ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'జీవో 2430'లో రద్దయిన జీవోలు ఎందుకు?: హైకోర్టు - high court reacts on GO 2430

రద్దయిన జీవో 938ని ప్రస్తావిస్తూ... జీవో 2430ని ప్రభుత్వం ఇవ్వడంపై దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. జీవో 938ని రిఫరెన్స్​గా ఎందుకు పేర్కొన్నారో వివరణ ఇవ్వాలని  ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

high court reacts  on 2430 go
'జీవో 2430'లో రద్దయిన జీవోలు ఎందుకని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

By

Published : Nov 28, 2019, 6:34 AM IST

రద్దయిన జీవో 938 వివరాలను ప్రస్తావిస్తూ మీడియాపై కేసులు పెట్టేందుకు వీలుగా జీవో 2430 ఎలా ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రద్దు అయిన జీవోని రిఫరెన్స్​గా ఎందుకు పేర్కొన్నారో వివరణ ఇవ్వాలంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ తరపు న్యాయవాది జీవో 2430 అమలును నిలుపుదల చేయాలని కోరగా... అతని అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. ప్రభుత్వ వాదన వినకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టంచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ శ్యాంప్రసాద్​లతో కూడిన ధర్మాసనం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

జీవో 2430ని సవాలు చేస్తూ పిల్

అక్టోబర్ 30న రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 2430ని సవాలు చేస్తూ హైదరాబాద్​కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ తరపు న్యాయవాది ఎం. వేణుమాధవ్ వాదనలు వినిపిస్తూ...జీవో 2430 పత్రికా స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ హక్కు హరించేలా ఉందన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేక వార్తలు రాస్తే కేసులు పెట్టేందుకు వీలుగా జీవో ఉందని తెలిపారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ...జీవోలో తప్పేముందని...ఆ జీవోతో మీరు ఏధంగా ప్రభావితులవుతారని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.

ఉనికి లేని జీవో...ప్రభుత్వానికి రిఫరెన్సా?

పత్రికలు, టీవీ ఛానళ్లలో నిరాధార వార్తలు వస్తే కేసులు పెట్టేందుకు వీలుగా 2007 ఫిబ్రవరి 20న అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం జీవో 938 ఇచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. జర్నలిస్టుల విజ్ఞప్తితో మొదట ఇచ్చిన జీవో 938 రద్దు చేస్తూ...2017 ఫిబ్రవరి 22న జీవో 980ని ప్రభుత్వం ఇచ్చిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రద్దు చేసిన జీవో వివరాల్ని ప్రస్తావిస్తూ తాజాగా జీవో 2430ని ఇచ్చారన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం...ఉనికిలో లేని జీవోని రిఫరెన్స్​గా పేర్కొంటూ తాజా జీవో ఎలా ఇచ్చారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించింది. రిఫరెన్స్ లేకుండానే తాజా జీవో ఇచ్చుకోవచ్చని వ్యాఖ్యానించింది. పిటిషనర్ తరపు న్యాయవాది జీవో 2430 అమలను నిలుపుదల చేయాలని కోరగా... అందుకు ధర్మాసనం నిరాకరించింది. ప్రభుత్వ వాదన వినకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టంచేసింది.

ఇదీ చూడండి: ఎన్టీఆర్ సుజల పథకం... ఇక నిర్వహించలేం..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details