.. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో ఆ పథకాల లబ్ధిదారులు సమానంగా ఆర్థికాభివృద్ధి సాధించడం కోసమేనన్నారు.

పౌష్టికాహారం దేశ పౌరులందరికీ ప్రాథమిక హక్కని న్యాయమూర్తి అన్నారు. మరోవైపు... పంచాయతీ ఎన్నికలు నిష్పాక్షికంగా, సజావుగా నిర్వహించాల్సిన రాజ్యాంగ బాధ్యత ఎస్ఈసీపై ఉందన్నారు. ఈ రెండింటి మధ్య సమతుల్యం ఏవిధంగా చేయాలనేది ఎస్ఈసీ నిర్ణయించుకోవాలన్నారు. అన్ని వివరాలు పరిగణనలోకి తీసుకున్నాకే.... ప్రజా పంపిణీ వ్యవస్థను తాత్కాలికంగా నిలిపివేస్తూ.... ఎస్ఈసీ ప్రాథమికంగా నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో..... ఎస్ఈసీ చర్యలు దురుద్దేశంతో ఉన్నాయని కానీ... అధికార పరిధిని దాటి వ్యవహరించిందని కానీ చెప్పలేమన్నారు. అలాగే ఆకలితో ఉన్నవారికి నిత్యావసరాల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయిందన్న ప్రభుత్వ ఆందోళననూ విస్మరించలేమన్నారు. ఈ నేపథ్యంలో పథక సంబంధిత వివరాలను ఎస్ఈసీ ముందు ఉంచేందుకు రెండు రోజులు సమయం ఇస్తున్నామని అవసరమైతే సీఎస్, ఇతర అధికారుల వాదనలకు అవకాశమివ్వాలని ఎస్ఈసీకి ధర్మాసనం సూచించింది. ఈ విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు బలహీనవర్గాల ప్రజలు ఎంతమంది ప్రయోజనం పొందుతున్నారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని ఎన్నికల సంఘానికి సలహా ఇచ్చింది.

ఇదీ చదవండి:

ఏకగ్రీవాలు ఎందుకు..? ఎప్పుడు.. ఎక్కడ మొదలయ్యాయి..?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details